భట్టి పాదయాత్రలో రచ్చకెక్కిన అంతర్గత విభేదాలు
ABN , First Publish Date - 2023-03-25T23:19:09+05:30 IST
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర సాక్షిగా స్థానిక కాంగ్రెస్ గ్రూపు విభేదాలు రచ్చకెక్కాయి. ఇద్దరు సోదరుల మధ్య కొంతకాలంగా నడుస్తున్న ప్రచ్ఛన్న వైరం పాదయాత్రలో బట్టబయలైంది.
ఆసిఫాబాద్, మార్చి 25(ఆంధ్రజ్యోతి): సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర సాక్షిగా స్థానిక కాంగ్రెస్ గ్రూపు విభేదాలు రచ్చకెక్కాయి. ఇద్దరు సోదరుల మధ్య కొంతకాలంగా నడుస్తున్న ప్రచ్ఛన్న వైరం పాదయాత్రలో బట్టబయలైంది. హాత్సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో పదవ రోజైన శనివారం భట్టి విడిది చేసిన జెండాగూడ నుంచి భాగ్యనగర్ కాలనీమీదుగా పాదయాత్ర నిర్వహించి ఆసిఫాబాద్ పట్టణంలో సభ నిర్వహించలనుకున్నారు. అయితే మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్రావు ప్రధాన అనుచరుడైన డాక్టర్ గణేష్ రాథోడ్ తన సామాజిక వర్గానికి చెందిన వారిని భారీగా రప్పించి ప్రేమలాగార్డెన్ సమీపంలో సభకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే డీసీసీ ఆధ్యక్షుడు విశ్వప్రసాద్రావు సభ స్థలం విషయమై తమకు సమాచారం లేదని తాము పట్టణంలో కార్నర్మీటింగ్ ఏర్పాటు చేశామని ప్రకటించ డంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా తోపు లాటలకు దారితీసింది. ఈ క్రమంలో గుర్తుతెలియని కార్యకర్తలు ప్రేం సాగర్రావును తోసివేయడంతో ఆయన తీవ్రంగా మనస్థాపం చెందారు. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ సభవేదికపై కన్నీరు పెట్టుకోవడం కార్యకర్తలను దిగ్ర్భాంతికి గురిచేసింది. ఈ క్రమంలో వేదికపైనే ఉన్న భట్టి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి.. ప్రేంసాగర్రావుకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆయన తన బాధను అనుచుకోలేక పోయారు. కొంతమంది కావాలనే ముందస్తు వ్యూహం ప్రకారమే తనను అవమానించేందుకు ప్రయత్నించారని వచ్చే ఎన్నికల్లో స్థానికనేతలు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తన మద్దతుదారుడికే టికెట్ ఇప్పించి గెలిపించి చూపిస్తానంటూ సభ వేదికగా శపథం చేశారు. ఈ పరిణామాలతో ఇద్దరు సోదరులకు ప్రధాన అనుచరులుగా ఉన్న కార్యకర్తలు ఆత్మరక్షణలో పడిపోయారు. ఆ తర్వాత పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్కు ప్రేంసాగర్ దూరంగా ఉండటం చర్చనీయంశంగా మారింది.