Tollywood vs Bollywood సినీ తారల టీ20 మ్యాచ్
ABN , First Publish Date - 2023-01-23T11:21:52+05:30 IST
మాదక ద్రవ్యాలు వద్దు(సే నో టు డ్రగ్స్) అన్న నినాదంతో క్రెసెంట్ క్రికెట్ కప్(సీసీసీ) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26న
హైదరాబాద్ సిటీ: మాదక ద్రవ్యాలు వద్దు(సే నో టు డ్రగ్స్) అన్న నినాదంతో క్రెసెంట్ క్రికెట్ కప్(సీసీసీ) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26న నగరంలోని ఎల్బీ స్టేడియంలో బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ సినీ తారల టీ-20 మ్యాచ్ను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం బంజారా హిల్స్లోని ఓ హోటల్లో సీసీసీ విన్నర్, రన్నర్ కప్లను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆవిష్కరించారు. క్రెసెంట్ క్రికెట్ కప్(సీసీసీ) చైర్మన్ కేఎం షకీల్ సఫీ మాట్లాడుతూ మ్యాచ్ పూర్తిగా ఉచితమని, తిలకించేందుకు ఆసక్తి గల వారు సీసీసీ వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకుని పాస్లను పొందవచ్చన్నారు. పాస్లు ఉన్నవారికి మాత్రమే ప్రవేశం అన్నారు.
మ్యాచ్ మధ్యాహ్నం 12కు ప్రారంభమై సాయంత్రం 6 గంటలలోపు ముగుస్తుందన్నారు. అనంతరం టాలీవుడ్, బాలీవుడ్ జట్లు ‘సే ఎస్ టు లైఫ్.. నో టూ డ్రగ్స్’ అని ప్రమాణం చేశారు. కార్యక్రమంలో సినీ తారలు హమీద్, రవిప్రకాష్, రాజ్తరుణ్, రేవంత్, వీజే సన్నీ, వరుణ్ సందేశ్, తనీష్, శ్రావణ్, ఖయ్యూం, యాంకర్ రవి, కొమురన్న, బాలీవుడ్ నటులు అఫ్తాబ్ శివదాసని, శాన్వర్ అలీ, బాలీవుడ్, టాలీవుడ్ టీం స్పాన్సర్లు శ్రీనివాస్, శ్రీనివాస్రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.