28 నుంచి రేషన్కార్డుల దరఖాస్తుల స్వీకరణ
ABN , Publish Date - Dec 23 , 2023 | 10:01 PM
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మీ-సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.
మంచిర్యాల, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మీ-సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, ఆహార భద్రత కార్డులు పొం దేందుకు అర్హతలున్న ప్రజలు సంవత్సరాల తరబడి నిరీక్షిస్తుండగా, ప్రభుత్వం దానికి తెరదించే పనిలో నిమగ్నమైంది. దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా కొత్త రేషన్కార్డుల జారీని ప్రక్రియ నిలిచిపోగా, బీఆర్ఎస్ హయాంలో రెండు సంవత్సరాల క్రితం ఆ ప్రస్తావన వచ్చింది. 2021 జూన్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో కొత్త కార్డుల ప్రక్రియ ప్రారంభం కాగా, అర్హతగల వారి నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు.
పెండింగ్లో 27వేల దరఖాస్తులు...
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి పలుమార్లు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రకటన చేయడంతో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 27,206 దరఖాస్తులు పెండింగులో ఉండగా, 2021లో మరోసారి దరఖాస్తులు ఆహ్వానించారు. కొత్త జిల్లాలు ఏర్పాటు అయిన అనంతరం పలుమార్లు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించడంతో అర్హులైన వారు పెద్ద మొత్తంలో దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాలోని వివిధ మండలాల్లో 04-10-2017 నుంచి 08-06-2021 వరకు పెండింగులో ఉన్న దరఖాస్తుల సంఖ్య ఇలా ఉంది. బెల్లంపల్లి మండలానికి సంబంధించి 2620 దరఖాస్తులు పెండింగులో ఉండగా, భీమినిలో 488, భీమారంలో 418, చెన్నూరులో 2966, దండేపల్లిలో 1382, హాజీపూర్లో 892, జైపూర్లో 1256, జన్నారంలో 1631, కన్నెపల్లిలో 477, కాసిపేటలో 1249, కోటపల్లిలో 959, లక్షెట్టిపేటలో 1360, మంచిర్యాలలో 3115, మందమర్రిలో 3581, నస్పూర్లో 2884, నెన్నెలలో 574, తాండూరులో 991, వేమనపల్లిలో 363 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి.
గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక...
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను గ్రామసభల్లో క్షేత్రస్థాయిలో చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో స్వీకరించిన దరఖాస్తులకు అదనంగా మరికొందరు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది. గతంలో స్వీకరించి పెండింగులో ఉన్న ధరఖాస్తులకు సంబంధించి నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ నుంచి పౌర సరఫరాలశాఖకు అందిన సమాచారం ప్రకారం 8095 కొత్త ఆహార భద్రత కార్డులకు మాత్రమే అప్పటి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలో 27వేల పై చిలుకు దరఖాస్తులు పెండింగులో ఉండగా కేవలం 8095 కార్డులకు మాత్రమే గ్రీన్సిగ్నల్ లభించింది. మిగతా దాదాపు 19వేల పైచిలుకు దరఖాస్తులు బుట్ట దాఖలయ్యాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులకు దరఖాస్తులు ఆహ్వానించినందున గతంలో దరఖాస్తు చేసుకున్న వారు సైతం మళ్లీ కొత్తగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హతగల వారికి కార్డులు అందనున్నాయి.
జిల్లాలో 2 లక్షల పైచిలుకు కార్డులు...
జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు 2 లక్షల 14 వేల 236 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. జిల్లాలోని మొత్తం రేషన్ కార్డుల్లో అంత్యోదయ కార్డుల లబ్ధిదారులు 15,417 కార్డులు ఉండగా, ఆహార భద్రత కార్డులు లక్ష 98వేల 649, అన్నపూర్ణ కార్డులు 170 ఉన్నాయి. జిల్లాలో ఉన్న లబ్ధిదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు జిల్లాలోని 311 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 423 చౌకధరల దుకాణాలు అందు బాటులో ఉన్నాయి. ఆయా దుకాణాల ద్వారా కార్డులున్న లబ్ధిదారులకు రేషన్ అందుతోంది. అయితే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు ఆహ్వానించినందున దుకాణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో 27వేల పై చిలుకు మంది ఇప్పటికే దరఖాస్తు చేసి ఉండటం, కొత్తగా మరికొందరు చేసే అవకాశం ఉండటంతో నూతన లబ్ధిదారుల సంఖ్య మేరకు జిల్లాలో మరో 40 షాపుల వరకే ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.