Share News

రోడ్డు దాటేదెలా ?

ABN , Publish Date - Dec 22 , 2023 | 03:53 PM

మహానగరంలో రోడ్డు దాటడం గగనంగా మారుతోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దాటాల్సి వస్తోంది. వేగంగా దూసుకొచ్చే వాహనాలు ఎప్పుడు ఎవరిని బలిగొంటాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. పాదచారుల కష్టాలు తీర్చేందుకు గత ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఎంతో ఆర్భాటంగా నిర్మించిన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి(ఎఫ్‌వోబీ)లు అలంకార ప్రాయం, అధ్వాన్నంగా మారాయి. ప్రారంభించిన శ్రద్ధ నిర్వహణలో లేకపోవడం పాదచారులకు శాపంగా మారింది.

 రోడ్డు దాటేదెలా ?

- అధ్వానంగా ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు

- చెత్తాచెదారం, ఎక్కడ చూసినా అపరిశుభ్రత

- వంతెనలు ఎక్కేందుకు పాదచారుల నిరాసక్తత

- నిర్వహణను గాలికొదిలేసిన బల్దియా

- అలంకారప్రాయంగా మారుతున్న వైనం

- డివైడర్లు దూకి, రోడ్డు దాటుతున్న జనం

- వాహనాల అతివేగంతో నిత్యం ప్రమాదాలు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 22 (ఆంధ్రజ్యోతి): మహానగరంలో రోడ్డు దాటడం గగనంగా మారుతోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దాటాల్సి వస్తోంది. వేగంగా దూసుకొచ్చే వాహనాలు ఎప్పుడు ఎవరిని బలిగొంటాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. పాదచారుల కష్టాలు తీర్చేందుకు గత ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఎంతో ఆర్భాటంగా నిర్మించిన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి(ఎఫ్‌వోబీ)లు అలంకార ప్రాయం, అధ్వాన్నంగా మారాయి. ప్రారంభించిన శ్రద్ధ నిర్వహణలో లేకపోవడం పాదచారులకు శాపంగా మారింది.

పనిచేయని ఎస్కలేటర్లు, లిఫ్టులు

ప్రధాన కూడళ్లలో రోడ్డు దాటేందుకు వీలుగా బల్దియా పలుచోట్ల ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి (ఎఫ్‌వోబీ)లను నిర్మించింది. చాలా వాటిల్లో ఎస్కలేటర్లు, లిఫ్టులు పనిచేయకపోవడంతో వయసు మళ్లినవారితోపాటు కుర్రకారు సైతం యథేచ్ఛగా రోడ్డు దాటేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు వాహనదారులు కూడా అదుపుతప్పి కిందపడిపోతున్నారు. లెక్కల్లో చూపేందుకు నిర్మించాం.. అన్నట్టుగా పాదచారుల వంతెనల(ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల) నిర్వహణలో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం ఎనలేని నిర్లక్ష్యం వహిస్తోంది. మెట్ల మార్గంలో బ్రిడ్జి పైకెక్కే ఓపిక లేని చాలామంది నడుచుకుంటూ రోడ్లు దాటేస్తున్నారు. ఫోన్లలో మాట్లాడుతూ వెనకాముందు చూసుకోవడంలేదు. ఈ క్రమంలో పాదచారులు ప్రమాదాలబారిన పడుతున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న వారిలో 50 శాతానికిపైగా పాదచారులే ఉంటుండడం గమనార్హం. ఇటీవల నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

గతంలో కాస్త మేలు

గతంలో పలు ప్రాంతాల్లో ఎఫ్‌వోబీలు అందుబాటులో ఉండేవి. మెట్రో రైలు నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో వంతెనలను తొలగించారు. ఆ తర్వాత పెరిగిపోతున్న ట్రాఫిక్‌ దృష్ట్యా 38 ప్రాంతాల్లో రూ.100 కోట్లతో ఎఫ్‌వోబీలు నిర్మించాలని ప్రతిపాదించారు. అనువుగా ఉన్న 22 ప్రాంతాలను ఎంపిక చేసి రూ.75.65 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటివరకు 9 వంతెనలు పూర్తయినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. నగరంలో కొత్తగా ప్రతిపాదించిన ఎఫ్‌వోబీలను అధునాతన హంగులతో నిర్మించాలని నిర్ణయించారు. వయోధికులు, దివ్యాంగులు ఎక్కేందుకు వీలుగా ఎస్కలేటర్లు, లిఫ్టులు ఉండేలా డిజైన్లు రూపొందించారు. ఆ మేరకు పలు ప్రాంతాల్లో ఎఫ్‌వోబీలు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిలో కొన్నిచోట్ల లిఫ్టులు, ఎస్కలేటర్లు పనిచేయడం లేదు. ఎల్‌వీ ప్రసాద్‌ ఆస్పత్రి వద్ద, గంగారం ఎఫ్‌వోబీల వద్ద ఎస్కలేటర్లను వినియోగించే పరిస్థితి లేదు. ఎస్కలేటర్‌ పనిచేయకపోవడంతో గంగారంవద్ద కర్రలు అడ్డుగా ఉంచారు. మదీనాగూడలో ఎఫ్‌వోబీ ఎస్కలేటర్‌ బెల్టు తెగిపోవడంతో మూడు నెలలుగా నిరుపయోగంగా మారింది. ఎన్‌ఎండీసీ వద్ద ఎఫ్‌వోబీపై చెత్తాచెదారం పేరుకుపోయింది. దీంతో పై నుంచి వెళ్లేందుకు పాదచారులు ఆసక్తి చూపడం లేదు. ఐడీపీఎల్‌ చౌరస్తాలో ప్రారంభించినా లిఫ్టులు అందుబాటులోకి రాలేదు. బేగంపేట ఫ్లైవోవర్‌ దిగాక అమీర్‌పేట వైపు రోడ్డు దాటేందుకు నిర్మించిన ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి, పంజాగుట్ట శ్మశానవాటిక-ఎల్‌వీ ప్రసాద్‌ ఆసుపత్రి మార్గంలో నిర్మించిన ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు నిరుపయోగంగా మారాయి. కోట్ల రూపాయలు వెచ్చించి బ్రిడ్జిలు నిర్మిస్తున్న జీహెచ్‌ఎంసీ నిర్వహణను గాలికొదిలేయడంతో వాటిని వినియోగించే పరిస్థితి లేకుండా పోతోంది.

అవసరం లేని చోట...

జనసంచారం అధికంగా ఉండి ప్రజలు రోడ్డు దాటే ప్రాంతాల్లో ఎఫ్‌వోబీలు నిర్మించాలి. నగరంలోని కొన్ని ఏరియాల్లో ఇందుకు భిన్నంగా నిర్మాణం జరిగింది. ఏజెన్సీలతో అధ్యయనం చేయించి అవసరమైన ప్రాంతాలను గుర్తించామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అలా కనిపించడం లేదు. ఆల్విన్‌ కాలనీ, మియాపూర్‌ వద్ద అవసరం లేనిచోట ఎఫ్‌వోబీలు నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. ఇందుకు కారణం బస్టాపులకు, వాటికి మధ్య చాలాదూరం ఉండడమే. దాంతో ప్రమాదమని తెలిసినా పాదచారులు వాహనాలకు అడ్డువెళ్లి వాటిని ఆపి మరీ రోడ్డు దాటేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో ప్రమాదాలు జరిగి ప్రాణ, వాహన నష్టం జరిగిన సందర్భాలు ఎన్నో. కొన్ని ప్రాంతాల్లో ఎ్‌ఫ్‌వోబీల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు కనీస చొరవ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Jan 18 , 2024 | 11:25 AM