సాగుకు తగ్గించారు!

ABN , First Publish Date - 2023-02-07T04:19:41+05:30 IST

రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, వ్యవసాయ యాంత్రీకరణ వంటి పథకాల నేపథ్యంలో వ్యవసాయ శాఖకు బడ్జెట్‌ కేటాయింపులు పెరుగుతాయని అందరూ భావించారు.

సాగుకు తగ్గించారు!

నిరుడు రూ.27,228 కోట్లు.. ఈసారి రూ.26,831 కోట్లే!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, వ్యవసాయ యాంత్రీకరణ వంటి పథకాల నేపథ్యంలో వ్యవసాయ శాఖకు బడ్జెట్‌ కేటాయింపులు పెరుగుతాయని అందరూ భావించారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించడం గమనార్హం. గత ఏడాది(రూ.27,228 కోట్లు)తో పోలిస్తే వ్యవసాయ శాఖకు రూ.397 కోట్ల నిధులు తక్కువ(రూ.26,831 కోట్లు) కేటాయించింది. రైతుబంధుకు బడ్జెట్‌ కేటాయింపులు పెరిగాయి. ఈ బడ్జెట్‌ నిరుడు రూ.14,800 కోట్లుగా ఉండగా.. ఈసారి రూ.15,075 కోట్లు(రూ.275 కోట్లు ఎక్కువ) కేటాయించారు. రైతుబీమా బడ్జెట్‌ కూడా గత ఏడాది రూ.1,466 కోట్లు ఉండగా.. ఈసారి రూ.1,519 కోట్లకు పెరిగింది. రుణమాఫీకి నిరుడు రూ.4 వేల కోట్లు కేటాయించగా ఈసారి రూ.6,385 కోట్లు కేటాయించడం గమనార్హం. ఆయిల్‌ పామ్‌కు నిరుటి మాదిరిగానే రూ.1000 కోట్లను ప్రకటించారు. వ్యవసాయ మార్కెటింగ్‌, ఉద్యాన, సహకార శాఖలకు కేటాయింపులు తగ్గించారు. అయితే బడ్జెట్‌ కేటాయింపులు, నిధుల విడుదలతో పోలిస్తే చాలా తేడాలున్నాయి. కేటాయింపుల స్థాయిలో నిధులను మాత్రం విడుదల చేయడం లేదు. 2021-22 వార్షిక బడ్జెట్‌లో రూ.26,822 కోట్లు కేటాయిస్తే.. రూ.23,312 కోట్లు ఖర్చుచేశారు. 2020-21లో రూ.25,305 కోట్లు కేటాయిస్తే.. రూ.17,808 కోట్లు మాత్రమే విడుదల చేశారు. 2019-20లో రూ.21,504 కోట్లు కేటాయిస్తే.. రూ.15,558 కోట్లే విడుదల చేశారు. 2022-23లో రూ.27,228 కోట్లు కేటాయించగా.. రూ.20 వేల కోట్లకు మించి విడుదల చేయలేదు.

Updated Date - 2023-02-07T04:19:42+05:30 IST