Bandi Sanjay : పిట్టల రాయుడిని పీకి పారేస్తాం
ABN , First Publish Date - 2023-03-05T02:36:02+05:30 IST
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పిట్టల రాయుడు ముఖ్యమంత్రిని పదవి నుంచి పీకి పారేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
బీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ సమితి
కేసీఆర్ బిడ్డ మద్యం దందా తెలంగాణ ఇజ్జత్ తీసింది
ప్రీతి ఘటనపై సీఎం స్పందించాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి ఫైర్
ఆదిలాబాద్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పిట్టల రాయుడు ముఖ్యమంత్రిని పదవి నుంచి పీకి పారేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ బిడ్డ కవిత చేసిన మద్యం దందా వల్ల తెలంగాణ ఇజ్జత్ పోతోందని, బీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ సమితి అని తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాక, ఆదిలాబాద్లో పచ్చజెండా ఎగురవేయాలని ఎంఐఎం నేతలకు సవాలు విసిరారు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్య ఘటనపై సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదిలాబాద్లో శనివారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్మిస్తున్న కొర్టా - చనకా, పిప్పల్కోటి రిజర్వాయర్ పనులు పూర్తికాక పోవడం వల్ల ఎకరానికి కూడా సాగునీరు అందడం లేదని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వని ముఖ్యమంత్రి వంద గదుల భవనాన్ని కట్టుకుని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాక ముందు తమకెలాంటి ఆస్తులు వద్దని చెప్పిన ముఖ్యమంత్రి కుటుంబం ఇప్పుడు జల్సాలు చేస్తోందన్నారు.
ముఖ్యమంత్రి కూతురు వంద కోట్లతో దొంగసారా దందా చేయడంతో ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ ఇజ్జత్ పోతోందని తెలిపారు. ఆదివాసీ బిడ్డలకు పోడు భూముల పట్టాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక్కొక్కరు రూ.లక్షా 20వేల అప్పు కట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. మళ్లీ కేసీఆర్ను గెలిపిస్తే అప్పు రెండింతలు అవుతుందన్నారు. హిందువులు స్వేచ్ఛగా పండుగల జరుపుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదని, పోలీసు, రెవెన్యూ అధికారుల అనుమతి తీసుకోవాల్సి వస్తోందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో పచ్చజెండా ఎగురవేసి చూపాలని ఎంఐఎంకు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు నాందేడ్లో నిర్వహించిన బహిరంగ సభలో శివాజీ మహరాజ్ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారని, అదే పనిని రాష్ట్రంలో చేస్తే ప్రభుత్వం లాఠీ దెబ్బలతో తరిమి కొట్టిందని విమర్శించారు. ఎంతోమంది అమరవీరుల త్యాగం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం ఏ త్యాగం చేసిందో చెప్పాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు మద్యం ద్వారా రూ.10వేల కోట్ల ఆదాయం వస్తే ఇప్పుడు అది రూ.40వేల కోట్లకు చేరిందని సంజయ్ చెప్పారు. బీఆర్ఎస్ అంటే భార్ అండ్ రెస్టారెంట్ సమితిగా మారిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఓటు వేస్తే ఆ నేతలు హోల్సేల్గా బీఆర్ఎ్సకు అమ్ముడుపోతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో భాగంగా పలువురు బీఆర్ఎస్ నేతలను సంజయ్ పార్టీలోకి ఆహ్వానించారు.