ఏడేళ్ల తర్వాత వీడిన మిస్టరీ.. ఒకే ఇంట్లో ఆరుగురి మరణానికి అసలు కారణమేంటంటే..!
ABN , First Publish Date - 2023-06-26T22:42:15+05:30 IST
ఝార్ఖండ్ రాష్ట్రంలో ఏడేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసును పోలీసులు తాజాగా ఛేదించారు. ఓ మహిళ తన అత్తారింట్లో ఆరుగురి మరణానికి కారణమైందని తేల్చారు. కోడలి వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి తన భార్యతో సహా ఐదుగురిని చంపి తనూ ఆత్మహత్య చేసుకున్నట్టు తేల్చారు.
ఇంటర్నెట్ డెస్క్: అది 2016 అక్టోబర్ 9. ఝార్ఖండ్లోని రాంచీ నగరం. ఓ అపార్ట్మెంట్లో ఏకంగా ఆరుగురు మరణించారు. ఓ డాక్టర్ తన కుటుంబ సభ్యులకు విషపూరిత ఇంజెక్షన్లు ఇచ్చి ఆపై తానూ కత్తితో పలుచోట్ల గాయాలు చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మరణాలకు కారణం ఎవరనేది ఇంత కాలం మిస్టరీగా మిగిలిపోయింది. స్థానిక పోలీసులు ఈ కేసును తాజాగా ఛేదించారు. ఆ వైద్యుడి కోడలే అతడిని ఈ దారుణానికి పాల్పడేటట్టు వివశుణ్ణి చేసిందని తేల్చారు.
పూర్తి వివరాల్లోకి వెళితే, కొకార్ ప్రాంతానికి చెందిన డా. సుకాంతో సర్కార్ కోడలి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుమును తన భార్య అంజలి, కుమారుడు సుమిత్, సుమిత్ కూతురు సమిత్, తన బంధువు పార్థివ్ భార్య మోమితా, మౌమిత కూతురు సమితకు విషపు ఇంజెక్ష ఇచ్చి చంపేశాడు. ఆపై తనూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లైగింక వేధింపులు సహా పలు కేసులు పెడతానంటూ కోడలు మధుమిత వేధిస్తుండటంతో తట్టుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఏడేళ్లుగా ఈ కేసును విచారిస్తున్న పోలీసులు తాజాగా మధుమితను అరెస్ట్ చేశారు. ఈ అఘాయిత్యాలకు కారకురాలిగా మధుమితపై కేసు నమోదు చేశారు. తన చావుకు మధుమితతో పాటూ ఓ ఎన్జీవో కారణమంటూ డా. సుకాంతో రాసిన లేఖ ఆధారంగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
మధుమిత తొలి నుంచి డా. సుకాంతో ఆస్తిపై కన్నేసింది. ఆ మొత్తాన్ని ఎలాగైన హస్తగతం చేసుకోవాలనే తలంపుతో డా.సుకాంతోపై వేధింపులకు దిగింది. తనపై లైంగిక వేధింపులు, వరకట్నం వేధింపుల కేసు పెడతానని కోడలు బెదిరిస్తోందని అతడు తన సూసైడ్ లెటర్లో రాసుకొచ్చాడు. ఈ నేరంలో మధుమితకు సహకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్జీఓపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు.