Cab drivers : క్యాబ్ డ్రైవర్ల లబోదిబో
ABN , First Publish Date - 2023-06-25T01:58:04+05:30 IST
క్యాబ్లో సికింద్రాబాద్ నుంచి గచ్చిబౌలికి వెళ్లాలంటే మూడేళ్ల కిందట రూ.250-రూ.300 వరకు చార్జి ఉండేది. ఇప్పుడు అదే రూట్కు బుక్ చేస్తే కనీసం రూ.400 అవుతోంది.
మూడేళ్లలో తగ్గిన 45 వేల వాహనాలు..
డ్రైవర్లలో ఎక్కువగా ఇతర వృత్తులకు!
బుకింగ్లకు అగ్రిగేటర్ల తక్కువ ఫెయిర్
పోటీని తట్టుకోలేకపోతున్న డ్రైవర్లు
హైదరాబాద్ సిటీ, జూన్24(ఆంధ్రజ్యోతి): క్యాబ్లో సికింద్రాబాద్ నుంచి గచ్చిబౌలికి వెళ్లాలంటే మూడేళ్ల కిందట రూ.250-రూ.300 వరకు చార్జి ఉండేది. ఇప్పుడు అదే రూట్కు బుక్ చేస్తే కనీసం రూ.400 అవుతోంది. హైదరాబాద్లో ఏవైపు వెళ్లాలన్నా ఇదే పరిస్థితి. కొవిడ్ కన్నా ముందుతో పోలిస్తే క్యాబ్ చార్జీలు 25 నుంచి 40 శాతం పెరిగాయి. దీనికి ఎన్నో కారణాలున్నా.. అందులో ప్రధానమైనది క్యాబ్ల కొరతే. అద్దె తక్కువగా ఉండటం.. బుక్ చేయగానే ప్రత్యక్షం కావడంతో గతంలో సగటున ఒక్కో క్యాబ్కు 24 గంటల వ్యవధిలో 10 నుంచి 25 వరకు బుకింగ్లు వచ్చేవి. ప్రస్తుతం బుకింగ్లే కాదు క్యాబ్ల సంఖ్య కూడా తగ్గింది. మరోవైపు గతం కంటే యాప్ ఆధారిత బుకింగ్లోకి ఆటోలు, బైక్లు ఎక్కువగా వచ్చాయి. మూడేళ్లలో 18వేల బైక్లు, 70 వేల ఆటోలు కొత్తగా చేరాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
మూడేళ్లలో 30% డ్రాప్
2020కి ముందు హైదరాబాద్లో 1.25 లక్షల క్యాబ్లు తిరిగేవి. నేడు అవి 80 వేలు మాత్రమే. 45 వేల మంది డ్రైవర్లు క్యాబ్లు వదిలి మరో వృత్తి ఎంచుకోవాల్సి వచ్చింది. లాక్డౌన్లో ఇళ్లకే పరిమితమైన డ్రైవర్లను బ్యాంకులు, ఫైనాన్స సంస్థలు వదల్లేదు. వాయిదాలు చెల్లించాల్సిందేనని పట్టుబట్టి.. కట్టని వారి వాహనాలను సీజ్ చేశాయి. అనంతరం వేలం వేసి విక్రయించాయి. చిత్రమేమంటే.. క్యాబ్లన్నీ వ్యక్తిగత వాహనాలుగా మారిపోయాయి. ఇక సిబిల్ స్కోర్ తగ్గడంతో డ్రైవర్లు కొత్తవాహనం కొనుక్కోలేని దుస్థితి. ప్రస్తుతం 80వేల మంది డ్రైవర్లు క్యాబ్లు నడుపుతున్నా గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. ఐటీ సెక్టార్లో నడిచే క్యాబ్ డ్రైవర్లకు వెండర్స్, సబ్ వెండర్స్, దళారుల బెడద తప్పడం లేదు. వారందరి వాటా పోయిన తర్వాత వాయిదాలు కట్టాలని, ఏమైనా మిగిలితే కుటుంబ పోషణకు సరిపోతోందని ఓ డ్రైవర్ వాపోయాడు.
ఇక యాప్లో తిరిగే క్యాబ్ల బుకింగ్ ధరలను వాటి నిర్వాహకులే నిర్ణయిస్తారు. మూడేళ్ల క్రితం వరకు యాప్ ఆధారిత సెక్టార్లో ఆటోలు ఎక్కువ సంఖ్యలో లేవు. నేడు హైదరాబాద్లో తిరుగుతున్న 2 లక్షలపైగా ఆటోల్లో 60 వేల వరకు అగ్రిగేటర్లకు అనుసంధానమై ఉన్నవే. వీటికి తోడు బైక్లు కూడా రావడంతో క్యాబ్ బుకింగ్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇంకోవైపు వినియోగదారులకు నిరీక్షణ సమయం పెరిగింది. చాలామంది ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు. డ్రైవర్లు కూడా వినియోగదారులకు ఫోన చేసి రూట్, అద్దె వివరాలు తెలుసుకుని ఏజెంట్ల కమీషన్ పోగా మిగిలే లెక్క చూసుకుని గిట్టుబాటు అయితేనే రైడ్కు వస్తున్నారు. అగ్రిగేటర్లు చాలా సందర్భాల్లో ఆటోల కన్నా తక్కువ ధరలో ఏసీ క్యాబ్లు బుక్ చేసి డ్రైవర్కు ఏమీ మిగలకుండా చేస్తున్నారని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ చెబుతున్నారు. కనీస ధర ప్రామాణికత లేకుండా చేసి డ్రైవర్ల కడుపు కొడుతున్నారని వాపోయారు. బుకింగ్లను అయిష్టంగానే వదులుకోవాల్సి వస్తోందన్నారు. డ్రైవర్లు అధిక డబ్బు కోరడం వెనుక ఇదీ ఓ కారణమని చెప్పారు.