కొత్త మెడికల్‌ కాలేజీలపై దృష్టి పెట్టండి

ABN , First Publish Date - 2023-03-26T02:16:31+05:30 IST

రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోయే 9 మెడికల్‌ కాలేజీల పనులు వేగవంతం చేయాలని వైద్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.

కొత్త మెడికల్‌ కాలేజీలపై దృష్టి పెట్టండి

ఈ ఏడాది తరగతులు ప్రారంభమవ్వాలి

10 రోజుల్లో 1,442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ.. అధికారులతో హరీశ్‌ రావు

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోయే 9 మెడికల్‌ కాలేజీల పనులు వేగవంతం చేయాలని వైద్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. అన్ని కాలేజీలు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) నుంచి అనుమతులు పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్‌ఎంసీ బృందం పరిశీలనకు వస్తున్న నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలని చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే వైద్య కళాశాలలపై శనివారం ఎంసీహెచ్‌ఆర్‌డీలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడారు. ఈ ఏడాది 9 మెడికల్‌ కాలేజీలను ప్రారంభించే క్రమంలో ఇప్పటికే 87 మందికి ప్రమోషన్లు ఇచ్చామని తెలిపారు. వారం రోజుల్లో కౌన్సెలింగ్‌ ద్వారా 210 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లకు పోస్టింగ్‌ ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. 1,442 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ చివరి దశకు చేరిందని, రెండు మూడు రోజుల్లో ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టు విడుదల చేసి, 10 రోజుల్లో తుది నియామక పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌన్సెలింగ్‌ నిర్వహించి 9 మెడికల్‌ కాలేజీల్లో వీరిని నియమించాలన్నారు. మెడికల్‌ కాలేజీల విషయంలో సమన్వయం కోసం మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, అజయ్‌ కుమార్‌, పలు జిల్లాల కలెక్టర్లతో హరీశ్‌ మాట్లాడారు. 9 కాలేజీల్లో వైద్య విద్యార్థులకు అవసరమయ్యే హాస్టల్‌ సహా అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. తరగతులు ప్రారంభమయ్యే నాటికి ఫర్నిచర్‌, సామగ్రి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది కరీంనగర్‌, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్‌, జనగాం, నిర్మల్‌, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఎంబీబీఎస్‌ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే క్లియర్‌ చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కోరారు. మెడికల్‌ కాలేజీల పనులు వేగవంతం చేసేందుకు ఈ నెల 28న ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇంజనీర్లు, కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామని తెలిపారు. వారం రోజుల్లో కాలేజీలను సందర్శించి, పనులు వేగిరం చేసేలా చర్యలు తీసుకోవాలని డీఎంఈ రమేశ్‌ రెడ్డిని మంత్రి ఆదేశించారు. ఈ ఏడాది 9 మెడికల్‌ కాలేజీలు ప్రారంభమైతే రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల సంఖ్య 26కు చేరుతుందని, ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 3,690కి పెరుగుతుందని చెప్పారు. సమీక్షలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్‌ రెడ్డి, టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌ కుమార్‌, నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప, టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌ రెడ్డి, చీఫ్‌ ఇంజనీర్‌, ఇతర ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T02:16:31+05:30 IST