క్లోరిన్‌ సిలిండర్‌ లీకై.. వంద మందికి పైగా తీవ్ర అస్వస్థత

ABN , First Publish Date - 2023-02-17T03:32:31+05:30 IST

తాగు నీటి శుద్ధిలో భాగంగా ఉపయోగించే క్లోరిన్‌ గ్యాస్‌ లీకు కావడంతో సుమారు 100 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలయ్యారు. జనగామ జిల్లా కేంద్రంలోని సబ్‌జైలు ప్రాంతంలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

క్లోరిన్‌ సిలిండర్‌ లీకై.. వంద మందికి పైగా తీవ్ర అస్వస్థత

గొంతు, ఛాతీ నొప్పితో ఆస్పత్రులకు పరుగులు

తప్పిన ప్రాణాపాయం.. జనగామ జిల్లా కేంద్రంలో ఘటన

జనగామ, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): తాగు నీటి శుద్ధిలో భాగంగా ఉపయోగించే క్లోరిన్‌ గ్యాస్‌ లీకు కావడంతో సుమారు 100 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలయ్యారు. జనగామ జిల్లా కేంద్రంలోని సబ్‌జైలు ప్రాంతంలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. సబ్‌ జైలు ముందు నాలుగేళ్ల కిందున్న ట్యాంకును కూల్చేసి కొత్త ట్యాంకు నిర్మాణం చేపట్టారు. ఈ సమయంలోనే నీటిలో కలిపే క్లోరిన్‌ సిలిండర్‌ను మునిసిపల్‌ సిబ్బంది నిర్లక్ష్యంగా అక్కడే వదిలేశారు. అయితే గురువారం సాయంత్రం ట్యాంకు వద్ద వాసన రావడంతో స్థానికులు మునిసిపల్‌ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు వచ్చి చూడగా క్లోరిన్‌ సిలిండర్‌ లీకవుతూ ఉంది. దీంతో సిలిండర్‌ను నీటిలో వేస్తే తీవ్రత తగ్గుతుందని, నీటిలో వేశారు. తీవ్రత తగ్గకపోగా ఒక్కసారిగా గ్యాస్‌ లీకైంది. దీంతో సుమారు అర కి.మీ మేర క్లోరిన్‌ గ్యాస్‌ వ్యాపించింది. ఈ క్రమంలోనే సబ్‌జైలు, కోర్టు, గిర్నిగడ్డ, పోస్టాఫీస్‌ ఏరియా, మునిసిపల్‌ కార్యాలయం, జిల్లా ఆస్పత్రి ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. గొంతు, ఛాతీ నొప్పితో ఆస్పత్రులకు పరుగులు తీశారు. జిల్లా ఆస్పత్రిలో 50 మంది వరకు చేరగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో 50 మందికి పైగానే చేరారు. ఆస్పత్రుల్లో చేరిన వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుగుణాకర్‌రాజు తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌.. అక్కడికి వచ్చి బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అత్యవసరమైతే అంబులెన్స్‌లను ఏర్పాటు చేసి మెరుగైన చికిత్స కోసం పెద్దాస్పత్రులకు పంపిస్తామన్నారు. ప్రస్తుతం ఎవరికీ ప్రాణాపాయం లేదని ఆయన వెల్లడించారు.

Updated Date - 2023-02-17T03:32:35+05:30 IST