Hyderabad: మాటే మంత్రం.. దోచుడే లక్ష్యం..
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:06 PM
‘మా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టండి.. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు చూడండి.’ అంటూ కొందరు
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): ‘మా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టండి.. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు చూడండి.’ అంటూ కొందరు ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. మాయమాటలతో బురిడీ కొట్టించి రూ. కోట్లు చేతికి అందగానే బిచాణా ఎత్తేసి ఉడాయిస్తున్నారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
నగరంలో రోజుకో చోట వెలుగులోకి వస్తున్న ఆర్థిక మోసాలను అరికట్టడానికి సీసీఎస్లో ఉన్నతాధికారులు ప్రత్యేక ఈవోడబ్ల్యూ టీమ్లను ఏర్పాటు చేశారు. మోసగాళ్లు ఎన్ని రకాల ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు.. ఏ రకంగా ప్రజలను మభ్య పెడుతున్నారు.. ఏఏ ఆర్థిక మోసాలు ఎన్ని జరిగాయి.. అనే విషయాలపై వివరంగా సీసీఎస్ ఉన్నతాధికారులు తయారు చేసిన డేటాను హైదరాబాద్ సీపీ సహా పోలీస్ ఉన్నతాధికారులు విశ్లేషిస్తున్నట్లు సమాచారం. ఆర్థిక నేరాల వారీగా మోసగాళ్ల భరతం పట్టడానికి సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి(CP Kothakota Srinivas Reddy) సీసీఎస్ అధికారులతో కలిసి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆర్థిక మోసాల పట్ల ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించి, మోసాల బారిన పడకుండా చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.