తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
ABN , First Publish Date - 2023-08-09T22:55:02+05:30 IST
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక చట్ట విధానాలను నిరసిస్తూ నస్పూర్ తహసీల్దార్ కార్యాల యం వద్ద ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేపట్టారు.
నస్పూర్, ఆగస్టు 9: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక చట్ట విధానాలను నిరసిస్తూ నస్పూర్ తహసీల్దార్ కార్యాల యం వద్ద ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేపట్టారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్ పటాన్కు అందించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఐదు కనీస వేతనాల జీవోలను గెజిట్లో పొందుపరిచి అమలు చేయాలని కోరారు. కనీస వేతనాల జీవోలను ప్రకటించి అమలు చేయాలని, రైతాంగానికి కనీస మద్దతు ధరను ప్రకటించాలని, బీడీ కార్మికులందరికీ కనీస వేతనాల జీవోలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఎంవి యాక్టు 2019 ఎలక్ట్రిసిటీ బిల్లు 2022 ను వాపస్ తీసుకోవాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను పైవ్రేటు పరం చేయరాదన్నారు. కాంటాక్టు విధానం రద్దుచేసి కాంటాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు ఈఎస్ఐ గ్రాంట్స్తో సహా సోషల్ సెక్యూరిటీ స్కీం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయింపు పెంచాలని, పథకాన్ని పట్టణ ప్రాంతాలకు సైతం విస్తరించాలని చెప్పారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, మధ్యాహ్నం భోజనం లాంటి స్కీము వర్కర్లకు చట్టపరమైన వేతనాలు చెల్లించాలని కోరారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి ప్రజా పంపిణీ ద్వారా నిత్యవసర సరుకులు, వస్తువులు తక్కువ ధరలకు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ముష్కే సమ్మయ్య, మండల కార్యదర్శి దొడ్డిపల్లి రవీందర్, జిల్లా సమితి సభ్యు లు నర్సింగారావు, వీరేశం, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మానందం, జిల్లా నాయకులు నరసయ్య, శోభ పాల్గొన్నారు.