బీజేపీపై పోరాడేది ప్రాంతీయ పార్టీలే..
ABN , First Publish Date - 2023-02-21T04:13:05+05:30 IST
కేంద్రం లోని అధికార బీజేపీపై పోరాడే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉందని, కాంగ్రె్సకు ఏమాత్రం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
తెలంగాణలో మాకు బీజేపీ ప్రత్యర్థి కాదు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): కేంద్రం లోని అధికార బీజేపీపై పోరాడే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉందని, కాంగ్రె్సకు ఏమాత్రం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమ వారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అడ్డదారిలో పడగొట్టిన బీజేపీ.. తెలంగాణలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చేసిన ప్రయత్నాన్ని అడ్డుకోగలిగామన్నారు. కాంగ్రెస్ పార్టీనే తన ప్రత్యర్థి అని చెప్పుకోవడం వల్ల బీజేపీకి ప్రయోజనమని, రాహుల్ గాంధీయే తన ప్రత్యర్థిగా ఉండాలని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ కన్నా.. బీఆర్ఎస్, డీఎంకే, బీజేడీ, టీఎంసీ, ఆమ్ఆద్మీ పార్టీలకే అధిక సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లున్నాయన్నారు. తెలంగాణలో భారత్ జోడో యాత్ర జరుగుతున్న సమయంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయిందని, ఆ స్థానాన్ని కైవసం చేసుకున్న బీఆర్ఎస్ బీజేపీని ఓడించిందన్నారు. తెలంగాణలో తమకు(బీఆర్ఎ్సకు) ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కాదని, ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ప్రజాబలం లేదని, వచ్చే ఎన్నికల్లో ఈ విషయం రుజువవుతుందని జోస్యం చెప్పారు. కాగా, బీఆర్ఎస్ నాందేడ్లో నిర్వహించిన సభ ప్రభావం మహారాష్ట్ర వాసులపై పడిందని, తెలంగాణ పథకాలను ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని కవిత తెలిపారు. సాగర్ వరదే అనే వ్యక్తి పార్టీలో ఎలా చేరాలంటూ ట్విటర్ ద్వారా తనను కోరడమే ఇందుకు నిదర్శనమన్నారు. సాగర్ ఫోన్ నంబర్, ఇతర వివరాలను పంపాలని సమాధానం ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు.