మళ్లీ మాదే అధికారం

ABN , First Publish Date - 2023-03-26T02:20:57+05:30 IST

రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్‌ఎ్‌సదే విజయమని, మరోసారి కేసీఆర్‌ ప్రభుత్వమే వస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక నాగోల్‌ మెట్రోను ఎల్బీనగర్‌కు కలుపుతామని, దానిని హయత్‌నగర్‌ వరకు పొడిగిస్తామని ప్రకటించారు.

మళ్లీ మాదే అధికారం

నాగోల్‌ మెట్రోను ఎల్బీనగర్‌కు కలుపుతాం

హయత్‌నగర్‌ వరకు పొడిగిస్తాం: కేటీఆర్‌

ఎల్బీనగర్‌ చౌరస్తాకు శ్రీకాంతచారి పేరు

ఎల్బీనగర్‌ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి

హైదరాబాద్‌/మన్సూరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్‌ఎ్‌సదే విజయమని, మరోసారి కేసీఆర్‌ ప్రభుత్వమే వస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక నాగోల్‌ మెట్రోను ఎల్బీనగర్‌కు కలుపుతామని, దానిని హయత్‌నగర్‌ వరకు పొడిగిస్తామని ప్రకటించారు. ఎస్‌ఆర్‌డీపీ పథకంలో భాగంగా వనస్థలిపురం నుంచి దిల్‌సుక్‌నగర్‌ మార్గంలో ఎల్బీనగర్‌ చౌరస్తా వద్ద నిర్మించిన మూడు లేన్ల ఫ్లైఓవర్‌ను మంత్రి శనివారం ప్రారంభించారు. 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో రూ.32 కోట్లతో దీనిని నిర్మించారు. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్‌ కష్టాలు తగ్గనున్నాయి. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో ఎస్‌ఆర్‌డీపీ పథకంలో భాగంగా రూ.658కోట్లతో మొత్త 12 పనులు చేపట్టామని, 9వ ప్రాజెక్టుగా ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. బైరామల్‌గూడలో మూడు ఫ్లైఓవర్లను ఈ సెప్టెంబరులోపు పూర్తి చేస్తే మొత్తం పనులన్నీ పూర్తవుతాయని, దాని తర్వాత ఎన్నికలకు వెళ్తామని అన్నారు. కొత్తగా చేపట్టిన వంతెనతో ఎల్బీనగర్‌ చౌరస్తాలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చేశామన్నారు. ఎల్బీనగర్‌లో వెయ్యి పడకలతో టిమ్స్‌ ఆస్పత్రి నిర్మిస్తున్నామని, దీనిని వచ్చే ఏడాదిన్నరలో అందుబాటులో తెస్తామని కేటీఆర్‌ ప్రకటించారు. జీవో-118 కింద డబ్బులు కట్టిన దరఖాస్తుదారులకు ఈ నెలాఖరు వరకు పట్టాలు అందిస్తామన్నారు. జివో 58, 59 కింద నగరంలో ఇప్పటివరకు 1.25 లక్షల మందికి పట్టాలు ఇచ్చామని, మరింత మందికి లబ్ధి కలగాలన్న లక్ష్యంతో గడువును పెంచామని తెలిపారు. ఇక ఎస్‌ఎన్‌డీపీ పథకంలో భాగంగా రూ.985 కోట్లతో వచ్చే వర్షాకాలం లోపు నాలాల అభివృద్ధి పనులు పూర్తిచేస్తామన్నారు. ఎల్బీనగర్‌ చౌరస్తాకు తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి పేరును, కొత్తగా ప్రారంభించిన ఫ్లైఓవర్‌కు మాల్‌ మైసమ్మ అమ్మవారి పేరును పెడుతున్నామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.

Updated Date - 2023-03-26T02:20:57+05:30 IST