నేడు హైదరాబాద్‌కు కేజ్రీ

ABN , First Publish Date - 2023-05-27T03:12:44+05:30 IST

కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పోరుకు సిద్ధమవుతున్నారు.

నేడు హైదరాబాద్‌కు కేజ్రీ

కొత్త ఆర్డినెన్స్‌పై పోరాటానికి మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరనున్న ఢిల్లీ ముఖ్యమంత్రి

ఇప్పటికే పలువురి మద్దతు కోరిన అరవింద్‌ కేజ్రీవాల్‌

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పోరుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి శనివారం ఉదయం 11 గంటలకు ఆయన చేరుకుంటారు. సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యాక మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. కేజ్రీవాల్‌తో పాటు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో గ్రూప్‌–ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం మే 19న ప్రత్యేక ఆర్డినెన్స్‌ జారీ చేసింది. సంబంధిత ఉద్యోగుల విషయాలపై నిర్ణయాలు తీసుకోవడానికి, జాతీయ రాజధాని సివిల్‌ సర్వీస్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఢిల్లీ ముఖ్యమంత్రి చైర్మన్‌గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.

మెజారిటీ సభ్యుల నిర్ణయం ప్రకారం ఉద్యోగుల బదిలీలు, నియామకాలు జరుగుతాయని ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. అయితే, ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై నియంత్రణాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును అమలు పర్చాలని కేజ్రీవాల్‌ సర్కార్‌ డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు పలువురు నేతలను కేజ్రీవాల్‌ కలుస్తున్నారు. ఇప్పటికే బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్‌ ఠాక్రే తదితరులతో భేటీ అయిన ఆయన.. శనివారం కేసీఆర్‌తో భేటీ కానున్నారు.

Updated Date - 2023-05-27T03:14:32+05:30 IST