NRI: 5 ఏళ్ల తర్వాత స్విడ్జర్లాండ్ నుంచి వచ్చిన కొడుకు.. నడవలేని స్థితిలో తల్లిని చూసి కలత.. ఏదైతే అదైందని అమాంతం ఆమెను ఎత్తుకుని..
ABN , First Publish Date - 2023-05-26T20:30:11+05:30 IST
నడవలేని కన్నతల్లి కళ్లల్లో ఆనందం చూసేందుకు ఓ ఎన్నారై ఆమెను తన పుట్టిన ఊరుకు తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: అయిదేళ్ల తరువాత స్విట్జర్లాండ్ నుంచి వచ్చాడా వ్యక్తి. నడవలేని స్థితిలో తల్లిని చూసి కలత చెందారు. ఆ తరువాత తల్లి కళ్లల్లో మళ్లీ ఆనందం నింపేందుకు ఆయన చేసిన పని నెట్టింట వైరల్గా మారింది. కేరళకు చెందిన ఆ ఎన్నారైపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.
కొన్నేళ్ల క్రితం రోజన్ పరంబిల్ తన తల్లిని ఐరోపా పర్యటనకు తీసుకెళ్లారు. అప్పుడు ఆ మాతృమూర్తి ఎంతో ఆనందపడింది. ఆ తరువాత ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టడంతో ఆయన అయిదేళ్ల పాటు ఇండియాకు రాలేకపోయారు. ఇటీవల వచ్చిన ఆయనకు తల్లి పరిస్థితి చూసి మనసు చివుక్కుమంది. అప్పటికంటే ఆమె మరింత వృద్ధురాలైంది. నడవలేని స్థితికి వచ్చేసింది. కానీ, తల్లిని మరోసారి టూర్కు తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నారా ఎన్నారై.
ఆయనకు గతంలో స్విట్జర్లాండ్లోని ఓ ఓల్డేజ్ హోంలో పనిచేసిన అనుభవం ఉంది. వృద్ధుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసు. దీంతో, చెల్లిని పిలిపించి తల్లిని టూర్ కోసం రెడీ చేశారు. ఆ తరువాత ఆమెను అమాంతం ఎత్తుకుని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టారు. అనంతరం, ఆమెను పుట్టిన ఊరికి తీసుకెళ్లి చూపించారు. చిన్నతనంలో ఆమె తిరుగాడిన ప్రదేశాలకు తీసుకెళ్లారు. అంతేకాకుండా, దారిలో వివిధ పర్యాటక ప్రాంతాలను కూడా చూపించారు. ఇదంతా వీడియో తీసి తన తోబుట్టువలకూ పంపించారు పరంబిల్.
టూర్ తరువాత ఆ మాతృమూర్తి అలిసిపోయినట్టు కనిపించింది. కానీ కొడుకుతో కలిసి మరోసారి ఆ ప్రాంతాలన్నీ తిరిగి రావడంతో ఆ వద్ధురాలి కళ్లల్లో ఆనందం, సంతృప్తి కనిపించింది. నడవలేని స్థితిలో ఉన్న తల్లిని టూర్కు తీసుకెళతానని ఆ ఎన్నారై అంటే తొలుత కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఆయన మాత్రం తల్లి కళ్లల్లో ఆనందం చూసేందుకు ధైర్యంగా ముందడుగు వేశాడు. తన అనుభవంతో ఆమెకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఇంటికి చేర్చారు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట వైరల్గా మారింది.