వరంగల్ అర్బన్ ఎక్సైజ్ సీఐ సస్పెన్షన్
ABN , First Publish Date - 2023-11-30T03:24:12+05:30 IST
వరంగల్ అర్బన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎ.అంజిత్రావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు వరంగల్ రేంజ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి.అంజన్రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మేడ్చల్ జిల్లాలో అధికార పార్టీ అభ్యర్థికి చెందిన డబ్బులు పంచుతూ పట్టుబడిన వైనం
దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు
హనుమకొండ క్రైం/హైదరాబాద్, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): వరంగల్ అర్బన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎ.అంజిత్రావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు వరంగల్ రేంజ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి.అంజన్రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంజిత్రావు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఈ నెల 27న తన హెడ్క్వార్టర్స్ను వదిలి వెళ్లారని, ఇలా విధులపై అశ్రద్ధ కనబర్చినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంజిత్రావు మేడ్చల్ జిల్లాలో అధికార పార్టీ అభ్యర్థికి చెందిన డబ్బులు పంచుతుండగా స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన అంజిత్రావు 2009లో ఎక్సైజ్ శాఖలో ఎస్సైగా చేరాడు. 2014లో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందాడు. 2017లో ఆదిలాబాద్ జిల్లా భైంసా నుంచి వరంగల్ అర్బన్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్కు ఇన్స్పెక్టర్గా వచ్చాడు. అప్పటి నుంచి ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో మేడ్చల్ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా ప్రచారం ప్రారంభించాడు. రెండు రోజుల కిందట అంజిత్రావు తన కారులో మేడ్చల్ జిల్లా మేడిపెల్లి శివారు చంగిచెర్ల గ్రామం వద్ద కారులో డబ్బులు పంచుతూ స్థానికులకు కనిపించాడు. వారు అతడిని చుట్టుముట్టి దేహశుద్ధి చేశారు. కారులో సుమారు రూ.5 లక్షలు ఉన్నట్టు గుర్తించారు. అక్కడి స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అంజిత్రావు వద్ద ఉన్న గుర్తింపు కార్డు, నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.