సుసంపన్న వారసత్వం.. తెలంగాణ సొంతం

ABN , First Publish Date - 2023-04-18T03:24:10+05:30 IST

నాటి ఆది మానవుని కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకూ.. ప్రతీ చారిత్రక దశకు సంబంధించిన మహోజ్వల వారసత్వ సంపద తెలంగాణ నేలకు సొంతమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు తెలిపారు.

సుసంపన్న వారసత్వం.. తెలంగాణ సొంతం

ఆదిమానవుడు మొదలు అసఫ్‌ జాహీలదాకా ఘన చరిత్ర

వైవిధ్యభరితమైన నిర్మాణాలకు పుట్టినిల్లు

45 వేల ఏళ్ల క్రితమే మానవ సంచారం: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): నాటి ఆది మానవుని కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకూ.. ప్రతీ చారిత్రక దశకు సంబంధించిన మహోజ్వల వారసత్వ సంపద తెలంగాణ నేలకు సొంతమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు తెలిపారు. ఏప్రిల్‌ 18న ‘వరల్డ్‌ హెరిటేజ్‌ డే’ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికున్న చారిత్రక ప్రాశస్త్యాన్ని సీఎం కేసీఆర్‌ స్మరించుకున్నారు. నాటి ప్రాచీన భారతదేశంలో ఆవిర్భవించిన షోడశ(16) మహా జనపథాల్లో దక్షిణ భారతదేశంలో విలసిల్లిన ఒకే ఒక జనపథమైన అస్మక మహాజనపథం తెలంగాణ ప్రాంతంలో నేటి బోధన్‌(నాటి పౌధన్య పురం) కేంద్రంగా వెలుగొందడం తెలంగాణ గడ్డకున్న ప్రాచీనతను, ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటుతున్నదని సీఎం పేర్కొన్నారు. శాతవాహన వంశం మొదలు అసఫ్‌ జాహీల వరకు సాగిన పాలన తెలంగాణను సుసంపన్నం చేశాయని తెలిపారు. 45 వేల ఏళ్ల క్రితమే తెలంగాణలో మానవ సంచారం సాగిందనడానికి నేటి జయశంకర్‌ భూపాల్‌పల్లి జిల్లాలోని పాండవుల గుట్టలో లభ్యమైన ప్రాచీన మానవుని పెయింటింగ్స్‌ నిదర్శనమని పేర్కొన్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని ప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చడం తెలంగాణ ప్రజలకు, దేశానికి గర్వకారణమన్నారు.

దోమకొండ కోటకు యునెస్కో ఆసియా పసిఫిక్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ కన్జర్వేషన్‌ అవార్డు, కుతుబ్‌షాహి టూంబ్స్‌ కాంప్లెక్స్‌లోని మెట్లబావికి యునెస్కో అవార్డు.. వంటి పలు అంతర్జాతీయ అవార్డులతో ఘనమైన తెలంగాణ వారసత్వం ప్రపంచ వారసత్వ సంపదగా వెలుగులోకి వచ్చిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత వీటి పరిరక్షణలో భాగంగా ఖిలావరంగల్‌ కోట ఆధునీకరణ, చార్మినార్‌, మక్కా మసీదు వంటి గొప్ప ప్రాచీన కట్టడాలకు మరమ్మతులు, మోజంజాహి మార్కెట్‌, మోండా మార్కెట్‌ అభివృద్ధి పనులతో పాటు మరెన్నో కట్టడాలు, ప్రాచీన నిర్మాణాల మరమ్మతులు, అభివృద్ధి పనులు ప్రభుత్వం చేపడుతున్నదని సీఎం తెలిపారు. ఇటీవలె 300 ఏళ్లనాటి బన్సీలాల్‌ పేట మెట్ల బావితో సహా మరో ఆరు మెట్ల బావులను పునరుద్ధరించిన రాష్ట్ర ప్రభుత్వం రానున్న కాలంలో ఇటువంటి మరిన్ని బావులను గుర్తించి పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. తెలంగాణ వారసత్వ సంపద పరిరక్షణలో రాష్ట్ర పురావస్తు, సాంస్కృతిక, పర్యాటకశాఖల కృషిని ఆయన అభినందించారు. ఈ దిశగా తెలంగాణ చరిత్రకారులు, మేధావులు స్వచ్ఛందంగా కొనసాగిస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. తెలంగాణ చరిత్రను కాపాడుకోవడంలో తెలంగాణ పౌరులు, చైతన్యవంతమైన యువత భాగస్వామ్యం మరింతగా పెరగాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు.

Updated Date - 2023-04-18T03:24:11+05:30 IST