పుంజుకోని రిజిస్ట్రేషన్లు
ABN , First Publish Date - 2023-12-08T22:12:50+05:30 IST
అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ‘కోడ్’ ఎత్తివేసినా రియల్ ఎస్టేట్ బిజినెస్ పుంజుకోవడం లేదు. ఎన్నికల పుణ్యమా అని నవంబరు 9 నుంచి నిలిచిపోయిన లావాదేవీలు, అనం తరం కూడా గాడిన పడకపోవడంతో ఆ రంగంపై ఆధారపడ్డ వారి పరి స్థితి దయనీయంగా మారింది.
మంచిర్యాల, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ‘కోడ్’ ఎత్తివేసినా రియల్ ఎస్టేట్ బిజినెస్ పుంజుకోవడం లేదు. ఎన్నికల పుణ్యమా అని నవంబరు 9 నుంచి నిలిచిపోయిన లావాదేవీలు, అనం తరం కూడా గాడిన పడకపోవడంతో ఆ రంగంపై ఆధారపడ్డ వారి పరి స్థితి దయనీయంగా మారింది. భూముల క్రయ, విక్రయాలు పూర్తిగా నిలిచిపోగా వినియోగదారులు లేక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వెల వెలబోతున్నాయి. ఎన్నికల కోడ్ రాకముందు నిత్యం వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరగగా ఎన్నికలతో ఒక్కసారిగా పడిపోయింది. భూముల క్రయ, విక్రయాలకు సంబంధించి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం కాగా, వాటిని తీసుకెళ్లడం కష్టసాధ్యంగా మారింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లావాదేవీలకు ఎక్కడ కూడా ఆధారాలు ఉండే అవకాశం లేదు. దీంతో నగదు తరలించే సమయంలో పోలీసులకు దొరికిపోతే డబ్బంతా సీజ్ అయ్యే అవకాశం ఉండటంతో స్థిరాస్థి వ్యాపా రులు భూముల క్రయ,విక్రయాల జోలికి వెళ్లలేదు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ రియల్ఎస్టేట్ రంగం పుంజుకోవడం లేదు.
తగ్గిన డాక్యుమెంటేషన్...
ఎలక్షన్ కోడ్ కారణంగా జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంటేషన్ ప్రక్రియ గణనీయంగా పడిపోగా, ఎన్నికలు ముగిసినా పరిస్థితిలో ఎలాంటి మార్పు కానరావడం లేదు. ఎన్నికల కోడ్కు ముందు సగటున నిత్యం వందకుపైగా రిజిస్ట్రేషన్లు జరుగగా, ప్రస్తుతం వాటి సంఖ్య సగానికి పడిపోయింది. సెప్టెంబరు నెలలో మొత్తం 1016 రిజిస్ట్రేషన్లు జరుగగా, సేల్ డీడ్-507, మార్ట్గేజ్- 253, గిఫ్ట్ డీడ్-125, పార్టేషన్ డీడ్-5, రిలీజ్ డాక్యుమెంట్లు 78, లీజ్ డీడ్-17, మార్పిడి లేదా రద్దు-27, వీలునామా-1, దత్తత డీడ్-2, ట్రస్టులకు సంబంధించి-1 డాక్యుమెంటేషన్ జరిగింది. అక్టోబర్ 3 నుంచి 11వ తేదీ వరకు జరిగిన లావాదేవీల్లో డాక్యుమెంటేషన్ గణనీయంగా పడిపోయింది. ఈ కాలంలో అన్ని రకాల డాక్యుమెంట్లు కేవలం 575 మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయి. అక్టోబర్ 9న ఎన్నికల కోడ్ రాగా ఆ రోజు కేవలం 40 డాక్యుమెంట్లకే పరిమితమయ్యాయి. 10న 59, 11న 63, 12న 62 డాక్యుమెంట్లు నమోదయ్యాయి. కాగా ఈ నెల 5వ తేదీ నుంచి ఎన్నికల కమిషన్ ’’కోడ్’’ ఎత్తివేసింది. ఈ మూడు రోజుల్లోనూ సగటున రోజుకు 10 రిజిస్ట్రేషన్లు కాలేదని సమాచారం.
తొలగని ఎలక్షన్ ఎఫెక్ట్....
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసినప్పటికీ రియల్ ఎస్టేట్ రంగంపై దాని ప్రభావం కొనసాగుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో సింహభాగం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజకీయ నాయకులతో సంబంధాలు కలిగి ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు సైతం ఖర్చుల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారుల సహాయ, సహకారాలు తీసుకున్నట్లు సమాచారం. బిజినెస్ కోసం కేటాయించిన సొమ్మును వ్యాపారులు దారి మళ్లించారు. ఎన్నికల్లో అభ్యర్థులు ఓడినా గెలిచినా ఇప్పటికిప్పుడు తిరిగి వచ్చే పరిస్థితులు లేవు. దీంతో నగదు బదిలీపై ఆధారపడి ఉన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ పూర్తిగా మందగించింది. యేటా నవంబరు నుంచి జూన్ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపుమీద ఉంటుంది. ప్రస్తుతం డబ్బంతా ఎన్నికలకు ఉపయోగపడటంతో బిజినెస్ కుదేలైంది. ఇప్పటికి ప్పుడు మెరుగున పడే పరిస్థితులు కానరావడం లేదు.
ప్రభుత్వ ఖజానాకు భారీ గండి...
ఎన్నికల కోడ్తో రిజిస్ట్రేషన్లు తగ్గడంతో రిజిస్ట్రేషన్ల శాఖలో ఆదాయం పడిపోయి ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడింది. సెప్టెంబరు నెలలో 1016 రిజిస్ట్రేషన్లు జరుగగా మొత్తం రూ.3 కోట్ల 46 లక్షల ఆదాయం సమకూరింది. అక్టోబర్లో కోడ్ రాకముందు 3 నుంచి 8వ తేదీ వరకు రూ. కోటి 4 లక్షల పై చిలుకు ఆదాయం సమకూరగా, కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత 9 నుంచి 12వ తేదీ వరకు కేవలం రూ.67 లక్షల ఆదాయం మాత్రమే రాగా, ప్రస్తుతం ఆదాయం పూర్తిగా పడిపోయింది.
లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి
వూడెం వెంకటస్వామి, రియల్ ఎస్టేట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
ఈ సంవత్సరం బిజినెస్ పూర్తిగా పోయినట్లే. ఆ మధ్య కురిసిన అకాల వర్షాల కారణంగా వ్యాపారం మందగించగా, ఎలక్షన్ కోడ్తో పూర్తిగా లావాదేవీలు నిలిచిపోయాయి. ఎన్నికల సంవత్సరం కావడంతో ఇక ముందు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో వెంచర్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోగా, ఎన్నికలు కూడా తోడయ్యాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. ప్రస్తుతం వారి పరిస్థితి దయనీయంగా ఉంది.