కేంద్రంలో బీసీ శాఖను ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2023-03-31T03:40:18+05:30 IST
కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు.
చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి
రాహుల్ అంటే భయపడే మోదీ కక్షగట్టారు: ఉత్తమ్
హుజూర్నగర్, మార్చి 30: కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బీసీ క్రిమిలేయర్ను రద్దు చేయాలన్నారు. మోదీ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. బీసీ జనగణన చేయాలని కాంగ్రె్సతో పాటు మిగతా పార్టీలు కోరుతున్నా కేంద్రం ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై ఆయన మండిపడ్డారు. రాహుల్ను చూసి మోదీ భయపడుతున్నారని, అందుకే కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. లలిత్మోదీ దేశ క్రీడారంగాన్ని నాశనం చేసి, నిధులు దోచుకుని దేశం నుంచి పారిపోయి విదేశాల్లో లగ్జరీగా బతుకుతున్నాడన్నారు. లలిత్ మోదీ, నీరవ్ మోదీలు బీసీలు కారని, వారిని ఏదో అన్నారని రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. దొంగలను దొంగ అనకపోతే ఏమంటారని ప్రశ్నించారు.