చేసిన సేవలతోనే ప్రజలు పట్టం కట్టారు
ABN , First Publish Date - 2023-12-03T23:11:04+05:30 IST
అదికారం ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారికి అండగా నిలుస్తూ తాను చేసిన సేవలకు గుర్తింపుగా భారీ మెజార్టీతో మంచిర్యాల ఎమ్మెల్యేగా తనను గెలిపించారని కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు.
ఏసీసీ,మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 3 : అదికారం ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారికి అండగా నిలుస్తూ తాను చేసిన సేవలకు గుర్తింపుగా భారీ మెజార్టీతో మంచిర్యాల ఎమ్మెల్యేగా తనను గెలిపించారని కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు. హాజీపూర్లోని కౌంటింగ్ కేంద్రం వద్ద విలేకరులతో మాట్లాడుతూ తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్టు ద్వారా కరోనా సమయంలో , వరదలు వచ్చి ఇండ్లు నీట మునిగినప్పుడు, మాతా శిశు సంరక్షణ కేంద్రం నీట మునిగిన సందర్భంలో ప్రజలకు విస్తృతమైన సేవలందించామన్నారు. ఈ ఎన్నికల్లో కుల సంఘాలు, యూనియన్లు, కార్మిక సంఘాలు తనకు మద్దతు తెలిపాయని, వారందరికి రుణపడి ఉంటానన్నారు. మంచిర్యాలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ , సీసీ రోడ్లు , అండర్గ్రౌండ్ ఎలక్ర్టిసిటీ కేబుల్స్, పరిశుభ్రమైన తాగునీరు అందించడం తొలి ప్రాధాన్యంగా ఎంచుకున్నానన్నారు. పదేళ్ళ నుంచి మంచిర్యాలలో పెరుగుతున్న జనాభా, రానున్న 50 సంవత్సరాలకు సరిపోయే విధంగా అభివృద్ధిపనులను చేపడతామన్నారు. ఐబీలోని ఇంటిగ్రేటేడ్ మార్కెట్,ఆర్డీవో,ఇతర కార్యాలయాలను తరలించి గోదావరి ఒడ్డున ముంపు ప్రాంతంలో ఉన్న మాతా శిశు సంరక్షణ కేంద్రం ఆసుపత్రిని ఐబీలో ఏర్పాటు చేస్తానన్నారు. లక్షెట్టిపేట, నస్పూర్లలో అత్యధిక మెజార్టీ సాధించానన్నారు.