జిల్లాలో భారీ వర్షం
ABN , First Publish Date - 2023-09-05T22:31:36+05:30 IST
మంచిర్యాల జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. సోమవారం రాత్రి భారీ వర్షం కురవగా మంగళ వారం మధ్యాహ్నం తిరిగి వర్షం ప్రారంభమైంది.
- 30 గేట్ల ద్వారా గోదావరిలోకి నీరు విడుదల
- లోతట్టు ప్రాంతాలకు పొంచి ఉన్న ముప్పు
మంచిర్యాల, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. సోమవారం రాత్రి భారీ వర్షం కురవగా మంగళ వారం మధ్యాహ్నం తిరిగి వర్షం ప్రారంభమైంది. దీనికి తోడు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హాజీపూర్ మండలం గుడిపేటలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. మంచిర్యాల జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో 28.9 మిల్లీ మీటర్ల సగటు వర్షపా తం నమోదైంది. గరిష్ఠంగా జైపూర్ మండలంలో 70.5 మిల్లీ మీటర్ల వర్షం వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా హాజీపూర్ మండలంలో 5.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జన్నారం మండలంలో 68.8, వేమనపల్లి మండలంలో 47.0, భీమారం మండలంలో 40.8, నస్పూర్ మండలంలో 39.0, కోటపల్లి మండలంలో 38.5 మిల్లీ మీటర్లు కురిసింది. చెన్నూరు మండలంలో 37.8, మంచిర్యాల జిల్లా కేంద్రంలో 30.0, లక్షెట్టిపేట మండలంలో 29.3, కన్నెపల్లి మండలంలో 28.3, మందమర్రి మండలంలో 26.5, దండేపల్లి మండలంలో 24.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కాసిపేట మండలంలో 23.5, భీమిని మండలంలో 16.5, నెన్నెల మండలంలో 10.0, తాండూరు మండలంలో 8.3, బెల్లంపల్లి మండలంలో 5.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీ వరద..
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీ గేట్లు తెరవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు గరిష్ట మట్టం 486.93 అడుగులు కాగా, ప్రస్తుతం 485.21 అడుగులకు చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలుకాగా ప్రసు ్తతం 18.730 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టులోకి 3,27,706 క్యూసెక్కుల నీరు చేరుతుండగా ఎస్సారెస్పీ నుంచి 85,840 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు నుంచి 10,469 క్యూసెక్కులతోపాటు వర్షాల కారణంగా 2,31,397 క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో 3,43,151 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్నారు. హెచ్ఎండబ్ల్యుఎస్కు 306 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా ప్రాజెక్టు 30 గేట్లను తెరిచి 3,42,724 క్యూసెక్కులను దిగువన గోదా వరిలోకి వదులుతున్నారు.
నిలిచిన బొగ్గు తవ్వకాలు..
రెండు రోజులుగా ఎడతెరపి కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి డివిజన్లలోని ఓపెన్ కాస్టు గనుల్లో బొగ్గు తవ్వకాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఓబీ మట్టి తొలగింపు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. క్వారీల్లో నీరు నిలిచిపోవడంతో పనులు జరగడం లేదు. దీంతో యంత్రాల సహాయంతో నీటిని తోడుతు న్నారు. మూడు ఏరియాల్లోని ఇందారం, రామకృష్ణాపూర్, మందమర్రి, గోలేటి, కైరిగూడ ఓసీపీల్లో దాదాపు రూ. 13 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తితోపాటు, 4 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ (ఓవర్ బర్డెన్) మట్టి తవ్వకాల పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
పొంచి ఉన్న ముప్పు..
భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలకు ముంపు ముప్పు పొంచి ఉంది. ఎగువున కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పెద్ద మొత్తంలో వరద నీరు చేరుతోంది. దీంతో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 30 గేట్లు తెరిచి 3,42,724 క్యూసెక్కులను దిగువన గోదావరిలోకి వదులుతున్నారు. దీంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షాలు ఇలాగే కొనసాగితే గోదావరి ఉగ్రరూపం దాల్చి జిల్లా కేంధ్రంలోని లోతట్టు ప్రాంతాలైన ఎన్టీఆర్ నగర్, రాంనగర్, పద్మశాలి కాలనీ, ఆదిత్య ఎన్క్లేవ్ ఏరియాలోని ఇళ్లలోకి వరద నీరు చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం జూలైలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆయా ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. మళ్లీ అదే తరహాలో వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
హాజీపూర్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు, పై నుంచి వస్తున్న వరదతో మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో మంగళవారం 30 గేట్లు ఎత్తి నీటిని వదిలారు. గోదావరి పరివా హక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
జన్నారం: మండలంలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం వరకు భారీ వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షంతో జన్నారంలోని వాగులు , వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
జైపూర్: మండలంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి పెగడప ల్లి, టేకుమట్ల వాగులు ఉప్పొంగాయి. పెగడపల్లి వాగు ఉప్పొంగడంతో సమీప గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై నుంచి నీరు ప్రవహించడంతో ఎస్టీపీపీలో పనిచేస్తున్న కార్మికు లను యాజమాన్యం ఎక్స్కావేటర్ సహాయంతో ద్విచక్రవాహనాలను రోడ్డు అవతలికి దాటించారు.
మందమర్రిటౌన్: మందమర్రిలో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమ య్యాయి. పలు కాలనీల్లో వరద నీరు చేరింది.