నమో నాగోబా
ABN , First Publish Date - 2023-01-23T01:03:29+05:30 IST
ఆదివాసీ గిరిజనుల ఇలవేల్పు కేస్లాపూర్ నాగోబా జాతరకు ఆదివారం రెండో రోజు భక్తులు పోటెత్తారు.
నాగోబాను దర్శించుకున్న కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, స్థానిక ఎంపీలతో కలిసి ప్రత్యేక పూజలు
నాగోబా దర్బార్ హాల్లో ఆదివాసీ గిరిజనులతో మాటామంతీ
నాగోబా దేవత దర్శనం కోసం బారులు తీరిన భక్తజనం
ప్రత్యేక పూజలు.. మొక్కలు చెల్లించుకున్న మెస్రం వంశీయులు
160 మంది కొత్త కోడళ్ల బేటింగ్
పూజల్లో భాగంగా కోనేరు వద్దకు కొత్త కుండలతో తరలిన వెళ్లిన కోడళ్లు
రెండో రోజున సుదూర ప్రాంతాల నుంచి కేస్తాపూర్కు తరలివచ్చిన గిరిజనులు
అంగరంగ వైభవంగా కొనసాగుతున్న నాగోబా జాతర ఉత్సవాలు
ఇంద్రవెల్లి, జనవరి 22: ఆదివాసీ గిరిజనుల ఇలవేల్పు కేస్లాపూర్ నాగోబా జాతరకు ఆదివారం రెండో రోజు భక్తులు పోటెత్తారు. కాగా, శనివారం అర్ధరాత్రి బేటింగ్ (కొత్త కోడళ్ల పరిచయం) కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా రెండో రోజున మెస్రం వంశీయుల 160 మంది కొత్త కోడళ్లను బేటింగ్ చేయించారు. కాగా, పుష్యమాస అమావాస్య అర్ధరాత్రి పవిత్ర గంగాజలంతో అభిషేకించి మహాపూజలతో జాతరను మెస్రం వంశస్తులు ప్రారంభించగా.. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి నాగోబాను దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలి రావడంతో కేస్లాపూర్ సందడిగా మారింది. నాగోబా జాతర భక్తులతో కోలాహలంగా మారింది. కాగా, రెండో రోజున కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండాతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంగనర్ ఎంపీ బండి సంజయ్, ఎంపీ సోయం బాపురావులతో కలిసి నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజ లు చేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి నాగోబా ఆలయ చరి త్ర, జాతర నిర్వహణ, అభివృద్ధి పనుల వివరాలను ఆలయ పూజారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ, మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అర్జున్ ముండాతో పాటు బండి సంజయ్లను శాలువతో సన్మానిం చి.. వారికి నాగోబా చిత్రపటాన్ని బహూకరించారు.
తరలివచ్చిన కొత్త కోడళ్లు
కేస్లాపూర్ నాగోబా మహాపూజల్లో పాల్గొనేందుకు కొత్త కోడళ్లు తరలివచ్చారు. పూజల్లో భాగంగా రెండో రోజు ఆదివారం 160 మంది కొత్త కోడళ్లతో బేటిం గ్ కార్యక్రమం కొనసాగింది. అంతకుముందు నా గోబా పూజల్లో భాగంగా స్థానిక వేకువ జాము న కోనేరు వద్దకు కొత్త కుండలతో మెస్రం వంశీయుల కోడళ్లు తరలివచ్చారు. అక్కడ ప్ర త్యేక పూజల అనంతరం కోనేరులోని నీటిని కుండల్లో నింపుకుని ఆలయానికి సంప్రదా య పద్ధతిలో తరలివెళ్లారు. అనంతరం ఆల యంలో నాగోబా పూజల్లో పాల్గొన్నారు.
నాగోబా దర్బార్ హాల్లో మాటామంతీ
కేస్లాపూర్ నాగోబా జాతరకు తొలిసారిగా కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంగనర్ ఎంపీ బండి సంజయ్, స్థానిక ఎంపీ సోయం బాపురావులతో కలిసి హాజరయ్యారు. నాగోబా జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రెండో రోజున నాగోబా దర్బార్ హాల్లో గిరిజనులతో మాటామంతి నిర్వహించారు. దీనిలో భాగంగా కేంద్ర మంత్రి ఆదివాసీ గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోడు భూముల రైతులకు పట్టాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆదివాసీ మహిళ ద్రౌపతిముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీదేనని అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచినా ఆదివాసీల గురించి ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదని, కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం ఆదివాసీలకు పెద్దపీట వేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఆదివాసీ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించే విధంగా ఆదివాసీ మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందని, తెలంగాణలో కూడా ఆదివాసీ మ్యూజియం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆర్టికల్ 275(1) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నాగోబా ఆలయ అభివృద్ధికి కోరితే తమ గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని ఆ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ నిజాం సర్కార్ మనుమడు టర్కి దేశంలో చనిపోతే కేసీఆర్ టోపీ పెట్టుకుని ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు చేయడం సిగ్గు చేటన్నారు. ఆదివాసీలపై ఆయనకు ప్రేమ లేదని ఆరోపించారు. జోడేఘాట్లో కుమ్రంభీం మ్యూజియానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామన్న ఆయన కేవలం రూ.25 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మోసం చేశారంటూ పలు విమర్శలు గుపిం్పంచారు. అంతకుముందు కేంద్రమంత్రికి కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎస్పీ ఉదయ్రెడ్డిలతో పాటు బీజేపీ జిల్లా నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.
నాగోబాను దర్శించుకున్న అధికారులు
కాగా, ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా దేవాలయంలో శనివారం రాత్రి నిర్వహించిన మహాపూజ కార్యక్రమంలో కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, ఎమ్మెల్సీ దండే విఠల్, శాసన సభ్యులు రేఖాశ్యాం నాయక్, ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, కుమ్రంభీం, మంచిర్యాల జిల్లాలకు చెందిన అదనపు కలెక్టర్లు చహత్బాజ్పాయ్, గౌతమి, రాహుల్, శిక్షణ కలెక్టర్ శ్రీజ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్దసంఖ్యలో మెస్రం వంశీయులు, తదితరులు పాల్గొన్నారు.