Share News

IND Vs PAK : 8/8 వన్‌సైడ్‌.. పాకిస్తాన్‌పై అదే జైత్రయాత్ర..

ABN , First Publish Date - 2023-10-15T03:31:16+05:30 IST

: ప్రపంచక్‌పలో పాకిస్థాన్‌పై భారత జట్టు జైత్రయాత్ర సాగుతోంది. అటు బౌలింగ్‌.. ఇటు బ్యాటింగ్‌ విభాగాల్లో రాణిస్తూ శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్‌ సేన 7

IND Vs PAK : 8/8 వన్‌సైడ్‌.. పాకిస్తాన్‌పై అదే జైత్రయాత్ర..

పాక్‌పై భారత్‌ వరుసగా ఎనిమిదో విజయం

రఫ్పాడించిన రోహిత్‌

బౌలర్ల సూపర్‌ షో

దశాబ్దాలుగా దాయాది పాకిస్థాన్‌పై అదే ఆధిపత్యం. కోట్లాదిమంది భారతీయులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన మ్యాచ్‌ ఆశించిన రీతిలోనే ముగిసింది. వన్డే వరల్డ్‌క్‌పలో ఎన్నిసార్లు ఎదురొచ్చినా మిమ్మల్ని చిత్తు చేసేది మేమేనంటూ.. టీమిండియా ఈ వార్‌ను వన్‌సైడ్‌ చేసేసింది. ఎనిమిదికి ఎనిమిది విజయాలతో క్రీడాభిమానులను మురిపిస్తూ.. వీధుల్లో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడేలా చేసింది. అనిశ్చితికి మారుపేరైన పాక్‌ను బౌలర్లు తలా రెండేసి వికెట్లతో ఆడేసుకోగా.. అనంతరం హిట్‌మ్యాన్‌ రోహిత్‌ తన స్ట్రోక్‌ప్లే పవర్‌ ఏంటో చూపించాడు. 2019 టోర్నీ తరహాలోనే విరుచుకుపడి ఆరు సిక్సర్లతో పాక్‌ బౌలర్లను బెంబేలెత్తించాడు. ఇక శ్రేయాస్‌ అజేయ అర్ధసెంచరీతో ఈ ఏకపక్ష పోరును మరో 117 బాల్స్‌ ఉండగానే ముగించాడు. మరోవైపు లక్షా 30 వేల మంది సమక్షంలో మ్యాచ్‌ హోరాహోరీగా సాగకపోయినా పాక్‌పై భారత్‌ నుంచి అభిమానులకు ఇంతకంటే కావాల్సిందేముంటుంది!

అహ్మదాబాద్‌: ప్రపంచక్‌పలో పాకిస్థాన్‌పై భారత జట్టు జైత్రయాత్ర సాగుతోంది. అటు బౌలింగ్‌.. ఇటు బ్యాటింగ్‌ విభాగాల్లో రాణిస్తూ శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్‌ సేన 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 86) నుంచి మరో కీలక ఇన్నింగ్స్‌ రాగా.. శ్రేయాస్‌ అయ్యర్‌ (62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 నాటౌట్‌) అజేయ అర్ధసెంచరీ సాధించాడు. తాజా టోర్నీలో హ్యాట్రిక్‌ కొట్టిన భారత్‌ అటు పాయింట్ల పట్టికలోనూ టాప్‌లో నిలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 42.5 ఓవర్లలో 191 పరుగులకు కుప్పకూలింది. బాబర్‌ ఆజమ్‌ (50), రిజ్వాన్‌ (49), ఇమామ్‌ ఉల్‌ హక్‌ (36) మాత్రమే రాణించారు. బుమ్రా, హార్దిక్‌, కుల్దీప్‌, జడేజా, సిరాజ్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. ఛేదనలో భారత్‌ 30.3 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసి గెలిచింది. షహీన్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా బుమ్రా నిలిచాడు.

హిట్‌మ్యాన్‌ బాదుడు

192 పరుగుల స్వల్ప ఛేదనలో భారత్‌ ఏ దశలోనూ ఇబ్బందిపడలేదు. పాక్‌ బౌలర్లు పూర్తిగా గతి తప్పడంతో పరుగులకు లోటులేకుండా పోయింది. కెప్టెన్‌ రోహిత్‌ తన భీకర ఫామ్‌తో విరుచుడుపడగా.. శ్రేయాస్‌ అర్ధసెంచరీతో తుదికంటా నిలిచాడు. విరాట్‌ కోహ్లీ (16) స్వల్ప స్కోరుకే వెనుదిరిగి అభిమానులను కాస్త నిరాశపరిచాడు. ఆరంభంలో గిల్‌ చేసిన 16 పరుగులు ఫోర్ల రూపంలోనే వచ్చాయి. దీంతో అచ్చొచ్చిన మైదానంలో మరోసారి అతడి నుంచి భారీ ఇన్నింగ్స్‌ ఖాయమనిపించింది. కానీ పేసర్‌ షహీన్‌ అతడిని బోల్తా కొట్టించడంతో మూడో ఓవర్‌లోనే జట్టు తొలి వికెట్‌ కోల్పోయింది. అటు రోహిత్‌ మాత్రం తనదైన శైలిలో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఏడో ఓవర్‌లో తన సిక్సర్‌, విరాట్‌ రెండు ఫోర్లతో 15 పరుగులు వచ్చాయి. తర్వాత 9వ ఓవర్‌లో రోహిత్‌ బాదిన రెండు సిక్సర్లు హైలైట్‌గా నిలిచాయి. పదో ఓవర్‌లో విరాట్‌ను హసన్‌ అలీ అవుట్‌ చేయడంతో రెండో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత రోహిత్‌కు శ్రేయాస్‌ జత కలిశాడు. కుదురుకునేందుకు శ్రేయాస్‌ కాస్త సమయం తీసుకున్నా రోహిత్‌ మాత్రం 36 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. 20వ ఓవర్‌లో రోహిత్‌ 4,6తో సెంచరీకి చేరువయ్యాడు. ఈ దశలో షహీన్‌ రెండో స్పెల్‌లో రోహిత్‌ను అవుట్‌ చేయడంతో పాక్‌ కాస్త ఊపిరి పీల్చుకుంది. అప్పటికే మూడో వికెట్‌కు 77 పరుగులు జత చేరగా.. జట్టు విజయానికి మరో 36 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. చాలినన్ని ఓవర్లు ఉండడంతో శ్రేయాస్‌, రాహుల్‌ (19 నాటౌట్‌) సునాయాసంగా ఆడేస్తూ మ్యాచ్‌ను ముగించారు. చివర్లో ఫోర్‌తో విన్నింగ్‌ షాట్‌ బాదిన శ్రేయాస్‌ తన అర్ధసెంచరీని సైతం పూర్తి చేసుకున్నాడు.


బౌలర్ల ధమాకా

4,4,4,4.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ తొలి 16 పరుగులను సాధించిన తీరిది. భారత బౌలర్లకు పిచ్‌ నుంచి ఎలాంటి స్వింగ్‌, బౌన్స్‌ లభించకపోవడంతో పాక్‌ ఈ మ్యాచ్‌లో కనీసం 280-290 పరుగులైనా సాధిస్తుందనిపించింది. ఇలాంటి ట్రాక్‌పై రోహిత్‌ తప్పు నిర్ణయం తీసుకున్నాడా? అని అభిమానులు సందేహించారు. కానీ బౌలర్లు మాత్రం పాక్‌ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించారు. వీరి ధాటికి కనీసం ఒక్క సిక్సర్‌ కూడా బాదలేకపోగా, బాబర్‌, రిజ్వాన్‌ మాత్రమే నిలదొక్కుకున్నారు. అయితే ఇన్నింగ్స్‌ ఆరంభంలో ఓపెనర్లు షఫీక్‌ (20), ఇమామ్‌ ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్‌ కొనసాగించారు. బుమ్రా ఓవైపు కట్టడి చేస్తున్నా సిరాజ్‌ ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు. కానీ ఎనిమిదో ఓవర్‌లో రోహిత్‌ సలహాతో బంతి విసిరిన సిరాజ్‌ తొలి దెబ్బ తీశాడు. సెంచరీతో ఫామ్‌లో ఉన్న అబ్దుల్లాను ఎల్బీ చేయడంతో పాక్‌ 41 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది.

ఈ వికెట్‌తో అటు సిరాజ్‌ బౌలింగ్‌లోనూ మార్పు కనిపించింది. అటు కుదురుకున్న ఇమామ్‌ను హార్దిక్‌ అవుట్‌ చేసి మరింత ఊపునిచ్చాడు. కానీ క్రీజులో పాక్‌ కీలక ఆటగాళ్లు బాబర్‌, రిజ్వాన్‌ నిలిచారు. రిజ్వాన్‌ ఆదిలోనే అవుటయ్యే ప్రమాదం నుంచి డీఆర్‌ఎస్‌ ద్వారా తప్పించుకున్నాడు. భారత బౌలర్లను దీటుగా ఆడేస్తూ స్కోరును గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. అయితే స్పిన్నర్లు జడేజా, కుల్దీప్‌ ఓవర్లను మాత్రం ఇద్దరూ ఆచితూచి ఆడారు. అటు తాజా టోర్నీలో తొలిసారి బాబర్‌ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఇద్దరి ఆటతీరుతో పాక్‌ కుదురుకున్నట్టే కనిపించింది. కానీ సిరాజ్‌ మరోసారి మొతేరాను మోతెక్కిస్తూ.. ఓ రిప్పర్‌తో బాబర్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో మూడో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అంతే.. ఇక ఆ తర్వాత బౌలర్ల మూకుమ్మడి దాడితో పాక్‌ బ్యాటర్లు చిగురుటాకులా వణికిపోయారు. 33వ ఓవర్‌లో షకీల్‌ (6), ఇఫ్తికార్‌ (4)లను అద్భుత బంతులతో పెవిలియన్‌కు చేర్చిన కుల్దీప్‌ పాక్‌కు గట్టి షాకే ఇచ్చాడు. తర్వాతి ఓవర్‌లో రిజ్వాన్‌ను బుమ్రా బౌల్డ్‌ చేసిన తీరు వహ్వా అనిపించింది. దీంతో పాక్‌ ఒక్కసారిగా లయ తప్పింది. ఓ దశలో 155/2 స్కోరుతో పటిష్ఠంగా కనిపించిన ఈ జట్టు ఆ తర్వాత 36 పరుగుల వ్యవధిలోనే చివరి 8 వికెట్లు కోల్పోవడం గమనార్హం.

కోహ్లీ రాంగ్‌ జెర్సీ

అహ్మదాబాద్‌: హైవోల్టేజ్‌ మ్యాచ్‌లో కోహ్లీ పొరబాటున మరో జెర్సీ వేసుకొని వచ్చాడు. దీన్ని గమనించిన అతడు ఏడో ఓవర్‌లో బయట వెళ్లి .. జెర్సీని మార్చుకొని 8వ ఓవర్‌లో మళ్లీ ఫీల్డ్‌లోకి వచ్చాడు. వరల్డ్‌క్‌పలో భారత జట్టు కోసం భుజాలపై మువ్వన్నెల చారలతో ఉన్న జెర్సీలను ప్రత్యేకంగా తయారు చేశారు. కానీ, కోహ్లీ తెలుపు చారలున్న టీషర్ట్‌ వేసుకొని వచ్చాడు. తప్పిదాన్ని గమనించిన వెంటనే డగౌట్‌కు వెళ్లి జెర్సీని మార్చుకొన్నాడు.

పిక్కటిల్లిన ‘జై శ్రీరామ్‌’

‘జై శ్రీరామ్‌’ అంటూ లక్షకు పైగా గొంతుకలు గళమెత్తితే ఆ అనుభూతి ఎలా ఉంటుందో అనే దానికి ఈ మ్యాచ్‌ సాక్ష్యంగా నిలిచింది. విరామ సమయంలో స్టేడియంలోని డీజే.. ఆదిపురుష్‌ సినిమాలోని ‘జై శ్రీరామ్‌’ పాటను ప్లే చేశాడు. దీంతో స్టేడియంలోని ప్రేక్షకులంతా జై శ్రీరామ్‌ అంటూ అందుకోవడంతో ఆ ప్రాంతమంతా రామనామస్మరణతో మారుమ్రోగిపోయింది. అదే సమయంలో అభిమానులంతా వందేమాతరం కూడా ఆలపించారు.

బాబర్‌ను ఎగతాళి చేస్తూ..

బాబర్‌ ఆజమ్‌కు చేదు అనుభవం ఎదురైంది. టాస్‌ కోసం అతడు వచ్చినప్పుడు స్టాండ్స్‌లోని అభిమానులు పెద్దగా అరుస్తూ హేళన చేశారు. అయితే, బాబర్‌ వాటిని పట్టించుకోలేదు. పూర్తిగా నిండిపోయిన స్టేడియంలో మ్యాచ్‌ను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తామని హుందాగా చెప్పాడు.

పాక్‌తో రోహిత్‌ ఆడిన చివరి 8 మ్యాచ్‌ల్లో రెండు శతకాలు, నాలుగు అర్ధసెంచరీలు ఉండడం విశేషం.

ఓ జట్టుపై వరల్డ్‌కప్‌లో ఏకపక్ష విజయాలు (పాక్‌పై 8-0) సాధించిన జట్టుగా భారత్‌. పాక్‌ కూడా శ్రీలంకపై ఇన్నే విజయాలతో టాప్‌లో ఉంది.

వరల్డ్‌కప్‌లో భారత్‌ తరఫున ఎక్కువ పరుగులు (1195) సాధించిన రెండో బ్యాటర్‌గా రోహిత్‌. సచిన్‌ (2278) టాప్‌లో ఉన్నాడు. అలాగే సచిన్‌ (21) తర్వాత ఎక్కువ 50+ స్కోర్లు (11) సాధించిన బ్యాటర్‌ అయ్యాడు.

వరల్డ్‌కప్‌లో భారత్‌పై రెండోసారి అత్యల్ప స్కోరు (191) నమోదు చేసిన పాకిస్థాన్‌. 1999లో 180కి ఆలౌటైంది.

వన్డేల్లో ఎక్కువ సిక్సర్లు (302) బాదిన మూడో బ్యాటర్‌గా రోహిత్‌. షాహిద్‌ అఫ్రీది (351), గేల్‌ (331) ముందున్నారు.

వన్డేల్లో పాక్‌ 30+ పరుగుల వ్యవధిలోనే చివరి ఎనిమిది వికెట్లు (36/8) కోల్పోవడం ఇది మూడోసారి. గతంలో 32, 33 రన్స్‌కు కోల్పోయింది.

ప్రపంచకప్‌లో ఓ జట్టు (భారత్‌) నుంచి ఐదుగురు బౌలర్లు రెండేసి వికెట్లు తీయడం ఇది మూడోసారి. గతంలోనూ భారత్‌, కివీస్‌ ఈ ఫీట్‌ సాధించాయి.

స్కోరుబోర్డు

పాకిస్థాన్‌: అబ్దుల్లా (ఎల్బీ) సిరాజ్‌ 20; ఇమామ్‌ ఉల్‌ హక్‌ (సి) రాహుల్‌ (బి) హార్దిక్‌ 36; బాబర్‌ (బి) సిరాజ్‌ 50; రిజ్వాన్‌ (బి) బుమ్రా 49; సౌద్‌ షకీల్‌ (ఎల్బీ) కుల్దీప్‌ 6; ఇఫ్తికార్‌ (బి) కుల్దీప్‌ 4; షాదాబ్‌ (బి) బుమ్రా 2; నవాజ్‌ (సి) బుమ్రా (బి) హార్దిక్‌ 4; హసన్‌ అలీ (సి) గిల్‌ (బి) జడేజా 12; షహీన్‌ (నాటౌట్‌) 2; హరీస్‌ (ఎల్బీ) జడేజా 2; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 42.5 ఓవర్లలో 191 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-41, 2-73, 3-155, 4-162, 5-166, 6-168, 7-171, 8-187, 9-187, 10-191. బౌలింగ్‌: బుమ్రా 7-1-19-2; సిరాజ్‌ 8-0-50-2; హార్దిక్‌ 6-0-34-2; కుల్దీప్‌ 10-0-35-2; జడేజా 9.5-0-38-2; శార్దూల్‌ 2-0-12-0.

భారత్‌: రోహిత్‌ (సి) ఇఫ్తికార్‌ (బి) షహీన్‌ 86; గిల్‌ (సి) షాదాబ్‌ (బి) షహీన్‌ 16; విరాట్‌ (సి) నవాజ్‌ (బి) హసన్‌ అలీ 16; శ్రేయాస్‌ (నాటౌట్‌) 53; రాహుల్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 30.3 ఓవర్లలో 192/3. వికెట్ల పతనం: 1-23, 2-79, 3-156. బౌలింగ్‌: షహీన్‌ 6-0-36-2; హసన్‌ 6-0-34-1; నవాజ్‌ 8.3-0-47-0; హరీస్‌ 6-0-43-0; షాదాబ్‌ 4-0-31-0.


బౌలర్ల వల్లే గెలిచాం

పాక్‌ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసిన మా బౌలర్లు ఛేదనను సులువు చేశారు. వాస్తవానికి ఇది 190 పిచ్‌ కాదు. ఓ దశలో అయితే పాక్‌ 280 స్కోరు చేస్తుందనిపించింది. కానీ ప్రతీ బౌలర్‌ విశేషంగా రాణించాడు. కెప్టెన్‌గా పరిస్థితులకు తగ్గట్టుగా నేను బౌలర్లను వినియోగించుకున్నాను. మా లక్ష్యంపై స్పష్టతతోనే ఉన్నాం. ప్రత్యర్థి గురించి ఎక్కువగా ఆలోచించడం కానీ.. తేలిగ్గా తీసుకోవడం కానీ జరుగదు. మాకు అన్ని జట్లూ ఒక్కటే. మ్యాచ్‌ రోజు మెరుగ్గా ఆడి ముందుకు సాగాలనుకుంటున్నాం

- కెప్టెన్‌ రోహిత్‌

Updated Date - 2023-10-15T09:07:49+05:30 IST