గూడ అంజయ్య ఆశయాల సాధనతో ముందుకు సాగుదాం
ABN , First Publish Date - 2023-03-05T22:54:52+05:30 IST
ప్రముఖ కవి, కధా రచయిత గూడ అంజయ్య ఆశయాలతో ముందుకు సాగుదామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, కార్యవర్గసభ్యులు చాడ వెంకట్రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, సినీనటుడు, దర్శకుడు నారాయణమూర్తి, ప్రజాకవి జయరాం అన్నారు.
బెల్లంపల్లి, మార్చి 5: ప్రముఖ కవి, కధా రచయిత గూడ అంజయ్య ఆశయాలతో ముందుకు సాగుదామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, కార్యవర్గసభ్యులు చాడ వెంకట్రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, సినీనటుడు, దర్శకుడు నారాయణమూర్తి, ప్రజాకవి జయరాం అన్నారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ క్రీడా మైదా నంలో ప్రజా కవి గూడ అంజయ్య యాదిలో వర్ధంతి సభ ను నిర్వహించారు. అంజయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉద్యమకాలంలో తెలంగాణ భావజాల వ్యాప్తికి పాటల ద్వారా గూడ అంజయ్య చేసిన ఉద్యమ కృషి మరువలేని దన్నారు. ఊరు మనదిరా అనే పాటతో ప్రజలను చైతన్య వంతం చేశారన్నారు. పాటలను తూటాల్లాగా మలిచి పల్లెల్లో విప్లవాగ్నిని రగల్చిన అంజయ్య గళం భైతికంగా లేకపోయినా పాటల రూపంలో చిరస్థాయిగా ఉంటారని పేర్కొన్నారు. ప్రజా కవి గూడ అంజయ్య ప్రజలను ఆలోచింపజేసే ఎన్నో పాటలను రాశారన్నారు. అంజయ్య స్మారక స్తూపాలను ఏర్పాటు చేయాలని కోరారు.
దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి
దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని సినీనటుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సింగరేణి సంస్థతోపాటు ఇతర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీకి మేలు చేయడానికి బీజేపీ ప్రభు త్వం ప్రైవేటీకరణ చేయడానికి కుట్రలు చేస్తుందన్నారు. గతంలో రూ.450 ఉన్న గ్యాస్ ధరలను రూ. 1150కి పెంచి సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.
రాష్ట్రంలో దొరల పాలన సాగుతుంది
తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన సాగుతుందని ఎం ఆర్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. 1200 మంది అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలం గాణలో రెడ్లు, రావులకే పదవులు కల్పిస్తున్నారని మండి పడ్డారు సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యా రన్నారు. అంతకుముందు కళాకారులు పాటలు పాడి అలరించారు. గద్దర్ పాడిన పాటలు ఆకట్టుకోవడంతో పాటు సభకు హాజరైన వారిని ఉత్సాహ పరిచాయి. కాగా సినిమా దర్శకుడు నారాయణమూర్తిని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, చాడ వెంకట్రెడ్డిలు సన్మానించారు. ఎంఆర్ పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ప్రజా గాయకుడు గద్దర్, సురేందర్, కళాకారులు, పాల్గొన్నారు.