Wife and Husband: ఉదయం ఓసారి.. సాయంత్రం మరోసారి.. భార్యకు రోజూ సారీలు చెబుతున్న భర్త.. ఈ వింత శిక్ష వెనుక..!
ABN , First Publish Date - 2023-09-19T20:34:20+05:30 IST
అనుమానంతో తనను వేధిస్తున్న భర్తకు ఓ భార్య వింత శిక్ష విధించింది. 15 రోజుల పాటు అతడు తనకు పొద్దున్నా రాత్రి సారీలు చెబితేనే మళ్లీ కాపురానికి వస్తానని కరాఖండీగా చెప్పేసింది. ఆమె వేసిన శిక్షకు తలొగ్గాడా భర్త. ఆగ్రాలో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇంటర్నెట్ డెస్క్: భర్త ఐదో క్లాస్ పాస్. భార్య బిఏ.. ఇద్దరివి చిరు ఉద్యోగాలే. చాలీచాలని జీతాలతో బతుకుపోరాటం. భార్య కాస్త చదువుకున్నది కావడంతో రోజుకు రెండు ఉద్యోగాలు చేస్తోంది. ఇదే ఆ దంపతుల మధ్య కలతలకు దారి తీసింది. ఓవైపు ఉద్యోగాలు..మరోవైపు ఇల్లు, పిల్లల బాధ్యతలతో ఆ గృహిణి నిత్యం బిజీబిజీగా గడుపుతుంటుంది. దీంతో, భర్తకు ఆమెపై క్రమంగా అనుమానం పెరిగింది. భర్తతో ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయి. చివరకు ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.
చాలా కాలం ఇద్దరూ వేర్వేరుగా ఉండడంతో పిల్లలపై ప్రభావం పడింది. చివరకు వివాదం ఆగ్రాలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రానికి చేరింది. ఈ సందర్భంగా భార్య తన కష్టాలను ఏకరవు పెట్టింది. నెలకు రూ. 7వేల సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకురావడంతో కష్టంగా మారుతున్న తరుణంలో భర్త తనను వేధించడం దారుణమని వాపోయింది. అయితే, తన విధించే శిక్షకు అంగీకరిస్తేనే భర్త వద్దకు తిరిగొస్తానంటూ ఆమె కండీషన్ పెట్టింది(Wife demands husband apologize to her daily twice for the15 days).
పదిహేను రోజుల పాటు భర్త తనకు రోజు ఉదయం సాయంత్రం క్షమాపణలు చెప్పాలంటూ అతడికి శిక్ష విధించింది. భార్యపిల్లలకు దూరమై తన తప్పు తెలుసుకున్న అతడు భార్య వేసిన శిక్షకు తలొగ్గాడు. ఆమె కోరినట్టే 15 రోజుల పాటు పొద్దున్నా సాయంత్రం సారీ చెబుతానని మాటిచ్చాడు. దీంతో, వారి కాపురం చక్కబడింది. ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రా(Agra) నగరంలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.