మజ్లిస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీర్జా రహ్మత్‌ బేగ్‌

ABN , First Publish Date - 2023-02-22T02:56:22+05:30 IST

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి మజ్లిస్‌ అభ్యర్థిగా మీర్జా రహ్మత్‌ బేగ్‌ పేరును పార్టీ అఽధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ మంగళవారం ప్రకటించారు. S

మజ్లిస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీర్జా రహ్మత్‌ బేగ్‌

మద్దతు ఇవ్వనున్న బీఆర్‌ఎస్‌

పోటీకి బీఆర్‌ఎస్‌ దూరం అంటూ ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి మజ్లిస్‌ అభ్యర్థిగా మీర్జా రహ్మత్‌ బేగ్‌ పేరును పార్టీ అఽధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ మంగళవారం ప్రకటించారు. ప్రస్తుత ఎమ్మెల్సీ సయ్యద్‌ అమీనుల్‌ హసన్‌ జాఫ్రీ పదవీకాలం మే 1న ముగియనుంది. ఈ స్థానానికి మార్చి 13న ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో పార్టీలో చురుకైన కార్యకర్తగా అంకిత భావంతో పనిచేస్తున్న మీర్జా రహ్మత్‌ బేగ్‌ను ఎమ్మెల్సీ అభ్యర్ధిగా మజ్లిస్‌ ప్రకటించింది. మరోవైపు.. మజ్లిస్‌ అభ్యర్థికి బీఆర్‌ఎస్‌ మద్దతునివ్వనుంది. గతంలో మాదిరిగానే ఆ సీటును తమకే కేటాయించి మద్దతు ప్రకటించాలని మిత్రపక్షమైన మజ్లిస్‌ చేసిన అభ్యర్థన మేరకు.. మంగళవారం పార్టీ సీనియర్లతో చర్చించిన బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. తమకు మద్దతు ప్రకటించిన కేసీఆర్‌కు ఒవైసీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా, హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల స్థానాల్లో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ పోటీకి దూరంగా ఉండనున్నట్లు ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 15 మంది నామినేషన్లు

హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 15 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 23న మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్‌ దాఖలుకు అవకాశం ఉందని రిటర్నింగ్‌ అధికారి ప్రియాంక ఆల తెలిపారు.

Updated Date - 2023-02-22T02:56:23+05:30 IST