విద్యార్థుల అరెస్టు నిరంకుశత్వానికి నిదర్శనం: షర్మిల
ABN , First Publish Date - 2023-03-31T03:27:46+05:30 IST
పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని ఉద్యమిస్తున్న విదార్థులపై లాఠీచార్జీ చేయడం, అరెస్టుల పర్వం కొనసాగించడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని వైఎ్సఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.
హైదరాబాద్, మార్చి 30(ఆంధ్రజ్యోతి): పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని ఉద్యమిస్తున్న విదార్థులపై లాఠీచార్జీ చేయడం, అరెస్టుల పర్వం కొనసాగించడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని వైఎ్సఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పేపర్ లీకేజీపై ఉద్యమిస్తున్న ఓయూ, కేయూ విద్యార్థులపై సర్కార్ చేపడుతున్న అణచివేత చర్యలను ఆమె ఖండించారు. నోరెత్తితే కేసులు పెడతామని బెదిరించడం రౌడీల చర్యలను తలపిస్తున్నాయన్నారు. నాడు మా ఉద్యోగాలు మాకే అంటూ విద్యార్థులు కొట్లాడకపోతే, వందలాది మంది బలిదానాలు చేసుకోకపోతే తెలంగాణ వచ్చేదా? అని షర్మిల ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో పోటీ పరీక్షలు రాయొద్దని విద్యార్థులను రెచ్చగొట్టి కేసీఆర్ మోసం చేశారన్నారు. గడిచిన 9 ఏళ్లుగా ఊరించి.. ఊరించి వేసిన నోటిఫికేషన్లలో సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగాలు అందకుండా పోయాయని, 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు అంగడి పాలయ్యాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలకు లక్షలు కోచింగ్ సెంటర్లకు పోసి శిక్షణ తీసుకున్న నిరుద్యోగులకు భరోసా లేకుండా పోయిందన్నారు. పేపర్ లీకేజీపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు తక్షణ సహాయంగా రూ.50వేల ఆర్థిక సాయం ప్రకటించాలని షర్మిల డిమాండ్ చేశారు.