రూ.కోటికి పైగా కుచ్చుటోపీ

ABN , First Publish Date - 2023-02-21T01:29:04+05:30 IST

యూట్యూబ్‌లో వీడియోలు లైక్‌ చేయడం, అడ్వర్టైజ్‌మెంట్‌లు క్లిక్‌ చేసే పార్ట్‌టైం జాబ్‌తో లక్షలు సంపాదించవచ్చని నమ్మించిన సైబర్‌ కేటుగాళ్లు నగరానికి చెందిన ఇద్దరి నుంచి కోటికి పైగా దండుకున్నారు.

రూ.కోటికి పైగా కుచ్చుటోపీ

పార్ట్‌ టైం జాబ్‌ అంటూ సైబర్‌ నేరగాళ్ల ఎర

యూట్యూబ్‌లో లైక్‌ చేస్తే లక్షలు అంటూ మోసం

హిమాయత్‌నగర్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): యూట్యూబ్‌లో వీడియోలు లైక్‌ చేయడం, అడ్వర్టైజ్‌మెంట్‌లు క్లిక్‌ చేసే పార్ట్‌టైం జాబ్‌తో లక్షలు సంపాదించవచ్చని నమ్మించిన సైబర్‌ కేటుగాళ్లు నగరానికి చెందిన ఇద్దరి నుంచి కోటికి పైగా దండుకున్నారు. మూడు నెలల క్రితం మెహిదీపట్నంకు చెందిన ఒక ప్రైవేట్‌ ఉద్యోగికి టెలీగ్రామ్‌ యాప్‌లో ఒక మెసేజ్‌ వచ్చింది. పార్ట్‌టైమ్‌ జాబ్‌ ద్వారా ఇంట్లోనే ఉంటూ నెలకు లక్షలు సంపాదించవచ ్చనేది ఆ మెసేజ్‌లోని సారాంశం. ఆకర్షితుడైన సదరు వ్యక్తి మెసేజ్‌తోపాటు వచ్చిన లింక్‌ను క్లిక్‌ చేశాడు. రిజిస్ర్టేషన్‌ కోసం కొంత చెల్లించాలంటూ మరో మెసేజ్‌తోపాటు యూపీఐ లింక్‌ కూడా వచ్చింది. ముందుగా రూ.లక్ష చెల్లించాడు. ఆ తర్వాత కాల్‌ చేసిన కేటుగాళ్లు యూట్యూబ్‌ వీడియోలు అందులో వచ్చే యాడ్స్‌ క్లిక్‌ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని నమ్మబలికారు. ముందుగా పది, ఇరవై వేలు అతనికి చెల్లించి ముగ్గులోకి లాగారు. యూట్యూబ్‌ సంస్థతో నేరుగా కాంట్రాక్ట్‌ కుదుర్చుకోవాలని, అపుడే కోట్లు సంపాదించవచ్చని మాయమాటలు చెప్పి విడతల వారీగా రూ.56 లక్షలు యూపీఐ పేమెంట్‌ యాప్స్‌ ద్వారా లాగేశారు. మరో రూ.పది లక్షలు వేయాలని కేటుగాళ్లు డిమాండ్‌ చేయడంతో అనుమానించిన బాధితుడు సైబర్‌ క్రైమ్స్‌ పోలీసులను ఆశ్రయించాడు.

మరోవైపు బంజారాహిల్స్‌కు చెందిన మరో ప్రైవేటు ఉద్యోగిని కూడా ఇదే తరహాలో ట్రాప్‌ చేసిన కేటుగాళ్లు మొత్తం రూ.యాబై లక్షలు లాగేశారు. రెండు ఫిర్యాదులు ఒకేరోజు నమోదయ్యాయని క్రైమ్స్‌ ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ తెలిపారు. ఒకే కేటుగాళ్ల ముఠా టెలిగ్రామ్‌ యాప్‌ యూజర్లను టార్గెట్‌ చేసుకొని ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లుగా కనిపిస్తుందని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Updated Date - 2023-02-21T01:29:13+05:30 IST