Team India: రింకూ సింగ్‌ను అందుకే ఎంపిక చేయలేదా? బీసీసీఐ స్పందన ఇదే..!!

ABN , First Publish Date - 2023-07-07T16:07:51+05:30 IST

ఆగస్టు 14న వెస్టిండీస్ పర్యటన ముగిసిన వెంటనే ఆగస్టు 18 నుంచి ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా ఆడనుంది. దీంతో ఐర్లాండ్ టూర్‌కు యువ ఆటగాళ్లను బీసీసీఐ పంపనుంది. జితేష్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్ లాంటి ఆటగాళ్లకు కూడా ఐర్లాండ్ సిరీస్‌లో అవకాశం దక్కనుంది.

Team India: రింకూ సింగ్‌ను అందుకే ఎంపిక చేయలేదా? బీసీసీఐ స్పందన ఇదే..!!

ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో బిజీగా బిజీగా గడుపుతోంది. ఈనెల 12 నుంచి రెండు టెస్టుల సిరీస్‌లో వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది. ఈ సిరీస్ అనంతరం మూడు వన్డేల సిరీస్, ఐదు టీ20ల సిరీస్‌ కూడా ఆడనుంది. ఆగస్టు 3 నుంచి 14 వరకు ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. ట్రినిడాడ్, గయానా, ఫ్లోరిడాలలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మేరకు మూడు ఫార్మాట్లకు సంబంధించిన జట్లను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున సంచలన ఇన్నింగ్స్‌లు ఆడిన రింకూ సింగ్‌కు జట్టులో స్థానం దక్కలేదు. దీంతో బీసీసీఐపై విమర్శల వర్షం కురుస్తోంది.

వెస్టిండీస్‌తో తలపడే టీ20 సిరీస్‌లో కొందరు ఐపీఎల్ స్టార్లకు స్థానం దక్కింది. రాజస్థాన్ రాయల్స్ తరఫున అదరగొట్టిన యషస్వీ జైశ్వాల్, ముంబై ఇండియన్స్ తరఫున రాణించిన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ తొలిసారిగా భారత జట్టులో చోటు సంపాదించారు. యషస్వీ జైశ్వాల్‌కు మూడు ఫార్మాట్లలోనూ స్థానం దక్కింది. అయితే రింకూ సింగ్‌ను విస్మరించడం విమర్శలకు తావిచ్చింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో వీరోచిత ఇన్నింగ్స్‌లు ఆడిన కారణంగా 25 ఏళ్ల రింకూ సింగ్ భారత జట్టులో స్థానం సంపాదిస్తాడని అందరూ ఊహించారు. కానీ అది జరగలేదు. అతడిని దూరంగా ఉంచాలనే సెలెక్టర్ల నిర్ణయాన్ని మాజీ క్రికెటర్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో సోషల్ మీడియాలో బహిరంగంగా విమర్శల దాడి చేశారు.

ఇది కూడా చదవండి: ధోని పుట్టిన రోజు సందర్భంగా హృదయాన్ని దోచుకునే పోస్ట్ షేర్ చేసిన రిషబ్ పంత్..!

అయితే యువ ఎడమచేతి వాటం గల రింకూ సింగ్‌ను వెస్టిండీస్ సిరీస్‌కు తీసుకోకపోవడంపై ఓ బీసీసీఐ అధికారి స్పందించారు. అతడు వచ్చేనెలలో ఐర్లాండ్‌లో జరగనున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడతాడని.. అందుకే విండీస్ టూర్‌కు ఎంపిక చేయలేదని సమాధానం ఇచ్చారు. ఆగస్టు 14న వెస్టిండీస్ పర్యటన ముగిసిన వెంటనే ఆగస్టు 18 నుంచి ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా ఆడనుంది. దీంతో ఐర్లాండ్ టూర్‌కు యువ ఆటగాళ్లను బీసీసీఐ పంపనుంది. ఈ సిరీస్‌కు ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. జితేష్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ లాంటి ఆటగాళ్లకు కూడా ఐర్లాండ్ సిరీస్‌లో అవకాశం దక్కనుంది.

Updated Date - 2023-07-07T16:10:33+05:30 IST