Hyderabad: విమాన టికెట్ ఉంటేనే ఓఆర్ఆర్ ఎక్కాలి.. కార్లకు నో ఎంట్రీ..
ABN , Publish Date - Dec 30 , 2023 | 11:35 AM
నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల(Cyberabad and Rachakonda Commissionerates) పరిధిలోని ఔటర్ రింగ్రోడ్(Outer Ring Road)పై కార్లకు అనుమతి లేదని సీపీలు స్పష్టం చేశారు.
- భారీ-మీడియం వాహనాలకు అనుమతి
- పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పైనా ఇతర కార్లకు నో ఎంట్రీ
- నూతన సంవత్సరం సందర్భంగా ఆంక్షలు
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల(Cyberabad and Rachakonda Commissionerates) పరిధిలోని ఔటర్ రింగ్రోడ్(Outer Ring Road)పై కార్లకు అనుమతి లేదని సీపీలు స్పష్టం చేశారు. ఎయిర్పోర్టుకు వెళ్లే వారి కార్లను మాత్రమే అనుమతిస్తారు. సంబంధించిన విమాన టికెట్ వివరాలు చూసిన తర్వాతే ఓఆర్ఆర్పై ఆయా వాహనాలకు ఎంట్రీ ఉంటుంది. తిరిగి వచ్చే సమయంలో మాత్రం సాధారణ రోడ్డుపై నుంచే రావాల్సి ఉం టుంది. ఎయిర్పోర్టుకు వెళ్లే వారికి ఆలస్యం జరగకుండా ఉండేందుకు మాత్రమే చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఆ రోజు రాత్రి ఓఆర్ఆర్పై కార్లను మినహాయించి.. భారీ వాహనాలు, లారీలు, బస్సులు, ఇతర మీడియం వాహనాలు యథాతథంగా వెళ్లవచ్చని స్పష్టం చేశారు. ఆంక్షలు డిసెంబర్ 31న రాత్రి 10 నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము ఐదు గంటల వరకు అమల్లో ఉంటాయి. అలాగే, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పై కూడా రాత్రి 10 నుంచి ఉదయం ఐదు గంటల వరకు విమానాశ్రయం వెళ్లే వాహనాలకు తప్ప ఇతర వాహనాలకు అనుమతి లేదు.
ట్యాక్సీలు నిరాకరిస్తే రూ. 500 జరిమానా
డ్రంకెన్ డ్రైవ్ చర్యలు చేపడతామని... తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీలు హెచ్చరించిన విషయం తెలిసిందే. క్యాబ్లు/టాక్సీ/ఆటో రిక్షా ఆపరేటర్లు (కాంట్రాక్ట్ క్యారేజీలు) డ్రైవర్లు కచ్ఛితంగా అందుబాటులో ఉండాలన్నారు. డ్రైవర్లు యూనిఫామ్ ధరించడంతో పాటు అన్ని డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. క్యాబ్ డ్రైవర్లు ఎలాంటి పరిస్థితుల్లో రైడ్ నిరాకరించినా మోటారు వాహనాల చట్టం కింద రూ. 500 జరిమానా విధిస్తామని సీపీలు హెచ్చరించారు. డ్రైవర్ నిరాకరిస్తే బండి నెంబర్, సమయం, ప్రదేశం వివరాలతో వాట్సాప్ 9490617346 (సైబరాబాద్), 8712662111 (రాచకొండ)కు ఫిర్యాదు చేయాలని సూచించారు. డ్రైవర్లు కస్టమర్లతో అనుచితంగా ప్రవర్తించకుండా అదనపు ఛార్జీలు డిమాండ్ చేయరాదని పేర్కొన్నారు.
రాచకొండ పరిధిలో ఫ్లైఓవర్లు మూసివేత
ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు డిసెంబర్ 31 రాత్రి 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు నాగోల్ ఫ్లై ఓవర్, కామినేని, ఎల్బీనగర్, బైరామల్గూడ ఫ్లై ఓవర్లు, ఎల్బీనగర్ అండర్పాస్, చింతలకుంట అండర్పాస్ లను మూసివేస్తామని రాచకొండ సీపీ సుధీర్బాబు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని పట్టుబడిన వారి వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.