దండకారణ్య ఆదివాసులపై వైమానిక దాడులు రాజ్యాంగ విరుద్ధం:హరగోపాల్‌

ABN , First Publish Date - 2023-01-26T03:14:22+05:30 IST

దండకారణ్యంలోని ఆదివాసులపై కేంద్ర ప్రభుత్వ వైమానిక దాడులు రాజ్యాంగ విరుద్ధమని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ పేర్కొన్నారు.

దండకారణ్య ఆదివాసులపై వైమానిక దాడులు రాజ్యాంగ విరుద్ధం:హరగోపాల్‌

రాంనగర్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): దండకారణ్యంలోని ఆదివాసులపై కేంద్ర ప్రభుత్వ వైమానిక దాడులు రాజ్యాంగ విరుద్ధమని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ పేర్కొన్నారు. ప్రజలపై ప్రభుత్వం చేస్తున్న యుద్ధాన్ని ఆపాలంటూ ప్రజాస్వామ్యవాదులు డిమాండ్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుద్ధిజీవులు-ప్రజాస్వామికవాదుల ఆధ్వర్యంలో బుధవారం ‘దండకారణ్య ఆదివాసులపై వైమానికదాడులు రాజ్యాంగ వ్యతిరేకం’ అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హరగోపాల్‌ మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిపై జనవరి 11న దక్షిణ ఐస్తర్‌లోని కిష్టారం, పామేడు ప్రాంతంలో జరిగిన సైనికదాడి తీవ్ర దిగ్ర్భాంతి కలిగించిందన్నారు. హెలికాప్టర్‌లో కోబ్రా దళాలు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు వెళ్లి బాంబుల దాడి చేయడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ఈ దాడిలో పొట్టం అంగి అనే ఆదివాసీ యువతి మృతిచెందినట్టు చెప్పారు. జీవించే హక్కును కాపాడాల్సిన ప్రభుత్వమే దేశ ప్రజలపై వైమానిక దాడులు చేయడం బాధాకరమన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని పేర్కొన్నారు. దండకారణ్య ప్రాంతంలో సైనిక దాడులు జరపడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

Updated Date - 2023-01-26T03:14:44+05:30 IST