జోరుగా రేషన్‌ బియ్యం దందా

ABN , First Publish Date - 2023-03-25T23:20:57+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లు ఖర్చు చేసి పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయి. వీటి సేకరణకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక ముఠాలే పని చేస్తున్నాయి.

జోరుగా రేషన్‌ బియ్యం దందా

బెజ్జూరు, మార్చి 25: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లు ఖర్చు చేసి పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయి. వీటి సేకరణకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక ముఠాలే పని చేస్తున్నాయి. చైన్‌ సిస్టంలా పనిచేస్తూ ఒకరి నుంచి ఒకరు ప్రజల నుంచి బియ్యం సేకరిస్తున్నారు. వాటిని పెద్దమొత్తంలో సేకరించి పలువురు వ్యాపారులు మహారాష్ట్రకు తరలిస్తూ సొమ్ము చేసు కుంటున్నారు. సేకరించిన బియ్యానికి కిలోకు రూ.10వరకు కమీషన్‌ మిగులుతుండటంతో చాలామంది దీనిని వృత్తిగా మలుచుకుంటున్నారు. కొనుగోలు చేసిన బియ్యాన్ని నిత్యం మహారాష్ట్రకు తరలిస్తున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. నిత్యం రవాణా జరుగుతూనే ఉన్నా ఎప్పుడో ఒక్కసారి పట్టుబడటం గమనార్హం. రేషన్‌ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 15కిలోల బియ్యం ఇస్తుండటంతో బియ్యం అక్రమ దందా జోరందుకుంది. నిత్యం బియ్యం దందా కొనసాగుతూ ఏదో ఒకచోట దాడుల్లో పట్టుబడుతున్నా రేషన్‌ బియ్యం అక్రమరవాణా మాత్రం ఆగడం లేదు.

రవాణా ఇలా..

ప్రభుత్వం సరఫరా చేసే బియ్యాన్ని తినేందుకు చాలామంది ఇష్టపడటం లేదు. వీటిని వదిలి బహిరంగ మార్కెట్‌లో సన్నబియ్యం కొంటున్నారు. సగటున కిలోకు రూ.10చొప్పున దళారులకు, ఇతరులకు అమ్ముతున్నారు. మరికొన్ని చోట్ల కొందరు ఇంటింటికి తిరిగి రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. సిర్పూర్‌ నియోజకవర్గంలోని మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న బెజ్జూరు, కౌటాల, సిర్పూర్‌(టి), చింతలమానేపల్లి తదితర మండలాల్లో రేషన్‌ దందా జోరుగా కొనసాగుతోంది. ఆయా మండలాల్లో సేకరించిన రేషన్‌ బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడి బియ్యానికి మహారాష్ట్రలో మంచి డిమాండ్‌ ఉండటంతో కొంతమంది ఇదే పనిగా పెట్టుకొని బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. ఇక్కడ కిలోకు రూ.10తో కొనుక్కొని అక్కడ కిలోకు రూ.20నుంచి 25వరకు అమ్ముకుంటున్నారు. కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు మండలాల సరిహద్దున గల ప్రాణహిత నదిపై గూడెం వద్ద వంతెన పూర్తి కావడంతో అక్రమార్కులకు ఇది రాచమార్గంగా మారింది. ప్రతినిత్యం రాత్రివేళల్లో ద్విచక్రవాహనాలు, బొలేరో, ఆటోల్లో రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్రకు తరలించి లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇక సిర్పూర్‌ వంటి మండలం నుంచి రైళ్ల ద్వారా బియ్యాన్ని అక్కడికి చేర్చుతూ సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులు తరచూ దాడులు చేస్తున్నా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. కొంద మంది రేషన్‌ ఇచ్చే డీలర్ల వద్ద నుంచే రేషన్‌ బియ్యాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం. డీలర్లు బియ్యం పంపిణీ చేస్తున్న సమయంలోనే దళారులు లబ్ధిదారుల నుంచి అక్కడే కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది రేషన్‌డీలర్లు కూడా దళారులతో చేతులు కలిపి ఈ వ్యవహారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. డీలర్లు బయటకు రాకుండా ఉండేందుకు దళారుల చేత బియ్యాన్ని సేకరించి వచ్చిన ఆదాయం సమంగా పంచుకుంటున్నారని బాహాటంగానే ఆరోపణలు ఉన్నాయి.

మూలాల్లోకి వెళ్లని దర్యాప్తు..

జిల్లాలో రోజుల వ్యవధిలోనే అధికారులు అక్రమంగా నిల్వ ఉంచి, తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకుంటున్నారు. కానీ వాటి మూలాల్లోకి మాత్రం వెళ్లడం లేదన్నది సమాచారం. పట్టుబడిన వ్యక్తులు ఎక్కడి నుంచి వాటిని సేకరించారు. ఎన్నినెలల నుంచి వ్యాపారం సాగు తోంది. తదితర అంశాలపై లోతుగా దర్యాప్తు జరగకపోవడం వల్లనే కేసులు నమోదైనా మళ్లీ ఇదే దందా సాగించడమో లేదంటే వారి ప్రతినిధులను ఈ వ్యాపారంలో దింపి వెనుకనుంచి నడిపించడం లాంటివో చేస్తున్నారని తెలుస్తోంది. దొరికిన బియ్యానికి లెక్కలు అడిగి చర్యలు తీసుకుంటున్నారు. తప్పితే వారి వ్యాపార చరిత్రపై ఆరాతీయడం లేదు. ఇలా అక్రమార్కులు లక్షలు ఆర్జిస్తున్నారు. బియ్యం అక్రమ రవాణాపై అధికారులకు సమాచారం అందిన సమయాల్లోనే దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారే తప్ప అక్రమ రవాణాపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్‌ బియ్యం రవాణా అక్రమార్కులకు మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా మారింది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - 2023-03-25T23:20:57+05:30 IST