‘ఫామ్ల్యాండ్’ పేరిట రియల్దందా
ABN , First Publish Date - 2023-04-15T22:45:26+05:30 IST
రియల్ ఎస్టేట్ రంగంలో ‘ఫామ్ల్యాండ్’ పేరిట సరికొత్త మోసానికి తెరలేచింది. రిసార్ట్స్ నిర్మిస్తామ ని చెబుతున్న వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వందలాది ఎకరాల భూముల్లో అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు.
మంచిర్యాల, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): రియల్ ఎస్టేట్ రంగంలో ‘ఫామ్ల్యాండ్’ పేరిట సరికొత్త మోసానికి తెరలేచింది. రిసార్ట్స్ నిర్మిస్తామ ని చెబుతున్న వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వందలాది ఎకరాల భూముల్లో అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. కనీసం నాలా పర్మిషన్ లేకపోయినా వందల కొద్ది ప్లాట్లు అమ్మకానికి పెడుతూ కోట్లు కాజేస్తున్నా అడిగేవారు లేరు. జిల్లాలో కొంత కాలంగా యథేచ్ఛగా సాగు తున్న ఈ నయా దందా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాసులు కురిపి స్తుండగా, వారి మాటలు నమ్మి ప్రజలు నిలువు దోపిడీకి గురవుతున్నారు. మారుమూల మండలాల్లోని వివిధ గ్రామాల్లో పెద్ద మొత్తంలో తక్కువ ధరకు వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు వాటిని గుట్టుచప్పుడు కాకుండా ప్లాట్ల వెంచర్లుగా మారుస్తూ విక్రయిస్తున్నారు.
అక్రమంగా వెంచర్ల ఏర్పాటు...
వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు వాటిలో అక్రమంగా ప్లాట్ల వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. వెంచర్లు ఏర్పాటు చేయాలంటే గ్రామ పంచాయతీల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవలసి ఉంటుంది. ఈ క్రమంలో ఆయా పాలక మండళ్ల పేరిట మొత్తం స్థలంలో 10 శాతం భూమిని రిజిస్ట్రేషన్ చేయాలి. అనంతరం ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు తాగునీరు, డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణం చేపట్టాలి. అప్పుడే వెంచర్లు ఏర్పాటు చేసి, ప్లాట్లు విక్రయిం చేందుకు అనుమతులు లభిస్తాయి. అయితే ఇవేమీ లేకుండానే ‘ఫామ్ ల్యాండ్’ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు ఏర్పాటు చేస్తూ ప్లాట్ల విక్రయాలకు పూనుకుంటున్నారు. ఒకవేళ ఫామ్ల్యాండ్ పేరిట వ్యయసాయం చేయదలిస్తే అందులో మొక్కలు నాటడం, పంటలు పండించుకోవడం చేయవచ్చు. అయితే ప్లాట్లుగా మార్చి విక్రయాలు జరపడం చట్ట విరుద్ధం. అయితే అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వెంచరు కారణంగా స్థలం రూపంలో గ్రామ పంచాయతీకి, వివిధ రకాల ఫీజుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు భారీ గండిపడుతోంది.
వ్యాపారం తీరు ఇలా...
‘ఫామ్ల్యాండ్’ పేరుతో వ్యాపారం కోట్లు కురిపిస్తోంది. జిల్లాలో ఈ వ్యాపారం జరుగుతున్న తీరు ఇలా ఉంది. వ్యాపారులు కొనుగోలు చేసిన భూముల్లో ముందుగా వెంచర్లు ఏర్పాటు చేస్తారు. అందులో నాలుగు గుంటలకు ఒక ప్లాటు చొప్పున ఏర్పాటు చేస్తూ కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. ఒక్కో ప్లాటుకు కనీసం రూ.20 లక్షల చొప్పున ధరకడుతూ వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. ఎంపిక చేసిన ‘ఫామ్ల్యాండ్’ స్థలంలో ప్రజలకు ఆహ్లాదం కలిగించేందుకు రిసార్ట్ ఏర్పాటు చేస్తామని ప్రచారం నిర్వహిస్తారు. రిసార్ట్స్లో ఈత కొలనులు, బోటింగ్, ఆలయం, హోటళ్లు, పార్కులు, గోశాలలు, బీచ్ వాలీబాల్, షటిల్ కోర్టులు ఏర్పాటు చేస్తామంటూ నమ్మబలుకుతారు. కొనుగోలు చేసిన ప్లాటులో అవసరమైతే ఇల్లు (గెస్ట్హౌజ్ లాంటి నిర్మా ణం) తామే కట్టిస్తామని, అందుకు ప్రత్యేకంగా మరో రూ.30 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నివాస యోగ్యం కాకపోవడంతో ఆయా ప్లాట్లలో నిర్మించిన ఇళ్లను తామే కిరాయికు నడుపుకుంటామని, అందుకుగాను యజమానికి నెలకు అద్దె చెల్లిస్తామంటూ చెబుతారు. అలా ఒక్కో కస్టమర్ నుంచి కనీసం రూ.50 లక్షలకు తగ్గకుండా వసూలు చేస్తున్నారు.
కమర్షియల్ నిర్మాణం చేపట్టరాదు
‘ఫామ్ల్యాండ్’ విధానంలో నిబంధనల మేరకు కమర్షియల్ నిర్మాణాలు చేపట్టరాదు. కేవలం మొక్కలు మాత్రమే పెంచాల్సి ఉంటుంది. అయితే మందమర్రి మండలం గుడిపెల్లి శివారులో ‘ఎస్టేట్స్ రిసార్ట్స్’ పేరిట వెంచర్ను ఏర్పాటు చేశారు. వంద ఎకరాల్లో రిసార్ట్స్ నిర్మాణం చేస్తున్నట్లు ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. అందులో హోటల్ కోసం పక్కా నిర్మాణం చేపడుతున్నారు. స్విమ్మింగ్ ఫూల్ కోసం కందకాలు, రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ఈ వెంచర్కు వెళ్లేందుకు మధ్యలో రెండు వాగులు దాటాల్సి ఉంటుంది. ఈ వాగులపై ఎలాంటి అనుమతులు లేకుండా వంతెనల నిర్మాణం చేపట్టారు. అవి కూడా పైపులతో లోలెవల్ వంతెనలు నిర్మించారు. ఒక్కసారి వరద వస్తే పూర్తిగా కొట్టుకుపోయే స్థితిలో వంతెనలు నిర్మించారు. ఇదిలా ఉండగా వినియోగదారులను ఆకర్శించేందుకు దారి పొడవునా వివిధ ఏర్పాట్లు, కట్టడాల ప్రచారంతో కూడిన భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అందులో పెద్ద మొత్తంలో ప్లాట్లు విక్రయించి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వెంచర్లో సమీపంలో ఉన్న కొంత అసైన్డ్ భూమిని కలుపుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘ఫామ్ల్యాండ్’ పేరిట వెంచర్ ఏర్పాటు చేసిన వారు బడాబాబులు కావడం, వారికి రాజకీయ అండదండలు ఉండటంతో అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అనుమతులు లేవు...
గుడిపెల్లి పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్
గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న ‘ఫామ్ల్యాండ్’కు పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు జారీ చేయలేదు. ‘ఫాంల్యాండ్’ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అందగానే గతంలో నిర్వాహకులకు నోటీసులు జారీ చేశాం. ‘ఫాంల్యాండ్’లో ఎలాంటి కమర్షియల్ నిర్మాణాలు చేపట్టవద్దనే నిబంధనలు ఉన్నాయి. హోటల్ నిర్మాణం జరుగుతున్నట్లు దృష్టికి రాలేదు. సోమవారం ఫీల్డు మీదకి వెళ్లి పరిశీలించిన అనంతరం అవసరమైన చర్యలు తీసుకొంటాం.