కప్పుల్లో విశ్వకప్పు వేరయా..

ABN , First Publish Date - 2023-10-01T08:21:08+05:30 IST

గత ఐదు దశాబ్దాలుగా క్రికెట్‌ ప్రేమికులను మైమరిపిస్తూనే ఉంది.. నాలుగేళ్లకోసారి ఆయా దేశాల్లో టైటిల్‌ కోసం తలపడేందుకు అన్ని జట్లకు అవకాశం ఇస్తూనే ఉంది.. జరిగిన ప్రతీసారి ఎన్నెన్నో మధుర స్మృతులను పంచుతూనే ఉంది.....

కప్పుల్లో విశ్వకప్పు వేరయా..

గత ఐదు దశాబ్దాలుగా క్రికెట్‌ ప్రేమికులను మైమరిపిస్తూనే ఉంది.. నాలుగేళ్లకోసారి ఆయా దేశాల్లో టైటిల్‌ కోసం తలపడేందుకు అన్ని జట్లకు అవకాశం ఇస్తూనే ఉంది.. జరిగిన ప్రతీసారి ఎన్నెన్నో మధుర స్మృతులను పంచుతూనే ఉంది. అనామక క్రికెటర్లను హీరోలుగా మార్చేసి వారి కెరీర్‌ పూలపాన్పు అయ్యేందుకు దోహదపడుతూనే ఉంది.. ఆ కప్పులో ఏదో మ్యాజిక్‌ దాగి ఉంది. పోటీగా ఎన్ని ఈవెంట్లు బయలుదేరినా.. తానొస్తుందంటే అవన్నీ దిగదుడుపే అన్నట్టుగా ఉంటుంది.. అదే వన్డే వరల్డ్‌కప్‌. వచ్చేసింది.. మరోసారి అభిమానులను మైమరిపించేందుకు. ఈసారి వేదిక.. క్రికెట్‌ను మతంగా భావించే భారత్‌లోనే. ఈనేపథ్యంలో అసలేంటీ వన్డే వరల్డ్‌కప్‌? ఎక్కడ.. ఎప్పుడు.. ఎలా పుట్టింది? గెలుచుకున్న జట్ల వివరాలేమిటి? తదితర విషయాల్ని తెలుసుకుందామా...

వన్డేల ఆవిర్భావం..

ప్రతీ క్రికెటర్‌కు వన్డే ప్రపంచక్‌పలో పాల్గొనడం.. కప్‌ గెలవడం అనేవి జీవితకాల కోరికలుగా ఉంటాయి. వారికిది ఆకర్షణగా ఉంటే.. అభిమానులకు ఓ వ్యసనంగా చెప్పవచ్చు. ఇప్పుడంటే మనం రకరకాల క్రికెట్‌ ఫార్మాట్లను చూస్తున్నాం కానీ కొన్నేళ్లు వెనక్కి వెళితే అలా కాదు. కేవలం సంప్రదాయక టెస్టులు జరిగేవి. ఆ తర్వాత 1960 ఆరంభంలో ఒక్క రోజులోనే ముగిసేపోయేలా ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌ జట్లు మ్యాచ్‌లు ఆడడంతో వన్డేల పుట్టుక జరిగింది. 1962లో నాలుగు జట్ల మధ్య మిడ్‌లాండ్స్‌ నాకౌట్‌ కప్‌ పేరిట టోర్నీ ఆరంభమైంది. 1963లో గిల్లెట్‌ కప్‌ ద్వారా ఇంగ్లండ్‌లో వన్డే క్రికెట్‌ మరింతగా విస్తరించింది. తొలి అంతర్జాతీయ వన్డే మాత్రం 1971లో జరిగింది. అది కూడా విచిత్ర పరిస్థితిలో.. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ చివరి రోజు వర్షంతో రద్దయ్యింది. అయితే అప్పటికీ సమయం ఉండడంతో ప్రేక్షకులను సంతృప్తి పరిచేందుకు 40 ఓవర్ల ఆటను ఆడించారు. ఒక్కో ఓవర్‌కు ఎనిమిది బంతులు వేశారు.

ఈ పరిమిత ఓవర్ల ఆట ఆసీస్‌ అభిమానులను కూడా భలేగా ఆకట్టుకుంది. క్రమేపీ ఇతర జట్లు కూడా టెస్టులతో పాటు వన్డేలను కూడా తమ ద్వైపాక్షిక సిరీ్‌సల్లో చేర్చడం ఆరంభించాయి. ఇలా కాకుండా క్రికెట్‌ ఆడే దేశాల మధ్య ఓ పెద్ద టోర్నీ పెడితే ఎలా ఉంటుందని ఐసీసీ ఆలోచించింది. అదే వరల్డ్‌కప్‌

మూడుసార్లూ అక్కడే..

1975లో తొలిసారిగా విశ్వకప్‌ సంబరాలకు ఇంగ్లండ్‌ వేదికైంది. ఆ టోర్నీయేకాదు వరుసగా మూడు వరల్డ్‌క్‌పలు కూడా ఇంగ్లండ్‌లోనే జరగడం విశేషం. అక్కడే ఎందుకంటే.. అంత పెద్ద ఈవెంట్‌ను నిర్వహించేందుకు సరైన సదుపాయాలు, ఆర్థిక వనరులు లేని కారణంగా అప్పట్లో ఇతర సభ్య దేశాలేవీ ముందుకు రాలేదు. ఈ మూడింటిని వరల్డ్‌కప్‌ అని కాకుండా ప్రుడెన్షియల్‌ వరల్డ్‌ కప్‌ అనే పిలిచేవారు. కపిల్‌ డెవిల్స్‌ 1983లో గెలుచుకున్నది కూడా ఈ ట్రోఫీనే. దీనికాపేరు ఎందుకు వచ్చిందంటే.. బ్రిటిష్‌ మల్టీనేషనల్‌ కంపెనీ అయిన ప్రుడెన్షియల్‌ ఇన్సూరెన్స్‌ ఈ టోర్నమెంట్‌కు స్పాన్సరర్‌గా ఉండేది. ఇక 1975 ఈవెంట్‌లో 8 దేశాలు పాల్గొనగా 15 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఇవన్నీ కూడా 60 ఓవర్లపాటు జరగడం విశేషం. ఆటగాళ్ల జెర్సీలు కూడా టెస్టు తరహాలో తెల్లటి దుస్తులే ఉండేవి. క్లయువ్‌ లాయిడ్‌ నేతృత్వంలోని వెస్టిండీస్‌ జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా ఓడించి విజేతగా నిలిచింది. ఆ తర్వాత 1979లో ఇంగ్లండ్‌లోనే జరిగిన విశ్వకప్పులో కరీబియన్‌ టీమ్‌ రెండోసారి విజేతగా ఆవిర్భవించింది. ఫైనల్లో ఆతిథ్య జట్టును 92 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇక 1983 వరల్డ్‌కప్‌ సంగతి అందరికీ తెలిసిందే. అనామక జట్టుగా వెళ్లిన భారత్‌ ఏకంగా కప్‌తోనే తిరిగొచ్చింది. కపిల్‌ దేవ్‌ నేతృత్వంలోని భారత ఆటగాళ్లు ఫైనల్లో విండీస్‌పై చావోరేవో అనే రీతిలో చెలరేగారు. చివరికి ఎవరికీ తలవంచని విండీస్‌ వీరులకు ముకుతాడు వేసి దేశంలో క్రికెట్‌ ఆదరణకు బీజం పడేలా చేశారు.

2.jpg

తొలిసారి భారత్‌లో..

ప్రపంచకప్‌ తొలిసారి ఇంగ్లండ్‌ బయటకి వచ్చింది 1987లో.. భారత్‌-పాకిస్థాన్‌ సంయుక్తంగా ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యమిచ్చాయి. అయితే ఈ రెండు దేశాల్లో పగటి వెలుతురు ఎక్కువ సమయం ఉండని కారణంగా మ్యాచ్‌ను 50 ఓవర్లకు కుదించారు. అంతేకాదు.. అప్పట్లో ధీరూబాయి అంబానీకి చెందిన రిలయన్స్‌ గ్రూప్‌ స్పాన్సర్‌ చేయడంతో ఈ టోర్నీని రిలయన్స్‌ కప్‌ పేరిట పిలుచుకున్నారు. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌ సెమీ్‌సలోనే ఇంటిముఖం పట్టింది. చివరకు అలెన్‌ బోర్డర్‌ కెప్టెన్సీలో ఆసీస్‌ జట్టు ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది.

ఎన్ని మార్పులో..

1992 వరల్డ్‌కప్‌ అభిమానులకు సరికొత్త అనుభూతినిచ్చింది. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ కలిసి నిర్వహించిన ‘బెన్సన్‌ అండ్‌ హెడ్జెస్‌’ టోర్నమెంట్‌ మాత్రం మొత్తం రంగులమయంగా మారింది. అప్పటివరకు నాలుగు టోర్నీల్లో తెల్లటి దుస్తులతో కనిపించిన క్రికెటర్లంతా ఈ కప్‌లో మాత్రం వివిధ రంగుల జెర్సీలతో బరిలోకి దిగారు. అంతేనా.. తెల్ల బంతుల ప్రవేశం, డే/నైట్‌ మ్యాచ్‌లు, ఫీల్డింగ్‌ నిబంధనల్లో మార్పులు కూడా ఈ టోర్నీలో చేరాయి. ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ జట్టు అనూహ్యంగా ఈ కప్‌ను ఎగరేసుకుపోయింది. ఫైనల్లో ఇంగ్లండ్‌ జట్టును 22 పరుగులతో ఓడించింది. అనంతరం 1996లో భారత్‌-శ్రీలంక-పాకిస్థాన్‌ కలిసి విల్స్‌ కప్‌ పేరిట టోర్నీ నిర్వహించాయి. అండర్‌డాగ్‌ శ్రీలంక జట్టు అజేయ ఆటతీరుతో వహ్వా అనిపించింది. పవర్‌ప్లే ద్వారా ఆరంభంలోనే పరుగుల వరద పారించవచ్చని లంక ఓపెనర్లు జయసూర్య-కలువితరణ ఇతర జట్లకు నిరూపించారు. దీనికితోడు ఆతిథ్య జట్టు కప్‌ గెలవదనే సంప్రదాయాన్ని కాలదన్ని, అప్పటికి పసికూనగా ఉన్న శ్రీలంక విజేతగా నిలిచింది. టీమిండియా సెమీ్‌సతోనే సరిపుచ్చుకుంది.

అబ్బో.. కంగా‘రూల్‌’

ఆ జట్టు, ఈ జట్టు కాదు వరల్డ్‌క్‌పపై ఇక మనదే గుత్తాధిపత్యం అన్నట్టుగా 1999 నుంచి 2007 వరకు ఆస్ట్రేలియన్ల హవా సాగింది. 1999లో టోర్నమెంట్‌కు ఇంగ్లండ్‌ తిరిగి ఆతిథ్యమివ్వగా.. తొలిసారి సూపర్‌-6ను ప్రవేశపెట్టారు. ఫైనల్లో పాక్‌ను 132 పరుగులకే కట్టడి చేసిన ఆసీస్‌ ఘనవిజయం అందుకుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా- జింబాబ్వే-కెన్యా సంయుక్తంగా నిర్వహించిన 2003 ట్రోఫీలో జట్ల సంఖ్య 12 నుంచి 14కు పెరిగింది. భారత్‌ ఇందులో ఫైనల్‌కు చేరి అభిమానుల్లో అంచనాలు పెంచింది. కానీ 125 పరుగుల తేడాతో ఓడి కప్‌ను కంగారూలకు అప్పగించింది. ఇక 2007 టోర్నీ వెస్టిండీ్‌సలో జరగగా.. శ్రీలంక ఫైనల్‌కు చేరింది. అటు ఆసీస్‌ వరుసగా 29 ప్రపంచకప్‌ మ్యాచ్‌లతో పాటు హ్యాట్రిక్‌ వరల్డ్‌క్‌పలు గెలిచిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ సమయంలో కంగారూలను ఓడించడం అసాధ్యమన్నట్టుగా వారి ఆధిపత్యం సాగింది.

సొంత గడ్డపై ధమాకా

విచిత్రంగా చివరి మూడు వరల్డ్‌క్‌పలను ఆతిథ్య జట్లే గెలుచుకోవడం విశేషం. 2011లో భారత్‌-శ్రీలంక-బంగ్లాదేశ్‌ వరల్డ్‌క్‌పను నిర్వహించాయి. పాక్‌ పర్యటనలో లంక క్రికెటర్ల బస్సుపై టెర్రరిస్టుల దాడి జరగడంతో ఆ దేశం ఆతిథ్య హక్కులు కోల్పోయింది. ఇక స్వదేశీ మద్దతుతో ఎంఎస్‌ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా ఫైనల్లో శ్రీలంకను ఓడించి రెండోసారి విశ్వవిజేతగా మురిపించింది. అటు ఆసీస్‌ ఆధిపత్యానికి గండిపడింది కూడా ఈ టోర్నీలోనే. కానీ 2015లో తమ దేశంలో జరిగిన టోర్నీలో తిరిగి ఆసీస్‌ ట్రోఫీని ముద్దాడింది. ఫైనల్లో కివీస్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. 2019 టోర్నమెంట్‌కు ఇంగ్లండ్‌ ఆతిథ్యమివ్వగా కప్‌ను ఆ జట్టే గెలుచుకుంది. వరుసగా కివీస్‌ జట్టు రెండోసారి ఫైనల్‌కు చేరి అద్వితీయ పోరాటాన్ని చూపింది. ఇరు జట్ల స్కోరు 241తో టై అవగా.. 15 రన్స్‌తో సూపర్‌ ఓవర్‌ కూడా టై అయ్యింది. దీంతో ప్రత్యర్థికన్నా బౌండరీల సంఖ్య ఎక్కువగా ఉందనే కారణంతో మోర్గాన్‌ సేన తొలిసారిగా కప్‌ను ఎగరేసుకుపోయింది.

ఎంపిక విధానం

2019 మాదిరే ప్రస్తుతం భారత్‌లో జరిగే టోర్నమెంట్‌లోనూ 10 జట్లు పాల్గొంటున్నాయి. అయితే వీటిని ర్యాంకింగ్స్‌ ఆధారంగా నిర్ణయించలేదు. 2020 నుంచి 2023 మధ్య వన్డే సూపర్‌ లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌ల ఫలితాలను పరిగణనలోకి తీసుకుని టాప్‌-7 జట్లకు నేరుగా అర్హత కల్పించారు. ఆతిథ్య జట్టు హోదాలో భారత్‌ చోటు దక్కించుకోగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌ ఇతర జట్లు. మిగతా రెండు బెర్త్‌ల కోసం.. సూపర్‌ లీగ్‌లో చివరి ఐదు జట్లు, ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ లీగ్‌-2లో టాప్‌-3 జట్లు, వరల్డ్‌కప్‌ క్వాలిపయర్‌ ప్లేఆ్‌ఫ్సలో టాప్‌-2 జట్ల మధ్య క్వాలిఫికేషన్‌ టోర్నీని నిర్వహించారు. జింబాబ్వేలో జరిగిన ఈ టోర్నీ ద్వారా నెదర్లాండ్స్‌, శ్రీలంక బెర్త్‌ దక్కించుకున్నాయి. చరిత్రలో తొలిసారిగా విండీస్‌ జట్టు వరల్డ్‌క్‌పనకు అర్హత సాధించలేకపోయింది. శాశ్వత సభ్య దేశాలు ఐర్లాండ్‌, జింబాబ్వే జట్లకు కూడా నిరాశే ఎదురైంది.

ఇదీ ఫార్మాట్‌..

వన్డే వరల్డ్‌కప్‌ రౌండ్‌ రాబిన్‌ పద్దతిన జరుగుతుంది. ఇందులో పాల్గొనే పది జట్లు మిగతా తొమ్మిది జట్లతో పోటీ పడాల్సి ఉంటుంది. గెలిచిన ప్రతీ జట్టుకు రెండు పాయింట్లు లభిస్తాయి. ఫలితం తేలకపోతే పాయింట్లు సమానంగా పంచుకుంటాయి. రౌండ్‌ రాబిన్‌ ముగిశాక పాయింట్ల పట్టికలో టాప్‌-4 జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఇందులో నెగ్గిన జట్లు టైటిల్‌ కోసం ఫైనల్లో తలపడతాయి. మొత్తంగా 45 గ్రూప్‌, మూడు నాకౌట్‌ మ్యాచ్‌లు జరుగుతాయి.

ఇవీ నిబంధనలు

  • ఒక్కో సెషన్‌ మూడున్నర గంటలు ఉండనుంది. మధ్యలో 45 నిమిషాలపాటు విరామం ఉంటుంది.

  • టాస్‌ వేశాక ఇరు జట్ల కెప్టెన్లు తమ తుది జట్టును ప్రకటించాల్సి ఉంటుంది.

  • ప్రతీ బౌలర్‌ గరిష్ఠంగా పది ఓవర్లు వేయాలి. ఒకవేళ వర్షం కురిసి ఓవర్లు కుదిస్తే ఈ నిబంధన మారుతుంది.

  • తొలి పది ఓవర్లు మొదటి పవర్‌ప్లే (పీ1)ఉంటుంది. ఈ సమయంలో ఇద్దరు ఫీల్డర్లను మాత్రమే 30 గజాల సర్కిల్‌ ఆవల అనుమతిస్తారు.

  • 11-40 ఓవర్ల మధ్య రెండో పవర్‌ప్లే (పీ2) ఉంటుంది. అప్పుడు 30 గజాల సర్కిల్‌ ఆవల నలుగురు ఫీల్డర్లను అనుమతిస్తారు.

  • 41-50 ఓవర్ల మధ్య చివరిదైన మూడో పవర్‌ప్లే (పీ3) ఉంటుంది. ఈ దశలో 30 గజాల సర్కిల్‌ ఆవల ఐదుగురు ఫీల్డర్లకు అనుమతి ఉంటుంది.

- నరేందర్‌ గౌడ్‌

Updated Date - 2023-10-01T08:52:26+05:30 IST