Palamuru-Ranga Reddy : 31 మోటార్లకు ఒక్కటే రెడీ!

ABN , First Publish Date - 2023-09-16T02:26:49+05:30 IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజలు ఇప్పటిదాకా కృష్ణా జలాలను అసలు చూడనేలేదా? వాటిని తాగడమే లేదా? ఆ జలాలతో పంటలు పండటం లేదా

 Palamuru-Ranga Reddy  : 31 మోటార్లకు ఒక్కటే రెడీ!

సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పరిస్థితి ఇదీ

కాల్వల నిర్మాణ ప్రక్రియ ఇంకా టెండర్ల దశలోనే

మరో మూడేళ్లయితే తప్ప పొలాలకు చేరని నీరు

అందుబాటులోకి వచ్చింది నాలుగు రిజర్వాయర్లే

4 ఏళ్లలోనే పూర్తి చేస్తానని 2015లో ప్రకటన

ఎనిమిదేళ్లయినా పూర్తి కాని పనులు

రూ.5,768 కోట్ల పెండింగ్‌ బిల్లులు

ఎన్నికల దృష్ట్యా హడావుడిగా పనులు

సీఎం హామీల అమలేదంటున్న నిర్వాసితులు

హైదరాబాద్‌, మహబూబనగర్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజలు ఇప్పటిదాకా కృష్ణా జలాలను అసలు చూడనేలేదా? వాటిని తాగడమే లేదా? ఆ జలాలతో పంటలు పండటం లేదా? చరిత్రలో తొలిసారిగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా భూములను కృష్ణమ్మ తాకనుందా? ఒక్క మోటార్‌తో ఏకంగా రెండు ఉమ్మడి జిల్లాలు (మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి) సస్యశ్యామలం కానున్నాయా? అవుననే చెబుతోంది సర్కారు బిల్డప్‌. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నాలుగుచోట్ల పంప్‌హౌస్‌లు ఉండగా, వీటిలో బిగించాల్సిన మోటార్లు అక్షరాలా 31. అయితే, శనివారం సీఎం కేసీఆర్‌ ఆన్‌ చేసే ఎల్లూరు పంప్‌హౌస్‌ వద్ద 8 మోటార్లు పెడుతుండగా, వాటిలో ఒక్కటి మాత్రమే డ్రైరన్‌ పూర్తి చేసుకొని వెట్‌రన్‌కు సిద్ధంగా ఉంది. మొత్తం పథకంలో ఈ స్థాయికి వచ్చిన మోటార్‌ ఇదొక్కటే. అయితే ఈ ఒక్క మోటార్‌కు స్విచ్‌ వేసి... దక్షిణ తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అవుతున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకోవటం విశేషం. 8 ఏళ్లుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను గాలికొదిలేసిన ప్రభుత్వం... రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందడానికే మొత్తం పూర్తయినట్లు ప్రచారం చేసుకుంటోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నెల 16వ తేదీన ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో సర్పంచ్‌లను సభకు రప్పించి... అదే రోజు కళశాలతో కృష్ణా జలాలను తీసుకెళ్లి... మరుసటి రోజు ఆలయాల్లో దేవతామూర్తుల పాదాలకు అభిషేకం చేయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్న తరుణంలో ప్రాజెక్టు శంకుస్థాపన సమయంలో ఇచ్చిన హామీల అమలుతో పాటు, నిర్వాసితుల సమస్యలు తెరమీదకు వస్తున్నాయి. రిజర్వాయర్లకు నీటిని తరలించే నిర్మాణాలే పూర్తిగా అందుబాటులోకి రాని పరిస్థితుల్లో ఏకంగా ప్రాజెక్టు పూర్తయిందనే భ్రమకల్పిస్తూ ప్రభుత్వం ప్రారంభోత్సవానికి సిద్ధమవడంఏమిటని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. కాల్వల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణలో ఇంతవరకు ఒక్క అడుగుముందుకు పడలేదు.

సగం పనులకే ప్రారంభోత్సవమని హడావుడి

8 ఏళ్లుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి దశలో చేపట్టిన నార్లాపూర్‌, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్‌ రిజర్వాయర్లలో మొదటి నాలుగు రిజర్వాయర్ల పనులు మాత్రమే ఒక కొలిక్కివచ్చాయి. ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక కీలకమైన రెండో దశలో కాల్వల నిర్మాణాలు జరపాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు పనులే మొదలు కాలేదు. మొత్తం 13 ప్రధాన కాల్వలను ప్రతిపాదించారు. 915 కి.మీ.ల కాల్వల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. తాజాగా వట్టెం రిజర్వాయర్‌ నుంచి 20.60 కి.మీ.ల లోలెవల్‌ కెనాల్‌, మరో 152 కి.మీ.ల ప్రధాన కాల్వ నిర్మాణానికి ఇటీవలే ఈ-ప్రొక్యూర్‌మెంట్‌లో టెండర్లు పిలిచారు. వీటితో పాటు కరివెన రిజర్వాయర్‌ నుంచి 36 కి.మీ.ల లోలెవల్‌ కాల్వను, మరో 108 కి.మీ.ల హైలెవల్‌ కెనాల్‌ను ప్రతిపాదించారు. ఉదండాపూర్‌ నుంచి దక్షిణ కాల్వను 25 కి.మీ.ల మేర, మొదటి కుడికాల్వను 5 కి.మీ.ల మేర, రెండో కుడికాల్వను 72 కి.మీ.ల మేర, హన్వాడ కాల్వను 23 కి.మీ.ల మేర నిర్మించాలని ప్రతిపాదించారు. ఇవన్నీ పూర్తికావడానికి మరో మూడేళ్లు పడుతుందని అంచనా. ఇదంతా పక్కనపెట్టి, కేవలం నాలుగు రిజర్వాయర్లను ఎన్నికల నాటికి నీటితో నింపి ప్రాజెక్టు పనులు పూర్తి చేశామనే ప్రచారానికి ప్రభుత్వం దిగుతోందని విమర్శలు వినపడుతున్నాయి.

పాలమూరు కృష్ణా జలాలను చూడలేదా?

పాలమూరు వాసులు ఇప్పటివరకూ కృష్ణా జలాలనే చూడలేదని, ఇప్పుడే ఆ అవకాశం వారికి దక్కుతుందన్నట్లుగా ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారంపైనా విస్మయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే, కృష్ణా బేసిన్‌ పరిధిలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద మహబూబ్‌నగర్‌ జిల్లాలో 3.69 లక్షల ఎకరాలకు ఇప్పటికే సాగునీరు అందుతుండగా... రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్‌) కింద 83 వేల ఎకరాలకు, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకం కింద 35 వేల ఎకరాలకు, రాజీవ్‌బీమా ఎత్తిపోతల పథకం కింద 1.66 లక్షల ఎకరాలకు, జవహర్‌ నెట్టెంపాడు కింద 1.42 లక్షల ఎకరాలకు, జూరాల కింద 1.09 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. అంతేకాకుండా, పదేళ్లుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో తాగునీటి అవసరాలకు కూడా కృష్ణా జలాలు వినియోగంలో ఉన్నాయి. ఈ నెల 16వ తేదీన ప్రారంభించే మోటార్‌తో నార్లాపూర్‌ రిజర్వాయర్‌లో నీళ్లు పడటం తప్ప.. అదనంగా తాగు, సాగునీటి అవసరాలు తీరే అవకాశాలు లేవు.

ఎన్నికల దాకే హంగామా

పాలమూరు-రంగారెడ్డి పథకం పనులు ఆరు నెలల నుంచే ఊపందుకున్నాయి. అంతకు ముందు ప్రభుత్వం ఈ పథకం వైపు కన్నెత్తిచూడలేదు. జూలై 31వ తేదీ నాటికి రూ.5,768 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.52 వేల కోట్లకు చేరగా... ఏ ఆర్థిక సంస్థ నుంచి రుణాలు మంజూరు కాకపోవడంతో ప్రభుత్వమే విడుదల చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఖజానాలోని నిధులు ఇతరత్రా అవసరాలకే ఖర్చవుతున్న దృష్ట్యా ప్రాజెక్టును పూర్తిచేయడం ఇప్పట్లో సాధ్యం కాదని, ఎన్నికల తర్వాత పనులన్నీ క్రమంగా మందగిస్తాయని అనుమానాలున్నాయి.

కరివెనకు నీరుచేరేలా పనులు

ఈనెల 16న సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా వెట్‌రన్‌ ప్రారంభించాక, అక్కడ నుంచి అంజనగిరి (నార్లాపూర్‌), ఏదుల, వట్టెం, రిజర్వాయర్లకు నీటిని తరలిస్తూ అక్టోబర్‌ నెలాఖరుకు కరివెన రిజర్వాయర్‌కు నీరు తీసుకొచ్చేలా ఇరిగేషన్‌ అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు సాగిస్తున్నారు. నార్లాపూర్‌ వద్ద సిద్ధం చేసిన 145 మెగావాట్ల సామర్థ్యం గల ఒక్క పంపు ద్వారా ప్రతీరోజు 3 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని సేకరించేలా పనులు సాగిస్తున్నారు. 9పంపుల్లో ఈ నెలాఖరుకు మరో పంపును సైతం అందుబాటులోకి తెస్తామని తద్వారా నీటి సేకరణ రోజుకు 6 వేల క్యూసెక్కులకు పెరుగుతుందని చెబుతున్నారు. నార్లాపూర్‌ వద్ద పనులు కొలిక్కి వస్తుండగా, మార్గంమధ్యలోని ఏదుల, వట్టెం రిజర్వాయర్ల వద్ద కూడా పంపుహౌజ్‌లు, పవర్‌స్టేషన్లు, పంపుల బిగింపు పనులు నడుస్తున్నాయి.

ప్రాజెక్టులపై నిండా నిర్లక్ష్యం

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద 5.70 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. అయితే ప్రభుత్వం నిధులే ఇవ్వకపోవడంతోపనులు పూర్తికాక కేవలం 3.69 లక్షల ఎకరాలకే నీరందుతోంది. రాజీవ్‌ బీమా కింద 1.98 లక్షల ఎకరాలకు 1.66 లక్షల ఎకరాలకే నీరిస్తున్నారు. ఇక జవహర్‌ నెట్టెంపాడు కింద 2 లక్షల ఎకరాలకు1.42 లక్షల ఎకరాలకే నీరందుతున్నాయి. కోయిల్‌సాగర్‌ కింద 50 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉండగా... 35 వేల ఎకరాలే సాగవుతోంది.

నిర్వాసితుల గోడు వినేదెవరు?

‘కృష్ణమ్మ జలాలతో పాలమూరు పాదాలు కడుగుతా. హరిహర బ్రహ్మాదులు ఎదురైనా, ఆరు నూరైనా, తల తాకట్టుపెట్టయినా నాలుగేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తాం. ముంపునకు గురవుతున్న కుటుంబాల్లో ఇంటికో ఉద్యోగమిస్తాం. వారి కడుపు నింపాకే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తాం. నిర్వాసితుల్లో ఎక్కువ మంది గిరిజనులు, బీసీలు, ఎస్సీలే. వారు సర్కారు జీతం తీసుకున్న తర్వాతే పనులు ప్రారంభిస్తాం. నిర్వాసితులకు రూ.5.04 లక్షలతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టించి ఇస్తాం’ - 2015 జూన్‌ 11వ తేదీన పాలమూరు-రంగారెడ్డి పథకానికి మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం కరివెన వద్ద శంకుస్థాపన చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఇది. అయితే, ఎనిమిదేళ్లయినా ప్రాజెక్టు పూర్తికాకపోవటం అటుంచి, నిర్వాసితులకు కూడా ప్రభుత్వం న్యాయం చేయలేకపోయింది. ఉద్యోగాలిస్తామని, ప్రాజెక్టు కిందనే భూములు ఇస్తామన్న సీఎం హామీ అమలు కాలేదని.. తమ భూములు గుంజుకొని, ఇళ్లను ముంచి తమను రోడ్డుపాలు చేశారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ హామీలను అమలు చేయకుండా కేసుల పేరుతో ప్రభుత్వం తప్పించుకుంటోందని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి.

పథకం కింద మొత్తం 20 ఆవాసాలు మునిగిపోయి, 2,836 కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయి. ఇందులో కరివెన రిజర్వాయర్‌ కింద నిర్వాసితులైన మూడు తండాలకు సంబంధించి భట్టుపల్లి పునరావాస గ్రామాన్ని ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించారు. మిగిలిన నార్లాపూర్‌, వట్టెం, ఏదుల, ఉదండాపూర్‌ రిజర్వాయర్ల కింద నిర్వాసితులయ్యే 17 ఆవాసాల నిర్వాసితులకు ఇప్పటివరకు ప్యాకేజీ ప్రకటించారే తప్ప ఆర్‌అండ్‌ఆర్‌ కేంద్రాలలో ప్లాట్ల కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పన చేపట్టలేదు. నిర్వాసితులందరికీ గంపగుత్తగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు కలుపుకొని రూ.12.50 లక్షల ప్యాకేజీని, ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్లలో 250 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వం ప్రతిపాదిస్తుంటే, ఉదండాపూర్‌ లాంటి ముంపు ప్రాంతాల్లో నిర్వాసితులు దాన్ని అంగీకరించడం లేదు. ప్రభుత్వ ప్యాకేజీకి నిర్వాసితులు అంగీకరించిన చోట్ల కూడా ఏళ్లు గడుస్తున్నా పనులు ముందుకు సాగని పరిస్థితి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, అధికార యంత్రాంగ్రం పట్టింపులేనితనాన్ని తెలియజేస్తోంది.

Updated Date - 2023-09-16T02:26:49+05:30 IST