కృత్రిమ మేధ సమాజానికి ప్రమాదకరం: గూగుల్ చీఫ్ హెచ్చరిక!

ABN , First Publish Date - 2023-04-18T13:36:01+05:30 IST

కృత్రిమ మేధను సరైన విధంగా వినియోగించకపోతే అది సమాజానికి ప్రమాదకరంగా పరిణమిస్తుందని గూగుల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) హెచ్చరించారు. ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన

కృత్రిమ మేధ సమాజానికి ప్రమాదకరం: గూగుల్ చీఫ్ హెచ్చరిక!

కృత్రిమ మేధను సరైన విధంగా వినియోగించకపోతే అది సమాజానికి ప్రమాదకరంగా పరిణమిస్తుందని గూగుల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) హెచ్చరించారు. ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కృత్రిమ మేధ(artificial intelligence)ను సరైన రీతిలో వినియోగించని పక్షంలో హానికరమైన పరిణామాలు తప్పవని ఆయన పేర్కొన్నారు.

ఇటువంటి ముప్పు ఏర్పడకూడదంటే ఏఐ సాంకేతికత(Technology)పై నియంత్రణ తప్పనిసరిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. కృత్రిమ మేధ కారణంగా వచ్చే దుష్ర్పభావాలను(Side effects) తలచుకున్నప్పుడు నిద్రలేని రాత్రులు గడపాల్సివస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కృత్రిమ మేధను సద్వినియోగపరుచుకునే మార్గంలోనే వినియోగించేలా ప్రభుత్వాలు(Governments) వెంటనే దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. అత్యంత వేగంగా కొత్త సాంకేతికతను తీసుకువచ్చేందుకు పలు కంపెనీలు పోటీ పడుతున్నాయని అన్నారు. ఏఐ సాంకేతికతలో అసత్య సమాచారాన్ని రూపొందించే వీలుందని, ఇది సమాజానికి ప్రమాదకరమని పేర్కొన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత పెరుగుతున్న తరుణంలో వాటిని నియంత్రించేందుకు(control) ప్రభుత్వాలు ఓ అంతర్జాతీయ కార్యాచరణను రూపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అణ్వాయుధాల కార్యాచరణ మాదిరిగానే ఇది ఉండాలని సుందర్‌ పిచాయ్‌ పేర్కొన్నారు. ఇదిలావుండగా మానవ మేధతో పోటీ పడుతూ ఏఐ సాంకేతిక(AI technology)తో వస్తోన్న వ్యవస్థలు సమాజానికి, మానవాళికి తీవ్ర ముప్పును తలపెట్టే ప్రమాదం ఉందని ప్రముఖ టెక్‌ సంస్థల(Tech companies) అధిపతులు ఇటీవల పేర్కొన్నారు. ఇటువంటి వ్యవస్థల అభివృద్ధిని నిలిపివేయాల్సిన అవసరం ఉందంటూ రాసిన బహిరంగ లేఖ(open letter)లో ఎలాన్‌ మస్క్‌ లాంటి కీలక వ్యక్తులు కూడా సంతకాలు చేశారు.

Updated Date - 2023-04-18T13:36:38+05:30 IST