Hyderabad: దుర్గం చెరువులో కాలుష్యంపై నిపుణుల కమిటీ
ABN , Publish Date - Dec 23 , 2023 | 12:02 PM
దుర్గం చెరువులోని కాలుష్యంపై అధ్యయనం చేయడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసినట్టు శుక్రవారం హైకోర్టు(High Court) ప్రకటించింది. దుర్గం చెరువు కాలుష్యం, చేపల మృతిపై ఇటీవల పత్రికల్లో వచ్చిన కథనాలపై సుమోటోగా విచారణ చేపట్టింది.
- హైకోర్టు ప్రకటన
హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): దుర్గం చెరువులోని కాలుష్యంపై అధ్యయనం చేయడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసినట్టు శుక్రవారం హైకోర్టు(High Court) ప్రకటించింది. దుర్గం చెరువు కాలుష్యం, చేపల మృతిపై ఇటీవల పత్రికల్లో వచ్చిన కథనాలపై సుమోటోగా విచారణ చేపట్టింది. దీనిపై అధికారులు సంతృప్తికరంగా సమాధానం ఇవ్వరని, నిపుణుల కమిటీని నియమిస్తామని గతంలోనే ప్రకటించింది. ఆ మేరకు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ల ధర్మాసనం కమిటీ వివరాలను వెల్లడించింది. అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది వేదుల శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ కాలుష్యంపై అధ్యయనం చేయడానికి నాగ్పూర్లోని నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్ఈఈఆర్ఐ) డైరెక్టర్ అతుల్ నారాయణ్ వైద్య అంగీకరించినట్లు తెలిపారు. దీంతో ఆయనను ఛైర్మన్గా, నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎం.శాంతివర్ధిని సభ్యులుగా కమిటీని నియమిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. అధికారులు నిపుణులను ప్రభావితం చేయకుండా కమిటీలో జ్యుడీషియల్ ఆఫీసర్ను నియమించినట్లు వ్యాఖ్యానించింది. ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల సహాయసహకారాలు అందించాలని, పోలీసు రక్షణ కల్పించడంతోపాటు రవాణా తదితర ఖర్చులు చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది. ఆరువారాల్లో నివేదిక సమర్పించాలని కమిటీకి సూచిస్తూ విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.