ఉద్యాన వన పంటల అభివృద్ధికి కృషి చేయాలి
ABN , First Publish Date - 2023-07-19T22:53:42+05:30 IST
జిల్లాలో ఉద్యానవన పంటల అభివృద్ధికి ఉద్యానవన, వ్యవసాయ శాఖలు ఉపాధిహామీ పథకం అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, జూలై 19: జిల్లాలో ఉద్యానవన పంటల అభివృద్ధికి ఉద్యానవన, వ్యవసాయ శాఖలు ఉపాధిహామీ పథకం అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లాలోని నస్పూర్లోని జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడఉతూ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఉద్యానవన పంటలు అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని 5 ఎకరాల లోపు గల రైతులు ఉద్యాన పంటలు సాగు చేసే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, మిగిలిన వారికి 90 శాతం రాయితీపై మొక్కలు అందించనున్నామని తెలిపారు. మామిడి, సీతాఫలం, స్వీట్ ఆరేంజ్, సపోట, జీడితో పాటు డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కులు అందించనున్నామని చెప్పారు. వీటిని నర్సరీల ద్వారా పంపిణీ చేస్తామని తెలిపారు. జిల్లాకు కేటాయించిన 1,467 ఎకరాల లక్ష్యాన్ని సాధించే విధంగా వ్యవసాయ, ఉద్యానవన, ఉపాధి హామీ అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.