రాజకీయ వేడి
ABN , First Publish Date - 2023-05-31T23:37:12+05:30 IST
జిల్లాలో పొలిటికల్ హీట్ గరిష్టస్థాయి డిగ్రీలకు చేరుకుంటోంది. ఓ వైపు మండుటెండలు జనాన్ని విలవిల్లాడిస్తుండగా ప్రధాన రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాలతో జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
సీఎం సభ సక్సెస్కు బీఆర్ఎస్ పకడ్బందీ వ్యూహం
టౌన్లో పట్టు కోసం మంత్రి తనయుడి ప్రయత్నాలు
ధాన్యం సమస్యను హైలెట్ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్లు
అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు
ముథోల్లో వ్యూహత్మకంగా మోహన్రావు పటేల్ పాదయాత్ర
ఖానాపూర్లో మార్నింగ్ వాక్ పేరిట రేఖానాయక్ పర్యటన
నిర్మల్, మే 31 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పొలిటికల్ హీట్ గరిష్టస్థాయి డిగ్రీలకు చేరుకుంటోంది. ఓ వైపు మండుటెండలు జనాన్ని విలవిల్లాడిస్తుండగా ప్రధాన రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాలతో జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబందించిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యేలు రేఖానాయక్, విఠల్రెడ్డిలు తమ తమ నియోజకవర్గాల పరిధిలో ఇటీవలి వరకు ఆత్మీయ సమ్మేళనాల పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించి జనం చెంతకు మరింత చెరవయ్యే ప్రయత్నం చేశారు. దీంతో పాటు అధికారిక ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఇతర కార్యకలాపాల పేరిట బీఆర్ఎస్ నేత లు కాలికి గజ్జ కట్టిన విధంగా తిరుగుతూ పట్టు పెంచుకునే ప్రయత్నం ముమ్మరం చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ధాన్యం, మొక్కజొన్న పంటల కొనుగోలు సమస్య తీవ్రరూపం దాల్చడం అలాగే రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేయడం ప్రతిరోజూ కొనసాగుతోంది. దీని ని అవకాశంగా తీసుకుంటూ బీజేపీ ఓ అడుగు ముందుకు వేసి అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యం, నిర్వహకుల ఇష్టారాజ్యం అన్నదాతను నష్టాల పాలు చేస్తోందని అలాగే జాప్యం కారణంగా అకాల వర్షాలకు పంట తడిసి ముద్దవుతోందంటూ రైతులు చేస్తున్న ఆందోళనలకు బీజేపీ మద్దతునిస్తూ వారందరిని కూడగడుతోంది. అలాగే పార్టీ పరమైన కార్యక్రమాలతో ఇటు కేడర్లో ఉత్సాహం నింపడమే కాకుండా జనం నాడిని పట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. కాగా కాంగ్రెస్ పార్టీ సైతం తన ఉనికిని నిలబెట్టుకునేందు కోసం ఏటీకి ఎదురీతలాగ తామే మి తక్కువ కాకుండా కార్యకలాపాలను ముమ్మరం చేస్తోంది. ఆ పార్టీకి చెందిన నాయకులు అల్లూరి మల్లారెడ్డి, పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డిలు వ్యూహత్మకంగా వ్యవహరిస్తూ బీజేపీ, బీఆర్ఎస్లలోని అసంతృప్తివాదులకు గాలం వేసే ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనికి తోడుగా రైతుల సమస్యలపై అలాగే మరికొన్ని సమస్యలను భుజాన ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీ నేతలు చేపడుతున్న ఆందోళనలు జనందృష్టిని ఆకర్షిస్తున్నాయంటున్నా రు. ఇలా మూడు పార్టీలు హోరాహోరీగా కార్యకలాపాలను సాగిస్తూ జనం సానుభూతిని పొందేందుకు పోటీ పడుతున్న కారణంగా రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది.
నిర్మల్లో మంత్రి తనయుడి గల్లీల పర్యటన
ఇదిలా ఉండగా నిర్మల్ నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ తరపున మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పోటీలో ఉండబోతున్న కారణంగా ఆయన తనయుడు అల్లోల గౌతంరెడ్డి ఎన్నికలను ఈ సారి సీరియస్గా తీసుకోనున్నారు. ఇందులో భాగంగానే గౌతంరెడ్డి మంత్రి పీఎ నాళం శ్రీనివాస్తో కలిసి మినీ ఆత్మీయమేళ పేరిట గల్లీల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఆయన దాదాపు పదివార్డుల్లో ఈ ఆత్మీయ మేళాలను నిర్వహించి కార్యకర్తలను కలుస్తుండడమే కాకుండా వారికి పార్టీ అలాగే మంత్రి వెన్నంటి ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు. కార్యకర్తలను నేరుగా కలుస్తూ వారిని పేరు పేరున పలకరించి రాబోయే ఎన్నికలపై చర్చిస్తున్నారు. ఆయా వార్డుల్లో పార్టీ పరిస్థితితో పాటు ఎదుటి పార్టీల బలాల బలహీనతలను సైతం ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. కేడర్లో ఎలాంటి అసంతృప్తి లేకుండా ఆయన వారితో స్వయంగా మాట్లాడి ఉత్సాహాన్ని నింపే ప్రయత్నాలు చేస్తుండడం ఆసక్తిని రేకేత్తిస్తోంది. దశ ల వారీగా ఆయన ఈ మినీ ఆత్మీయ మేళాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మున్సిపల్ వార్డుల్లో పర్యటించిన తరువాత మండలాల వారీగా ఈ పర్యటనను చేపట్టేందు కోసం గౌతంరెడ్డి సిద్దమవుతున్నారంటున్నారు.
సీఎం సభపై ఫోకస్
అధికార బీఆర్ఎస్ పార్టీ జూన్ నెల 4వ తేదీన నిర్మల్లో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభపై సీరియస్గా ఫోకస్ పెడుతోంది. సీఎం సభకు లక్షకు పైగా జనాన్ని సమీకరించి తన పట్టును నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తోంది. దీని కోసం గానూ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి జనసమీకరణకు సంబందించి స్వయంగా దిశానిర్దేశం చేస్తున్నారు. మండలాల వారిగా జనసమీకరణకు సంబంధించి బాధ్యులను నియమించారు. సీఎం పర్యటన సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభి వృద్ధి కార్యక్రమాలపై విసృత ప్రచారం చేయాలని భావిస్తున్నారు. సీఎం పర్యటన అనంతరం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను సైతం తనకు అనుకూలంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం
నిర్మల్తో పాటు భైంసా, ఖానాపూర్ నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రె స్ పార్టీలు తగ్గెదేలే అన్న రీతిలో పోటాపోటీగా కార్యక్రమాలను నిర్వహిస్తూ జనంలో పట్టు పెంచుకునే ప్రయత్నం సాగిస్తుండడం ఆసక్తిని రేకేత్తిస్తోంది. బీజేపీ వ్యూహత్మకంగా పావులు కదుపుతూ రైతులు ఎదు ర్కొంటున్న పంట కొనుగోలు సమస్యను హైలెట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సమస్యనే ప్రధాన ఎజెండాగా చేసుకొని గ్రామ, మండలస్థాయిలో రైతులతో కలిసి ఆందోళనలు చేస్తూ జనంతో మమేకమవుతోంది. ఆ పార్టీకి చెందిన ఏలేటీ మహేశ్వర్రెడ్డి నిర్మల్ నియోజకవర్గంలో, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, జడ్పీటీసీ జానుభాయికి ఖానాపూర్ నియోజకవర్గంలో రైతుల సమస్యలపై ఆందోళనలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. ముథోల్ నియోజకవర్గంలో రమాదేవి, మోహన్రావు పటేల్, నారా యణరావు పటేల్లు కూడా పర్యటిస్తూ పార్టీ బలాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.
పాదయాత్ర.. మార్నింగ్ వాక్
ముథోల్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు మోహన్రావు పటేల్ గ్రామాల్లో గడప గడపకు బీజేపీ పేరిట చేపడుతున్న పాదయాత్రకు ఆదరణ లభిస్తోందంటున్నారు. కుంటాల మండలంలోని సూర్యాపూర్ నుంచి పటేల్ ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అన్ని మండలాల్లో పాదయాత్ర చేస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో మాజీ ఎంపీ రాథోడ్రమేష్ గ్రామాల్లో పాదయాత్రలు చేస్తూ పార్టీ ఇమేజ్ పెంచే ప్రయత్నాలు సాగిస్తున్నారు. అలాగే పెంబి జడ్పీటీసీ జానుభాయి అధికార బీఆర్ఎస్ పార్టీని, లోకల్ ఎమ్మెల్యే రేఖానాయక్ను టార్గెట్ చేసుకుంటూ సమస్యలపై విసృతంగా గళమెత్తుతున్నారు. దీనికి పోటీగా ఎమ్మెల్యే రేఖానాయక్ మార్నింగ్ వాక్ పేరిట ప్రతీరోజూ ఉదయం పూట ఎంపిక చేసిన ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు.