నిరు పేదల తరఫున ఉచిత న్యాయవాదులు
ABN , First Publish Date - 2023-02-07T03:22:17+05:30 IST
నిరుపేదల తరఫున కోర్టుల్లో ఉచితంగా వాదనలు వినిపించడానికి న్యాయవాదుల వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెళ్ల సిస్టం (ఎల్ఏడీసీఎస్) పేరుతో సహాయ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టం ఏర్పాటు
ప్రారంభించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): నిరుపేదల తరఫున కోర్టుల్లో ఉచితంగా వాదనలు వినిపించడానికి న్యాయవాదుల వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెళ్ల సిస్టం (ఎల్ఏడీసీఎస్) పేరుతో సహాయ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 16 జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సోమవారం వర్చువల్ గా ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర లీగల్సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావు పాల్గొన్నారు. ఆయా కేంద్రాల్లో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెళ్లను, డిప్యూటీ, అసిస్టెంట్ కౌన్సెళ్లను నియమించారు. ఆదిలాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి జిల్లాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ జైళ్లలో అండర్ ట్రయల్ ఖైదీలే ఎక్కువని, వీరంతా బలహీనవర్గాలకు చెందిన వారేనని అన్నారు. వారికి ఈ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టం ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్తులో మొత్తం 33 జిల్లాలకు వీటిని విస్తరిస్తామన్నారు.