పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలి

ABN , First Publish Date - 2023-03-18T22:30:07+05:30 IST

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలకు డబుల్‌బెడ్‌రూంలు ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి అన్నారు.

 పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలి
మాట్లాడుతున్న సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి

మంచిర్యాల కలెక్టరేట్‌, మార్చి 18: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలకు డబుల్‌బెడ్‌రూంలు ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక, రైతు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే దిశగా ‘బీజేపీ హఠావో భారత్‌ బచావో’ నినాదంతో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రజల సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయన్నారు. 2014లో ఏర్పడిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాటి నుంచి నిరుపేదలకు ఇళ్ల ఇస్తామని హామీలు ఇస్తూ విస్మరించిందన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పేరిట రెండు సార్లు అధికారంలోకి వచ్చి మాట నిలుపుకోకపోవడం సరికాదని చెప్పారు. రాష్ట్రం వచ్చిన నాటి నుంచి నూతన రేషన్‌కార్డులు , ఆసరా పింఛన్‌లు, పోడు భూములకు దరఖాస్తులను స్వీకరిస్తూ అర్హులకు అందించడంలో కేసీఆర్‌ విఫలమయ్యారని తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడి పింఛన్‌లు, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు వెంటనే అందించాలని డిమాండ్‌ చేశారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల స్ధానంలో రూ. 3 లక్షలు ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించినప్పటికీ ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదన్నారు. రూ. 5 లక్షలతో ప్రభుత్వం ఇల్లు నిర్మించాలని సూచించారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ఒక్క ఇంటికి రూ. 6 లక్షల చొప్పున ప్రభుత్వం కేటాయించిందన్నారు. మరి ఇప్పుడు గృహలక్ష్మి పేరిట పేదలకు రూ. 3 లక్షలు ఇస్తే ఇళ్ల నిర్మాణం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ అంశాన్ని పునరాలోచించి రూ. 6 లక్షలను కేటాయించాలని కోరారు. మరో వైపు ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయని చెప్పారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కబ్జాలు చేస్తూ విక్రయిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఇళ్ల స్థలాలు లేని పేద వారికి ప్రభుత్వ స్థలాలను పంపిణీ చేయాలన్నారు. సీపీఐ గతంలో భూ పంపిణీపై పోరాటాలు సాగించిందన్నారు. పేదలకు న్యాయం జరగ్గకపోతే మరో ఉద్యమాన్ని చేపడతామన్నారు. సీపీఐ ప్రజల పక్షాన పోరాటాలను చేస్తుందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు ధరలను పెంచుతూ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందని అన్నారు. బడా కార్పోరేట్‌ శక్తులకు రూ. 12 లక్షల కోట్లు మాఫీ చేయడం సిగ్గు చేట న్నారు. బీజేపీ కార్పొరేట్‌ల ప్రభుత్వమని తెలిపారు. ఈ విధానాలను నిరసిస్తూ ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని మే 14 వరకు నిర్వహించనున్న దేశ వ్యాప్త ఆందో ళనల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌, పట్టణ కార్యదర్శి ఖలీందర్‌ఆలీఖాన్‌, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, నాయకులు రేగుంట చంద్రశేఖర్‌, భీమనాధుని సుదర్శన్‌, లింగం రవి, మిర్యాల రాజేశ్వర్‌రావు, పౌలు, దుర్గరాజ్‌, పోచన్న, మహేందర్‌, రవీందర్‌, శంకరయ్య, యాదగిరి, రాజేశం, నర్సయ్య, నర్సిం గరావు, రాజేశం, అంజి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T22:30:07+05:30 IST