Snake Bite: పాముకాటుతో చనిపోతే రూ.4 లక్షల పరిహారం.. చాలా మందికి తెలియని ప్రభుత్వ స్కీమ్.. ఏఏ రాష్ట్రాల్లోనంటే..!
ABN , First Publish Date - 2023-08-11T21:46:28+05:30 IST
పాముకాటుతో మరణం సంభవించిన సందర్భాల్లో మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు పలు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. అయితే, ఘటన సంభవించిన వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చి పోస్ట్మార్టం నివేదిక సిద్ధం చేసుకుంటే ఎటువంటి ఆలస్యం లేకుండా పరిహారం అందుతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇది వానాకాలం కావడంతో పాము కాటు ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు, రైతులు పాము కాటు బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పాముకాటుతో మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నాయి(States announce exgratia to snake bite victims). అయితే, ఈ పరిహారం పొందాలంటే బాధితులు పాటు కాటు మరణాలను స్థానిక అధికారుల దృష్టి వెంటనే తీసుకెళ్లాలి. పాము కాటు మరణంగా గుర్తించేందుకు పోస్ట్మార్టం నివేదిక కూడా పరిహారం పొందేందుకు కీలకం.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పాముకాటు మరణాలను విపత్తుగా ప్రకటించింది. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. పాము కాటుతో మరణం సంభవించిన ఏడురోజుల్లోగా బాధిత కుటుంబాలకు ఈ మొత్తం అందుతుందని రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపారు.
ఒడిశా ప్రభుత్వం కూడా పాముకాటు మరణాలకు విపత్తుగా గుర్తించింది. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని వెల్లడించింది.
పాముకాటుతో మరణించిన వారి కుటుంబాలకు కనీసం ఐదు లక్షలు పరిహారంగా చెల్లించాలని మానవహక్కుల కమిషన్ ఇటీవల కేరళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ దిశగా వెంటనే చర్యలు ప్రారంభించాలని రాష్ట్ర చీఫ్ సెక్రెటరీని కోరింది.
2013లో తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి పాము కాటుకు గురైన కేసులో బాధిత కుటుంబానికి లక్ష పరిహారం ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని తమిళనాడు హైకోర్టు గతేడాది ఆదేశించింది.