IndiaVsAustralia: సడెన్‌గా హోటల్ ఖాళీ చేసిన టీమిండియా.. జట్టుతోపాటు ఉండని విరాట్ కోహ్లీ

ABN , First Publish Date - 2023-02-16T20:17:09+05:30 IST

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (IndiaVsAustralia) మధ్య ఢిల్లీ వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ మొదలుకానున్న నేపథ్యంలో టీమిండియాకి అనూహ్య పరిస్థితి ఎదురైంది.

IndiaVsAustralia: సడెన్‌గా హోటల్ ఖాళీ చేసిన టీమిండియా.. జట్టుతోపాటు ఉండని విరాట్ కోహ్లీ

న్యూఢిల్లీ: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (IndiaVsAustralia) మధ్య ఢిల్లీ వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ మొదలుకానున్న నేపథ్యంలో టీమిండియాకి అనూహ్య పరిస్థితి ఎదురైంది. త్వరలోనే జరగనున్న జీ20 సమ్మిట్ (G20 Summit), పెళ్లిళ్ల సీజన్ (Wedding season) దృష్ట్యా ఢిల్లీలోని హోటళ్లు అడ్వాన్స్ బుకింగ్స్‌తో నిండిపోయాయి. దీంతో ఇప్పటికే బస చేస్తున్న హోటల్‌ను ఖాళ్లీ చేసి టీమిండియా మరో హోటల్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. టీమిండియా ఢిల్లీలో సాధారణంగా తాజ్ ప్యాలెస్ (Taj palace) లేదా ఐటీసీ మౌర్య (ITC Maurya) హోటళ్లలో బస చేస్తుంటుంది. అయితే ఈసారి కర్కార్‌దుమాలోని ‘హోటల్ లీలా’లో బస చేసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘‘ఢిల్లీలోనే ఇతర ప్రాంతంలో ఉండే మరో హోటల్‌లో టీమ్ ఉండాల్సి వచ్చింది. పెళ్లిళ్ల సీజన్, జీ20 సదస్సుల కారణంగానే ఐటీసీ మౌర్య లేదా తాజ్ హోటళ్లలో బస చేయడం కుదరలేదు’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

కాగా కింగ్ కోహ్లీ టీమిండియా సభ్యులతో హోటల్లో ఉండడం లేదు. కోహ్లీ నివాసం ఢిల్లీయే కావడంతో కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉంటున్నారు. దీంతో గురుగ్రామ్‌లోని తన ఇంట్లోనే కుటుంబ సభ్యులతో గడపాలని కోహ్లీ నిర్ణయించుకోవడమే ఇందుకు కారణం. కాగా ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. డిసెంబర్ 2017 తర్వాత ఢిల్లీ ఆతిథ్యమివ్వబోతున్న మొట్టిమొదటి టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. కాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో 1-0 తేడాతో టీమిండియా ఇప్పటికే ముందంజలో ఉంది.

Updated Date - 2023-02-16T20:17:36+05:30 IST