Anand Mahindra: ఇలాగైతే మేం త్వరలో దివాలా తీసేస్తాం..ఆనంద్ మహీంద్రా కామెంట్..ఇలాంటి కామెంట్ వెనక..
ABN , Publish Date - Dec 24 , 2023 | 05:51 PM
థార్ ఎస్యూవీని 700కే కొంటానంటూ ఓ బుడ్డోడి మాటలు ఆనంద్ మహీంద్రాను అమితంగా ఆకర్షించాయి.
ఇంటర్నెట్ డెస్క్: పిల్లల్లో అమయాకత్వం చూస్తే ఎవరైనా ముచ్చటపడతారు. తెలిసీ తెలియని తనంతో వారు చెప్పే మాటలు, అడిగే ప్రశ్నలు మహా ముద్దుగా ఉంటాయి. వారు మాట్లాడుతుంటే అలాగే వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. కానీ, ఒక్కోసారి పిల్లల మాటలు వింటే దిమ్మతిరిగినంత పనౌతుంది. ప్రముఖ పారిశ్రామివేత్త ఆనంద్ మహీంద్రాకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆయన తాజాగా పంచుకున్న వీడియో నెట్టింట వైరల్గా (Viral Video) మారింది.
వీడియోలో చీకూ అనే కుర్రాడు తన తండ్రితో మహీంద్రా కార్ల కొనుగోలు గురించి ముద్దులొలికే మాటల్లో చెప్పాడు. బుడ్డోడి దృష్టిలో మహీంద్రా థార్ (Thar), మహీంద్రా ఎక్స్యూవీ 700 (XUV 700) మోడళ్లు రెండూ ఒకటే. అంతేకాకుండా.. ఎక్స్యూవీ 700 మోడల్ పేరులో 700 ఉంది కాబట్టి ఏడు వందలకు కొనేయచ్చని అన్నాడు (Cheeku about buying thar for rs 700). బుడ్డోడి మాటల్ని తండ్రి జాగ్రత్తగా రికార్డు చేసి నెట్టింట పెట్టడంతో వీడియో వైరల్గా మారింది. చివరకు ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) వరకూ వెళ్లింది.
వీడియోలో బుడ్డోడి మాటలకు ఆనంద్ మహీంద్రా కూడా ఆశ్చర్యపోయారు. ‘‘నా ఫ్రెండ్ ఈ వీడియో పంపించాడు. దీంతో, అతడి ఇన్స్టా గ్రాం హ్యాండిల్లో కొన్ని వీడియోలు చూశాను. ఆ తరువాత నాకూ బుడ్డోడిని చూస్తే ముచ్చటేసింది. కానీ మనోడి లాజిక్ను అంగీకరించి థార్ను 700 వందలకే అమ్మితే మేం అతిత్వరలో దివాలా తీసేస్తాం’’ అంటూ సరదా కామెంట్ చేశారు.
ఆనంద్ మహీంద్రా పోస్ట్కు నెట్టింట భారీ స్పందన వచ్చింది. కుర్రాడి మాటలు నిజమై థార్ 700లకే దొరికితే బాగుండని కొందరు కామెంట్ చేశారు. పిల్లాడిని చూసి ముచ్చటపడండి కానీ అంతకుమించి హద్దు మీరితే జేబుకు చిల్లే’’ అని మరొకరు కామెంట్ చేశారు. కుర్రాడిని మహీంద్రా ఎస్యూవీ కార్లకు బ్రాండ్ అంబాసిడర్ చేయాలని మరికొందరు అభిప్రాయపడ్డారు.