వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్రెడ్డిపై పీడీయాక్ట్
ABN , First Publish Date - 2023-02-11T05:12:20+05:30 IST
నలభై మందితో కలిసి, పట్టపగలు డెంటిస్ట్ వైశాలి ఇంటిపై దాడి చేసి, ఆమెను కిడ్నాప్ చేసిన సంచలన కేసులో.. నిందితుడు కొడుదుల నవీన్ రెడ్డిపై పీడీయాక్ట్ను ప్రయోగించారు.
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి (ఆంధ్రజ్యోతి): నలభై మందితో కలిసి, పట్టపగలు డెంటిస్ట్ వైశాలి ఇంటిపై దాడి చేసి, ఆమెను కిడ్నాప్ చేసిన సంచలన కేసులో.. నిందితుడు కొడుదుల నవీన్ రెడ్డిపై పీడీయాక్ట్ను ప్రయోగించారు. ఆదిభట్ల పోలీస్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో.. కేసు తీవ్రత దృష్ట్యా రాచకొండ సీపీ డీఎస్. చౌహాన్ శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం నవీన్రెడ్డి చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మిస్టర్ టీ పేరుతో చైన్ టీషాపులు నిర్వహిస్తున్న నవీన్ రెడ్డి ప్రేమ పేరుతో వైశాలికి దగ్గరయ్యాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఆమె తిరస్కరించడంతో పగ పెంచుకున్నాడు. వైశాలి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందని తెలుసుకొని తన వద్ద పనిచేస్తున్న 40 మందితో కలిసి దాడి చేసి, ఆమె కుటుంబ సభ్యులను బెదిరించి వైశాలిని కారులో తీసుకెళ్లాడు. వెంటనే పోలీస్ కే సు నమోదు కావడంతో, ఆమెను వదిలి పారిపోయాడు. ఆ తర్వాత పోలీసుల చేతికి చిక్కాడు.