లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి

ABN , First Publish Date - 2023-02-21T00:44:18+05:30 IST

చట్టబద్దత లేని లంబాడీలను ఎస్టీ జాబి తా నుంచి తొలగించాలని, ఇటీవల 11 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో చేసిన ప్రభుత్వ తీర్మానాన్ని ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తు తుడుందెబ్బ ఆధ్వ ర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.

లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి
ఐటీడీఏ ముందు ధర్నా నిర్వహిస్తున్న ఆదివాసీ గిరిజనులు

ఐటీడీఏ ఎదుట భారీ ధర్నా

ఉమ్మడి జిల్లా నుంచి వందలాదిగా తరలివచ్చిన ఆదివాసీ, గిరిజనులు

ఉట్నూర్‌, ఫిబ్రవరి 20: చట్టబద్దత లేని లంబాడీలను ఎస్టీ జాబి తా నుంచి తొలగించాలని, ఇటీవల 11 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో చేసిన ప్రభుత్వ తీర్మానాన్ని ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తు తుడుందెబ్బ ఆధ్వ ర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. సోమవారం స్థానిక ఐటీడీఏ ముట్టడి కార్యక్రమంలో బాగంగా ఉమ్మడి జిల్లాలోని వందలాది మంది ఆదివాసీ గిరిజనులు తరలి వచ్చి పాల్గొనగా ఐటీడీఏ ముందు ఏర్పాటు చేసిన ధర్నా లో రాష్ట్ర అధ్యక్షుడు బుర్స పోచయ్య, జిల్లా అధ్యక్షుడు గోడాం గణేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్కబాపురావు, నాయకులు ఉయిక సంజీవ్‌, పెందూర్‌ పుష్పరాణీ, రేణుకాబాయిలు మాట్లాడుతూ ఎస్టీ జాబితాలో అక్రమంగా చేర్చబడి న లంబాడాలను తొలగించాలని డిమాండ్‌ చేశారు. లంబాడాలు గిరిజనులుగా చెలామని కావడంతో ఆదివాసీల ప్రయోజనాలు అన్ని తన్నుకపోతున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ గిరిజనులపై సవతి తల్లి ప్రేమ చూయిస్తున్నాయని ఆరోపించారు.

ఆదివాసీ చట్టాల ఉల్లంఘన : తుడుందెబ్బ

ఆదివాసీ చట్టాలను అమలు చేయకుండా రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలలో ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని తుడుందెబ్బ నాయకులు ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆదివాసీ చట్టాలను, జీవోలను, హక్కులను, సాంస్కృతి, సాంప్రదాయాలను కాలరాస్తు మహిళలపై దాడులు చేయిస్తున్నారని, ఆదివాసులను అడవుల నుంచి వెళ్లగోట్టే కుట్రలు ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. ఈ సందర్భంగా నిర్మల్‌ కలెక్టర్‌, ఐటీడీఏ ఇంచార్జీ పీవో వరుణ్‌రెడ్డికి ఆదివాసీ గిరిజనులు 12 డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పీవో తన పరిదిలో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ పరిదిలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుక వెళ్తానని ఆదివాసీ గిరిజనులకు హమీ ఇచ్చారు.

ఐటీడీఏ వద్ద ఉద్రిక్తత

ఐటీడీఏ ముట్టడి కార్యక్రమానికి తుడుం దెబ్బ పిలుపు నివ్వడంతో ఉట్నూర్‌ డీఎస్పీ నాగేందర్‌ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ఉద యం నుంచి పోలీసులు ఐటీడీఏ ముందు బారీకేట్లు ఏ ర్పాటు చేసి బందోబస్తు నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఐటీడీఏ ముందు ధర్నా ప్రారంభించిన ఆది వాసీలు కొందరు కార్యాలయంలోకి దూసుకపోయే ప్రయ త్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీ ంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గేట్లు తోసి వేయడంతో తోపులాట జరిగింది. లోనికి వెళ్లిన ఆదివాసీలు కార్యాలయంపై రాళ్లదాడి చేయడంతో పాటు అక్కడ ఉన్న రెండు వాహనాలపై రాళ్లదాడి చేసి ధ్వంసానికి పాల్పడ్డారు. కార్యాలయం కిటికీల అద్దాలు సైతం ద్వంసమయ్యాయి. డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు లు ఆదివాసీలను ఐటీడీఏ ఆవరణ నుంచి బయటకు పంపించగా ఆదివాసీలు రోడ్డుపైన బైఠాయించారు. దీంతో మంచిర్యాల, ఉట్నూర్‌ రహదారిపై రాకపోకలు ఐదు గంటల పాటు నిలిచి పోయాయి. ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డికి ఆదివాసీ గిరిజనులు వినతిపత్రం సమర్పించి వెనుదిరిగారు.

ఐటీడీఏ ఉద్యోగుల్లో భయాందోళన

ఐటీడీఏ కార్యాలయాన్ని ఆదివాసీ గిరిజనులు ముట్టడించి రాళ్లదాడి చేయడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. ఐటీడీఏలోని ఉద్యోగులు, అధికారులు వెనుక గేట్ల నుంచి బయటపడ్డారు. ఐటీడీఏ ముట్టడి కార్యక్రమంలో ఐటీడీఏ కార్యకలాపాలు నిలిచిపోయాయి.

Updated Date - 2023-02-21T00:44:22+05:30 IST