Avinash Reddy: అవినాశ్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు
ABN , First Publish Date - 2023-07-15T04:27:03+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దాఖలు చేసిన మూడో చార్జిషీట్ను హైదరాబాద్ సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు పరిగణనలోకి (కాగ్నిజెన్స్) తీసుకుంటూ ఉత్తర్వులు జారీచేసింది.
ఆగస్టు 14న హాజరు కావాలని ఆదేశాలు
వివేకాహత్య కేసులో ఏ-8గా కడప ఎంపీ
అనుబంధ చార్జిషీట్ను పరిగణించిన కోర్టు
హైదరాబాద్, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దాఖలు చేసిన మూడో చార్జిషీట్ను హైదరాబాద్ సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు పరిగణనలోకి (కాగ్నిజెన్స్) తీసుకుంటూ ఉత్తర్వులు జారీచేసింది. ఆగస్టు 14న కోర్టుకు ప్రత్యక్షంగా హాజరుకావాలంటూ అవినాశ్రెడ్డికి సమన్లు జారీచేసింది. సీబీఐ వేసిన అనుబంధ చార్జిషీట్లో 6వ నిందితుడిగా ఉదయ్కుమార్రెడ్డి, 7వ నిందితుడిగా భాస్కర్రెడ్డి, 8వ నిందితుడిగా కడప ఎంపీ అవినాశ్రెడ్డిని, అనుమానితులుగా ఎంవీ కృష్ణారెడ్డి, వంటమనిషి కుమారుడు ప్రకాశ్ను సీబీఐ పేర్కొన్నది. వివేకా హత్యకు కుట్ర చేయడం మొదలుకొని.. ఆధారాలను చెరిపివేసే వరకు వారి పాత్రను వివరించింది. ఈ చార్జిషీట్ను కాగ్నిజెన్స్ తీసుకున్న సీబీఐ కోర్టు, విచారణ కోసం ప్రత్యక్షంగా హాజరుకావాలని అవినాశ్రెడ్డిని ఆదేశించింది. శుక్రవారం కోర్టు విచారణకు చంచల్గూడ జైల్లో ఉన్న నిందితులు గంగిరెడ్డి, సునీల్యాదవ్, ఉమాశంకర్రెడ్డి, శివశంకర్రెడ్డి, ఉదయ్కుమార్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి హాజరయ్యారు. వీరందరికీ ఆగస్టు 14 వరకు కోర్టు రిమాండ్ను పొడిగించింది. అప్రూవర్ దస్తగిరి విచారణకు హాజరుకాలేదు. కాగా, అవినాశ్రెడ్డిని అరెస్ట్ చేస్తే రూ.ఐదు లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో వదిలేయాలని హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో సీబీఐ అవినాశ్రెడ్డిని అరెస్ట్ చేసి పూచీకత్తుతో వదిలేసింది. బెయిల్పై ఉన్న అవినాశ్రెడ్డిని హాజరయ్యేలా చూసే బాధ్యతను సీబీఐ కోర్టు....సీబీఐకి అప్పగించింది. వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరికాకుండా అవినాశ్రెడ్డి ఒక్కరే బయట ఉన్నారు.