Mother: రైల్వే స్టేషన్లో షాకింగ్ సీన్.. ప్లాట్ఫామ్పై ఓ మహిళ కేకలు విని నోరెళ్లబెట్టిన ప్రయాణీకులు.. ఒడిలో ఓ బాబును పెట్టుకుని..!
ABN , First Publish Date - 2023-09-04T19:56:04+05:30 IST
తన రెండు నెలల శిశువు అమ్మకానికి పెట్టిన ఓ పశ్చిమ బెంగాల్ మహిళ ఉదంతం నెట్టింట వైరల్ అవుతూ కన్నీరు పెట్టిస్తోంది. బీదరాలైన తన వద్దే బిడ్డ ఉంటే ఆకలితో అలమటిస్తాడని భావించిన ఆ తల్లి చిన్నారిని అమ్మకానికి పెట్టింది. ఝార్కండ్లోని జంషెడ్పూర్లో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: రైల్వే స్టేషన్లో ఓ మహిళ..వచ్చే పోయే వారిని ఏదో వేడుకుంటోంది. మహిళ ఒడిలో 2 నెలల వయసున్న శిశువు! బిడ్డ గురించి ఆమె నోట వస్తున్న మాటలు విని అక్కడి ప్రయాణికులు షాకయిపోయారు. అనేక మందికి దుఃఖం ముంచుకొచ్చింది. ‘‘అయ్యా.. నా కడుపున పుట్టినందుకు ఈ బిడ్డ ఆకలితో అలమటిస్తున్నాడు. మనసున్న మారాజులు ఎవరైనా ఉంటే తీసుకెళ్లండి. వాడు కడుపు నిండా తింటూ ప్రశాంతంగా ఎదిగితే చాలు..’’ అంటూ ఆమె అంటున్న మాటలు విని అనేక మంది కన్నీళ్లు ఆపుకోలేకపోయారు(Woman tries to sell her baby in railway station). తనకు ఎంతో కొంత ఇచ్చి చిన్నారిని పట్టికెళ్లమని ఆమె వచ్చేపోయే వారిని వేడుకుంది. ఝార్ఖండ్లోని(Jharkhand) జంషెడ్పూర్లో ఇటీవల కనిపించిన దృశ్యం ఇది.
మహిళ దీనగాధ గురించి పోలీసులకు సమాచారం అందడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చారు. ఆమెను, శిశువును మహిళ సంరక్షణాలయానికి తరలించారు. అక్కడ ఆమెను ప్రశ్నించగా తన దీన గాధ చెప్పుకొచ్చింది. మహిళ స్వస్థలం పశ్చిమ బెంగాల్లోని పురులియా జిల్లాలోని బల్రామ్ పూర్ గ్రామం. అక్కడ ఓ యువకుడితో ప్రేమలో పడ్డ ఆమె అతడితో కలిసి పారిపోయి వచ్చేసింది. ఆ తర్వాత గర్భం దాల్చిన ఆమె రెండు నెలల క్రితం జమ్షెడ్పూర్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ లోపు ప్రియుడు ఆమెను స్టేషన్లో వదిలేసి పారిపోయాడు. దీంతో, ఆమె దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయింది.
మహిళ జీవితాన్ని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు ఆమె ప్రియుడి కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా, మహిళ బంధువుల సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.