ఏసీడీ బిల్లు కేవలం డిపాజిట్ మాత్రమే!
ABN , First Publish Date - 2023-01-25T04:34:20+05:30 IST
ఏసీడీ బిల్లు అనేది కేవలం డిపాజిట్ మాత్రమేనని ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్రావు అన్నారు.
వడ్డీ కూడా లెక్కించి బిల్లులో సర్దుబాటు చేస్తాం
వినియోగదారులు సహకరించాలి
ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు
హనుమకొండ రూరల్: ఏసీడీ బిల్లు అనేది కేవలం డిపాజిట్ మాత్రమేనని ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్రావు అన్నారు. విద్యుత్తు నియంత్రణ మండలి రెగ్యులేషన్ నంబర్ 6(2004) ప్రకారం ప్రతి వినియోగదారుడు గడిచిన సంవత్సరం వినియోగించిన రెండు నెలల సగటు విద్యుత్తు వినియోగ యూనిట్లకు సమానంగా సెక్యూరిటీ డిపాజిట్ను విద్యుత్తు సంస్థ వద్ద నిల్వ ఉంచాల్సి ఉంటుందన్నారు. వినియోగదారులు కొత్త సర్వీసు తీసుకునేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటామని, తర్వాత వారు వాడుకునే యూనిట్లను బట్టి ఏసీడీ లెక్కిస్తామని తెలిపారు. దానిలో నుంచి వినియోగదారుడు చెల్లించిన డిపాజిట్ను మినహాయించి నికర మొత్తాన్ని విద్యుత్తు బిల్లులో ఏసీడీగా చూపిస్తామన్నారు. డిపాజిట్ రూపంలో ఉంటున్నందున దీన్ని కిరాయిదారులు కాకుండా ఇంటి యజమానులే చెల్లించాలని సూచించారు. ఈ డిపాజిట్పై ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఏటా వడ్డీని లెక్కించి బిల్లులో సర్దుబాటు చేస్తామన్నారు. వినియోగదారుల నుంచి వసూలు చేసిన డెవల్పమెంట్ చార్జీలు, ఏసీడీ బిల్లును సంస్థ అభివృద్ధికి వినియోగిస్తామని గోపాల్రావు వివరించారు. కొంత మంది వినియోగదారులు విద్యుత్తు సంస్థలపై నిందలు వేస్తున్నారని, ఇది సరి కాదని అన్నారు. నిబంధనల ప్రకారం విధించిన అదనపు సెక్యూరిటీ డిపాజిట్ను చెల్లించి, మెరుగైన సేవలు అందించడానికి సహకరించాలని కోరారు.
రెండు నెలల అడ్వాన్సుగా!
జెన్కోల నుంచి కరెంట్ కొనుగోలు చేసి, వినియోగదారులకు అందించే విద్యుత్తు సంస్థలు కరెంట్ సరఫరా చేసిన రెండు నెలల తర్వాత బిల్లులు వసూలు చేస్తాయి. (డిసెంబరు 1 నుంచి 31 దాకా కరెంట్ సరఫరా చేసి, జనవరి 1న బిల్లు జారీ చేసి... ఆ బిల్లు కట్టడానికి 14 రోజులు గడువు, ఆలోగా కట్టకపోతే మరో 14 రోజుల సమయం ఇస్తున్నారు) అందుకే రెండు నెలల బిల్లును సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో వసూలు చేసుకోవాలని టీఎ్సఈఆర్సీ వెసులుబాటు ఇచ్చింది. అయితే గతంలో పారిశ్రామిక, హైటెన్షన్(వాణిజ్య) వినియోగదారుల నుంచి మాత్రమే ఏసీడీ చార్జీలు వసూలు చేసేవారు. ఉత్తర డిస్కమ్(ఎన్పీడీసీల్)లో వ్యవసాయ వినియోగదారులు కాకుండా 45 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటిదాకా 300 యూనిట్ల దాకా వినియోగం ఉన్నవారి నుంచి మాత్రమే ఏసీడీ చార్జీలను వసూలు చేయగా.. తాజాగా అన్నిరకాల వినియోగదారుల నుంచి ఏసీడీ బిల్లులు వసూలు చేస్తున్నారు. డిపాజిట్ మొత్తానికి వడ్డీ చెల్లిస్తామని డిస్కమ్లు చెబుతుండగా.. ఏ రోజు కూడా అలా వినియోగదారుడికి చెల్లించిన దాఖలాల్లేవు.